6, ఫిబ్రవరి 2021, శనివారం

సుభాషితమ్

 🙏 *శుభోదయమ్*🙏

🌸 *సుభాషితమ్* 🌸


శ్లో|| ద్వావుమౌ పురుషౌ రాజన్ స్వర్గస్యోపరి తిష్ఠతః

ప్రభుశ్చ క్షమాయా యుక్తో దరిద్రశ్చ ప్రదానవాన్


*విదురనీతిః*


తా|| సమర్థుడై యుండియు సహనము కలవాడు,

దరిద్రుడై యుండియు దానములు చేయువాడు 

ఈ ఇరువులు స్వర్గమునకు పై భాగమున నిలుతురు.

🙏✨💖🌷

శ్రీ దేవి భాగవతం - 194 వ అధ్యాయము --

 🙏🙏 *శ్రీ దేవి భాగవతం - 194 వ అధ్యాయము --  వరాహమూర్తి భూమిని ఉద్దరించుట*🙏🙏


*నారాయణుడిట్లనెను:* *పరంతాపా ! ఈప్రకారమగ బ్రహ్మ మన్వాదులు మునివరులు మరీచ్యాదులు నగు వారిని గూడి యాలోచింప సాగెను. అట్లు ధ్యానించుచున్న బ్రహ్మ ముక్కు కొన నుండి వెంటవే బొటన వ్రేలంతటి వరహపోత ముద్బవించెను. ఓ నారదా! బ్రహ్మ చూచుచుండగనే యొక్క క్షణ మాత్రమున నది లోకాద్బుతముగ పెద్ద యేనుగంతగ పెరెగెను. నారాదా! మరీచి ముఖ్య విప్రులతో సనకాది మునులతో గూడి పుటము నుండి యాత్యాశ్చర్యము నుద్బవించినదే! ఇది మొదట బొటన వ్రేలంతగ నుండి పిదప క్షణముననే పర్వతమంత మారినది. ఆహా! ఇతడు భగవానుడో! కాక యజ్ఞమూర్తియో! యని నా మదిలో సంశయము గల్గుచున్నది. అని పరమాత్మరూపుడగు బ్రహ్మ సంశయించుచుండగ వరహ భగవానుడు పర్వతమంత రూపము దాల్చి యెలుగెత్తి గర్జించెను. దిక్కలు పిక్కటిల్లు గర్జా ధ్వనితోనే ద్విజవరులకు బ్రహ్మకు భయముడిపి ధైర్యము గలిగించెను. జన స్తపస్సత్య లోకావాసులగు నమరవరులును దుఃఖములు తొలగించునట్టి ఘర్ఘుర రావమును వినిరి. అంత విప్రులు బుక్‌ సామ ఆధర్వణములందలి ఛంధో మయములగు వచస్సులతో ఆద్య పురుషుని వరాహమును స్తుతించిరి. వారి వేదస్తోత్రము లాలకించి యాద్యుడు భగవానుడు ఈశ్వరుడునగు రాహమూర్తి సంతసించి దయతోడి చూపులతో నీట మునిగెను. అచడు నీచ ప్రవేశించగనే, యతని గట్టి జడల తాకిడికి పీడితుడై ''దేవా! శరణప్రదా! నన్ను గాపాడు మని సాగరుడు మొఱపెట్టకొనెను. సముద్రుడు పల్కిన మాటలు విని యీశ్వరుడగు వరాహవిభుడు జలచరములను చీల్చి చెండాడుచు లోతైన నీటి లోనికి మునింగెను.*


*అట్లు వరాహస్వామి నీటిలోన నిటునటు పరుగెత్తుచు మెల్లమెల్లగ భూమిని వెదకి పట్టుకొని పల్మారు మూర్కొనెను. ఎల్ల భూత కోటుల కాశ్రయ భూతమై నీట మునిగియున్న భూమిని వరాహ దేవదేవుడు తలకోఱలతో పైకెతైను. యజ్ఞ వరాహ పురుషుడట్లు భూమిని తన కోఱల కోనలతో పైకి లేపెను. అది దిగ్గజము పైకి లేపిన కమలమునట్లు శోభ వహించెను. కొనకోఱలతో పుడమినిపైకి లేపిన వరాహదేవుని గని బ్రహ్మ మనువు స్వరాట్టు మున్నగువారు అతని నిట్లు సంస్తుతించిరిః బ్రహ్మ యిట్లనెను. ఓ పుండరీక్షాక్ష! భక్తార్తిభంజనా! సర్వకామ ఫలప్రదా! నీకు విజయమగు గావుత! నీవు సత్య లోకమును సైతము ప్రతాపముచే కురుచ పరచితివి. దేవా! ఏనుగు తొండముపై నలరారు కమలము చందమున నీ కొనకోఱలపై నీ భూదేవి శోభిల్లు చున్నది. తొండముపై కమలమును దాల్చిన గజరాజు శరీరమువలె కోఱలపై భూమిని దాల్తిన నీ వరహ శరీరము సొబగు వహించుచున్నది. దేవేశా! సృష్టిసంహారకారా! నీకు నా నమోవాకములు. దానవ నాశమునకు పెక్కురూపులు దాల్చు భగవానుడు నీవే కదా. ఎల్ల దేవతలకు నిలయమైన తేజోనిధానమా! నీకు మహాశక్తియుక్తుడువు. నీనే ప్రజాసృష్టికి నీచే నియమింప బడితిని. నీ యానతి చోప్పున విశ్వమును పుట్టించి సమయింప చేతును. దేవేశా! మున్ను తగిన కాలము తగిన బలముతో సురవరులు నీ సాహాయ్య సానుభూతులతో నమృతము బొందిరి. ఇంద్రుడు సైతము నీ యానతి ప్రకార మెల్ల సురలచేతపూజితుడై త్రిలోకి సామ్రాజ్యశ్రీ ననుభవించెను. అగ్ని నీ వలన నాయా ప్రాణుల జఠరములందు నెలకొల్పబడి వైశ్వాన రూపమున దేవ - అసుర-నరులను తృప్తి పఱచుచున్నాడు.*


*సమవర్తి సర్వసాక్షి కర్మఫలదాత కర్మసాక్షి పితృపతి ధర్మరాజునగు యముడు నీ నియోగముననే జీవుల కర్మానుసారము ఫలము లొసగు చుండును గాదా! రక్షసాంపతి విఘ్న వినాశకుడు యక్షుడు నగు నైఋతుడు సర్వకర్మ సాక్షియగుట నీ వనలనే కదా! జలాధినాధుడగు వరుణుడును నీ యాజ్ఞ వలననే ప్రాణులకు ప్రాణాధారుడై లోక పాలకుడయ్యెను. గంధవహుడు - జగద్గురువగు వాయువు నీ వలననే సర్వభూతములకు ప్రాణాధారమై లోకపాలకుడు అయ్యెను. యక్షకిన్నరాదుల కధిపతి యగు కుబేరుడు నీ యానతి మేరకు సకల లోకపాలకులలో గౌరవపాత్రుడయ్యెను. ఇక సర్వరుద్రేశుడు - ఈశానుడు అంతకుడు - సకలలోక వంద్యుడగునగు శివుడు సర్వదేవాధి నాయకుడువగు నీ కారణముననే లోకవంద్యుడై విలసిల్లు చున్నాడు. ఇన్ని సర్వ శుభ లక్షణములు గల జగదీశ్వరుడవు భగవానుడవు నగు నీకు నమోవాకములు. నీ యొక్క యంశము వలన నెల్ల దేవతలు లుద్బవించిరి. అట్లు బ్రహ్మచేత నుతింపబడిన యాది పురుషుడగు భగవానుడు తన విలాస వీక్షణ మునులతో బ్రహ్మనము గ్రహించెను. అత్తఱి హిరణ్యాక్షడను ఘోర మహాసురుడు త్రోవకడ్డు నిలువబడగా వరాహ దేవుడు భీమమగు గదతో నతనిని చావమోదెను. అది వరాహ పురుషుడగు భగవానుని శరీరము దానవుని నెత్తుట తడిసెను. అట్లు వరాహదేవుడు భూమిని నీటి నుండి లీలగ తన కోఱలతో పైకి లేపెను. లోకనాథుడగు వరాహమూర్తి భూమిని యథాస్థానమున నుంచి తన స్థానమున కేగెను. ఇట్లు భగవంతుడు భూమి నుద్దరించుట చిత్రము. ఈ వరాహ చరిత్ర ముత్తమము. దీనిని చదివిన - వినిన మానవుడు సర్వపాప విముక్తుడై వైష్ణవ మార్గము బొందును.*


*ఇది శ్రీ దేవి భాగవత మహ పురాణమందలి యష్టమ స్కంధమున ద్వితీయ అధ్యాయము సమాప్తం.*

       🙏🙏🙏🙏🙏

పూర్ణమిదః

 🙏

ఓం పూర్ణమిదః పూర్ణమదం 

పూర్ణాత్ పూర్ణముదచ్యతే|

పూర్ణస్య పూర్ణ మాదాయా పూర్ణమేవావశిష్యతే||

ఓం శాంతి శాంతి శాంతిః 


తాత్పర్యం: 

భగవంతుడు పూర్ణుడు.... పూర్ణానికి పూర్ణం కలిపినా.. పూర్ణంలోంచి పూర్ణం తీసేసినా....

మిగిలేది పూర్ణమే..


ఇదే శ్రుతి వాక్యం. ఈ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుంటే..... జీవితమంతా ఇందులోనే దాగుంది. మోక్ష మార్గం ఇందులోనే దాగుంది..... సమస్త సాధనాల సారం ఇందులోనే ఉంది.


0 + 0 = 0....

0 ౼ 0 = 0....


కానీ.....

0+1 = ఎంత అంటే.....

మనం వెంటనే 1 అని సమాధానం ఇస్తాం.....

ఇక్కడ సున్నా ...ఒకటితో కలవగానే అది 1 గా మారిపోయింది.


0+2 = 2.....

సున్నా 2 తో కలవగానే సున్న మాయమై.....

అది రెండుగా మారిపోయింది... అంటే.....

సున్న దేనితో కలిస్తే అదిగా మారిపోతూంది.


గాఢ నిద్రలో మనం పూర్ణమైన భగవంతుడిగా ఉంటాం. మనకప్పుడు ఏ భావోద్వేగాలు ఉండవు. ఎప్పుడైతే సున్న లాంటి మనం నిద్ర లేవగానే ప్రకృతితో కలుస్తామో... మనం ప్రకృతే ఐపోతున్నాం.


మనం దేనితో కలుస్తామో... దానిగా మారిపోతున్నాం


బాగా గమనించు....

నీ ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడు...

అతడు గతంలో నీకు ఎంతగానో సహాయం చేసాడు.... ఆ వ్యక్తి ని చూడగానే... నీలో అతని పట్ల ఆత్మీయత కలుగుతుంది... నువ్వూ అతనికి ఎలాగైనా సహాయం చెయ్యాలని ఆలోచిస్తావు. 


ఒక వ్యక్తి నిన్ను ఎంతగానో బాధించాడు... అతను కనబడగానే నువ్వు కూడా అతన్ని ఎలాగైనా బాధించాలని ఆలోచిస్తావ్....


ఎదుటి వ్యక్తి ప్రేమతో వస్తే..... నీకూ అతని పట్ల ప్రేమ కలుగుతోంది.....


ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవిస్తే ..... నీకూ అతని పట్ల గౌరవం కలుగుతుంది.....


అంటే.....

మనం ఎదుటి వ్యక్తిలోని ఏ గుణాన్నయితే గమనిస్తున్నామో..... మనం మనకు తెలీకుండానే ఆ గుణంతో కలిసిపోయి... ఆ గుణం గానే మారిపోతున్నాం.....


"మనం దేనితో కలుస్తున్నామో... అది గా మారిపోతున్నాం."


మనలో సున్న (0) లా ఉన్న పరమాత్మ తత్వం..... 

ఎదుటి వ్యక్తీ లోని కోపం తో కలవగానే అది కోపంగా మారిపోయి మనకు కోపం వస్తుంది.


నువ్వు ప్రేమతో కలిస్తే ప్రేమగా..... 

ద్వేషం తో కలిస్తే ద్వేషంగా..... మారిపోతావ్.

 

ఎదుటివారి లోని అహంకారాన్ని చూస్తే నీలో కూడా అహంకారం మొలుస్తుంది.


అందుకే.....

ప్రతి జీవిలోనూ.....

మనిషిలోనూ.....

పరమాత్మ ఉన్నాడని గ్రహించి......

ఆయనతో అనుసంధానం అవ్వు.


అంటే నీలోని పూర్ణాన్ని.....

ఎదుటి వ్యక్తీ లోని పూర్ణంతో కలుపు.....

వచ్చేది పూర్ణమే.


ఎదుటి మనిషిని చూడగానే అతనిలోని దోషాలను గుర్తిస్తే.....

మనం అతనిలో దేన్ని ముందుగా చూస్తామో.....

మనం అదిగా మారిపోతామన్న 

మహా సత్యాన్ని గమనించాలి.


అందుకే ఎలాంటి వారిలోనైనా.....

భగవంతుణ్ణి చూడగల్గి.....

ఆయనతో కలిస్తే....

మనం కూడా భగవత్ తత్వంగా మారిపోతాము.


సదా ఈ సృష్టిలోని ప్రతి వస్తువులోనూ పరమాణు స్వరూపంతో ఉన్న భగవంతునితో అనుసంధానమవుతూ..... ఉండాలి.


హరిః ఓం తత్సత్.... 

సర్వేజనా సుఖినోభవంతు...!!


సేకరణ

శ్రీ అగ్ని మహా పురాణం - 30 వ అధ్యాయం

 🔥🔥 *శ్రీ అగ్ని మహా పురాణం - 30 వ అధ్యాయం - మణ్డలాదివర్ణనం* 🔥🔥


*నారదుడు చెప్పెను :*


*భద్రమండలము మధ్య నున్న కమలమున అంగదేవతా సహిత బ్రహ్మను పూజింప వలెను. తూర్పున నున్న కమలమున పద్మనాభుని, ఆగ్నేయమున నుద్న కమలమున ప్రకృతిని, దక్షిణమున నున్న కమలమున పురుషుని దక్షిణభాగమున అగ్నిదేవతను , నైరృతిదిక్కున నిరృతిని , పశ్చిమదిక్కున నున్న కమలమున వరుణుని , వాయవ్యదిక్కునం దున్న కమలమున వాయువును , ఉత్తరదిక్కునందున్న కమలమున ఆదిత్యుని , ఈశాన్యదిక్కునందున్న కమలమున బుగ్వేద యజుర్వేదములను పూజింపవలెను. రెండవ ఆవరణమునందు ఇంద్రాది దిక్పాలకులను, షోడశ దల కమలమున క్రమముగా సామవేద, అథర్వవేద, ఆకాశ, వాయు, తేజో, జల, పృథివీ, మనః, శ్రోత్ర, త్వక్‌, నేత్ర, రసనా, ఘ్రాణ, భూర్లోక, భువర్లోకములను పూజింపవలెను.*


*పిమ్మట తృతీయవరణము నందలి, ఇరువదినాలుగు దళముల కమలమున క్రమముగ మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక, అగ్నిష్టోమ, అత్యగ్నిష్ణోమ, ఉక్థ, షోడశీ, వాజపేయ, అతిరాత్ర, ఆప్తోర్యామ, వ్యష్టిమనో, వ్యష్టిబుద్ధి, వ్యష్ట్యహంకార, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, జీవ, సమస్టిమనః, సమష్టిబుద్ధి (మహత్తత్వ), సమష్ట్యహంకార, ప్రకృతులను పూజింపవలెను. వీటి అన్నింటియొక్క స్వరూపము శబ్దమాత్రమే. అనగా కేవలము వీటి పేరులు చెప్పి నమస్కరించిన చాలును; మూర్తులను ధ్యానింపవ అవుసరము లేదు. ఇరువది యైదవ అధ్యాయములో చెప్పిన వాసుదేవాదిమూర్తులను తొమ్మిందింటిని, దశవిధ ప్రాణములను, మనో, బుద్ధ్య, హంకార, పాయు, ఉపస్థలను, శ్రోత్ర, త్వక్‌, నేత్ర, రసనా, ఘ్రాణ, వాక్‌, పాణి, పాదములను, ఈ ముప్పదిరెండింటిని, ముప్పదిరెండు దళముల కమలమున ఆర్చన చేయవలెను. ఇవి నాల్గవ అవరణమునందలి దేతవలు. ఈ ఆవరణమున సాంగ సపరివార దేవతాపూజ చేయవలెను.*


*పిమ్మట వెలుపలి ఆవరణమునందు పాయు ఉపస్థల పూజ చేసి, పండ్రెండు మాసాల అధిపతులను, పురుషోత్తముడు మొదలగు ఇరువది యారు తత్త్వములను పూజించవలెను. మాసాధి పతుల పూజ చక్రాబ్జముపై క్రమముగా చేయవలెను. ఎనిమిది, లేదా ఆరు, లేదా ఐదు ప్రకృతులను అచటనే పూజింపవలెను. పిమ్మట మండలములపై వేరు వేరు రంగులు గల చూర్ణములు చల్లవలెను. ఎచట ఏ రంగుగల చూర్ఱము చల్లవలెనో చెప్పదను; వినుము కమలకర్ణిక రంగు పసుపు పచ్చగా ఉండవలెను. సమస్తరేఖులును సమప్రమాణము గలవై తెల్ల రంగలో నుండవలెను. రెండు హస్తముల మండలముల రేఖలు బొటనవ్రేలంత లావుగా ఉండవలెను. ఒక హస్తము మండలమునందలి రేఖలు బొటనవ్రేలి లావులో సగము లావు ఉండవలెను. రేఖలు తెల్లగా ఉండవలెను. పద్మములకు తెల్లరంగును, సంధులకు నలుపు లేదా నీలి రంగు వేయవలెను. కేసరములు ఎరుపు-పసుపురంగులో ఉండవలెను. కోణములం దున్న కోష్ఠములను ఎఱ్ఱని రంగు గల చూర్ణముతో నింపవలెను. ఈ విధముగా యోగపీఠమును యథేష్టముగ అన్ని రంగులతోను అలంకరింప వలెను. వీథిని లతల తోడను, పత్రాదుల తోడను అలంకరింపవలెను. పీఠద్వారమును తెల్లని రంగు గల చూర్ణముతోను, శోభాస్థానములను ఎఱ్ఱని చూర్ణముల తోడను నింపవలెను. ఉపశోభలపై నీలి రంగు చూర్ణము చల్లవలెను. కోణముల శంఖములను తెల్లగా చిత్రింపవలెను. ఇది భద్రమండలముపై రంగు లుంచు విధానము. ఇతర మండలముపై గూడ ఈ విధముగనే అనేకవిధము లగు వర్ణములు గల చూర్ణములు చల్లవలెను. త్రికోణమండలము తెలుపు - ఎరుపు - నలుపురంగులతో అలంకరింప వలెను. ద్వికోణమును ఎరుపు పసుపు రంగులతో అలంకరింపవలెను. చక్రకమలమునందలి నాభిస్థానమును నలుపురంగు చూర్ఱముతో అలంకరిపవలెను.*


*చక్ర కమలము ఆకులకు పసుపు-ఎరుపు రంగులు వేయవలెను. చక్రము అంచును నీలము-ఎరుపు రంగులు వేసి అలంకరింప వలెను. బైట నున్న రేఖలకు తెలుపు, శ్యామము, ఎరుపు, నలుపు, పసుపు* *రంగులు వేయవలెను. వరిపిండి మొదలగువాటిని తెలుపురంగునకు ఉపమోగించవచ్చును. కుసుంధచూర్ణాదులు ఎరుపు రంగునకును, పసుపు పసుపురంగునకును, మాడ్చిన బియ్యపు పిండు నల్లరంగునకును ఉపయోగించును. శమీ* *పత్రాదులచే శ్యామవర్ణము వేయవచ్చును. బీజ మంత్రములను ఒక లక్ష జపించుట చేతను, ఇతర మంత్రములను అక్షరలక్షలు జపించుట చేతను, విద్యలను ఒక లక్షజపించుట చేతను, బుద్ధవిద్యలను పదివేల సార్లు జపము చేయుట చేతను స్తోత్రములను వేయి* *పర్యాయములు జపించుట చేతను, లేదా అన్ని మంత్రములను మొదట ఒక లక్ష జపించుటచేతను, మంత్రశుద్ధియు, ఆత్మశుద్ధియు కూడ కల్గును. రెండవ పర్యాయము ఒక లక్ష* *జపించుటచే మంత్రము క్షేత్రీకృత మగును (సాధకునకు దానిపై నిలకడ ఏర్పడును). బీజ మంత్రజపము మొదట ఎంత సంఖ్యలో చేయబడునో హోమము కూడ అంత సంఖ్యలోనే చేయవలెను. ఇతర మంత్రముల విషయమున హోమము జపసంఖ్యలో పదవ వంతు* *చేయవలెను. మంత్ర పునః శ్చరణము చేయ సంకల్పించినప్పుడు ఒక్కొక్క మాసము వ్రతo ఆవలంబింప వలెను. నేలపై మొదట ఎడమ కాలు ఉంచవలెను. దానము పట్టగూడదు. ఈ రెండు రెట్లు మూడురెట్లు జపము చేసిననే మధ్యమ ఉత్తమ శ్రేణికి చెందిన ఫలముల లభించును*


*ఇపుడు మంత్రమువలన ఫలము సిద్ధించుటకై ఉపమోగించు మంత్ర ధ్యానమును చెప్పెదను - మంత్రము యొక్క స్థూల రూపము శబ్దము. ఇది దాని బాహ్యరూపము. మంత్రముయొక్క సూక్ష్మ రూపము జ్యోతిర్మయ మైనది. ఇదే దాని ఆంతరరూపము. ఇది కేవలము చింతనామయ మైనది. చింతనమునకు కూడు అతీతమైనది మంత్రము యొక్క పర రూపము. వరాహ నరసింహ-శక్తిమంత్రముల స్థూలరూపమునకే ప్రాధాన్యము. వాసుదేవుని రూపము చిన్తనరహిత మని చెప్పబడినది.*


*ఇతరదేవతల చింతామయ మగు ఆంతరికరూపమే సర్వదా ముఖమైనదిగ పరిగణింపబడుచున్నది. విరాట్టు యొక్క స్వరూపము స్థూలము. లింగమయ స్వరూపము సూక్ష్మము. ఈశ్వరుని రూపము చింతారహితము. బీజమంత్రము హృదయ కమలము నందు నివసించునది; అవినాశి; చిన్మయము; జ్యోతి స్వరూపము. జీవాత్మకము. దాని ఆకాశము కదంబ పుష్పముతో సమానము. ఈ విధముగ ధ్యానింపవలెను. కుండలో నుంచిన దీపముయొక్క కాంతి పైకి ప్రసరింపకుండునట్లు నిరుద్ధమై సంహత రూపమున ఒంటరిగా ఉన్నట్లు, మంత్రేశ్వరుడు హృదయము నందు ప్రకాశించుచుండును. అనేక రంధ్రములున్న కుంభములో నుంచిన దీపము కాంతులు ఎన్ని రంధ్రము లున్నవో అన్ని బైటకు ప్రసరించినట్లు జ్యోతిర్మయ బీజ మంత్రముల రశ్ములు నాడుల ద్వారా ప్రసరించుచు దేవాత్మక దేహముతో ప్రకాశించును. నాడులు హృదయమునుండి బయల్వెడలి నేత్రేంద్రియము వరకును ప్రసరించి ఉన్నవి. వాటిలో అగ్ని - సోమాత్మకము లగు రెండు నాడులు నాసికాగ్ర భాగమునందుడును. మంత్రసాధకుడు ఉద్ఘాతయోగముచే శరీరవ్యాపియై యున్న ప్రాణవాయువును చక్కగా జయించి జపధ్యానతత్పరుడై యున్నచో ఆతనికి మంత్రఫలము లభించును. పంచభూతతన్మాత్రల శుద్ధి చేసికొని యోగాభ్యాసము చేయు సాధకుడు కోరికలు కలవాడైనచో అణిమాది సిద్ధులను పొందును. వైరాగ్యవంతు డైనచో ఆ సిద్ధులను దాటి, చిన్మయ స్వరూపముతో నుండి, భరూత మాత్రల నుండియు, ఇంద్రియము లనెడు గ్రహముల నుండి సర్వదా విముక్తుడగును.*


*శ్రీ మదగ్ని మహాపురాణము నందు మండలాదివర్ణన మను ముప్పదవ అధ్యాయము సమాప్తము.*

       🔥🔥🔥🔥🔥

పూజగదిలో

 ⚱️🙏🏻⚱️🙏🏻⚱️🙏🏻⚱️

🙏🏻⚱️🙏🏻⚱️🙏🏻⚱️🙏🏻




*⚱️పూజగదిలో చెంబు పాత్రలో నీటిని ఎందుకు వుంచాలి..??⚱️*




⚱️పూజగదిలో చెంబు పాత్రలో తీర్థం వుంచడం చేస్తుంటాం. సాధారణంగా పూజగదిలో చెంబు లేదా మట్టి పాత్రలో నీటిని వుంచడం చేయొచ్చు. ఇలా నీటిని వుంచి ప్రార్థించడం ద్వారా సర్వ దేవతలు సంతృప్తి చెందుతారని విశ్వాసం. మహా నైవేద్యం కంటే నీటిని వుంచి పూజించడం ద్వారా దేవతలు సంతృప్తి చెందడంతో పాటు కోరిన వరాలను ఇస్తారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.


⚱️రాగి చెంబులో మంచినీటిని వుంచి మంత్ర పఠనం చేశాక ఆ నీటిని సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలుండవు. ప్రతిరోజు పూజ సమయంలో నీటిని వుంచి.. తీర్థంగా సేవిస్తే సమస్త దోషాలుండవు. ఈ నీటిని రోజు మార్చి రోజు చెట్లకు పోయడం చేస్తుండాలి.


⚱️ఇలా చేస్తే ఆ ఇంట వున్న నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. అలాగే పూజ చేసేటప్పుడు గంటను మోగించడం కూడా దుష్ట శక్తులను, ప్రతికూల శక్తులను పారద్రోలేందుకేనని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అలాగే పూజ సమయంలో ప్రకృతిని, పంచభూతాలను ఆరాధించడం ద్వారా ప్రతికూల శక్తులతో ఇబ్బందులుండవు.🌸

🌷శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవాలు🌷*_

 _*🌷శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవాలు🌷*_




త్యాగరాజ ఆరాధన ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగరాజును స్మరించుకుంటూ సంవత్సరానికి ఒకసారి జరిగే సంగీతోత్సవాలు. ఈ ఉత్సవాలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కర్ణాటక సంగీత విద్వాంసులు త్యాగయ్యకు తమ నివాళులు అర్పించడానికి విచ్చేస్తారు. 

*ఈ ఉత్సవం త్యాగరాజు కావేరీ నది ఒడ్డున సమాధి సమీపంలో పుష్య బహుళ పంచమి  నాడు జరుగుతుంది.*  ఈ రోజు సంగీత విద్వాంసులంతా ఆయన సమాధి చుట్టూ కూర్చుని ఆయన స్వరపరిచిన పంచరత్న కీర్తనలను బృందగానంగా ఆలపిస్తారు.  సంగీతాన్ని ఆలపించే విద్వాంసులే కాక భారతీయ శాస్త్రీయ సంగీతాభిమానులు ఆ సంగీతాన్ని వినడానికి అక్కడికి వస్తారు.


*చరిత్ర*

ఈ ఆరాధన ప్రతి సంవత్సరం త్యాగరాజు స్వామి పరమపదించిన *రోజైన పుష్య బహుళ పంచమి* రోజున శ్రీ త్యాగబ్రహ్మ మహోత్సవ సభ ఆధ్వర్యంలో జరుగుతుంది. తమిళనాడు లోని , తంజావూరు జిల్లా , తిరువయ్యూరులోని త్యాగరాజు సమాధి ప్రాంగణంలో ఈ ఉత్సవం జరుగుతుంది.


ప్రస్తుతం జరుగుతున్న ఆరాధనా సంప్రదాయానికి వంద సంవత్సరాలకన్నా తక్కువ వయసే ఉంటుంది. త్యాగరాజు 1847లో మరణించాడు. మరణానికి కొద్దిరోజుల ముందుగా ఆయన సాంప్రదాయ బద్ధంగా అన్నీ త్యజించి సన్యాసిగా మారాడు. ఆయన మరణించిన తరువాత భౌతిక కాయాన్ని కావేరీ నది ఒడ్డున ఖననం చేసి అక్కడే ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఆయన శిష్యులంతా వారి వారి స్వస్థలాలకు చేరుకుని ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతిని వారి ఇళ్ళలోనే జరుపుకునే వారు. 1903 సంవత్సరం వచ్చేసరికి ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆయన స్మారక నిర్మాణం పాడుపడిపోయే స్థితికి వచ్చింది. అప్పుడే , ఆయన దగ్గర విద్యనభ్యసించిన ఇద్దరు విద్యార్థులు దాన్ని సందర్శించడం జరిగింది. వారే ప్రముఖ సంగీత విద్వాంసులు ఉమయాల్పురం కృష్ణ భాగవతార్ , సుందర భాగవతార్లు. వారు తమ గురువు సమాధికి అలాంటి పరిస్థితి కలగడం చూసి చలించిపోయారు. అప్పటికప్పుడే ఆ ప్రాంతాన్ని పునరుద్ధరణకు ఏర్పాట్లు చేశారు. ప్రతిసంవత్సరం ఆయన వర్థంతిని అక్కడే జరపడానికి నిశ్చయించారు.


మరుసటి సంవత్సరం నుంచి సంగీత ప్రపంచంలోని  ఉద్ధండులంతా ఆయన వర్ధంతి రోజు తిరువయ్యూరులోనే జరపాలనీ , వారందరూ కలుసుకుని తమ అభిప్రాయాలను పంచుకోవడానికి వేదికగా ఎంచుకోవాలనుకున్నారు. 1905లో ఈ ఉత్సవాలు పేదవాళ్ళకి పెద్దఎత్తున అన్నదానం , వేద సంప్రదాయాల ప్రకారం పూజలు ఘనంగా జరిగాయి. కృష్ణ భాగవతార్ , సుందర భాగవతార్ ఈ ఉత్సవాలకు ప్రేరణగా నిలిస్తే , తిలైస్థానం నరసింహ భాగవతార్ , తిలైస్థానం పంజు భాగవతార్లు నిర్వాహకులుగా ఆర్థిక సహాయకులుగా ఉన్నారు. అయితే మరుసటి సంవత్సరానికి ఆ ఇద్దరూ అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఇద్దరూ సమాంతరంగా ఉత్సవాలు జరపడం ప్రారంభించారు. మిగతా వారు కూడా చెరో పక్క చేరి రెండు వైరి వర్గాలుగా విడిపోయారు. పెద్దవాడైన నరసింహ భాగవతార్ నిర్వహించే ఆరాధన పెరియ కచ్చి (పెద్ద బృందం) చిన్నవాడైన పంజు భాగవతార్ నిర్వహించే ఆరాధన చిన్న కచ్చి (చిన్న బృందం) గా పేరు పెట్టుకున్నారు. వారిద్దరి మరణానంతరం పెరియ కచ్చి ప్రముఖ వాయులీన విద్వాంసుడు మలైకోట్టై గోవిందసామి పిళ్ళై ఆధీనంలోకి , చిన్న కచ్చి ప్రముఖ హరికథా కళాకారుడు శూలమంగళం వైద్యనాథ భాగవతార్ ఆధీనంలోకి వచ్చింది. నెమ్మదిగా చిన్న కచ్చి ఆరాధనకు ఐదు రోజుల ముందు ప్రారంభమై , ఆరాధన రోజున ముగిసే లాగా , పెద్ద కచ్చి ఆరాధనరోజు ప్రారంభమై తరువాత నాలుగు రోజలపాటు సాగే సాంప్రదాయం మొదలైంది. రెండు వర్గాలు సంగీత ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు. పేదలకు అన్నదానం చేసేవారు. ఆ తొమ్మిది రోజులు సాధారణ ప్రజలకు మంచి వేడుకగా ఉండేదు. కొద్ది రోజులకు రెండు వర్గాలకు మధ్య సయోధ్య కుదిరింది. అప్పట్లో ఆడవాళ్ళను సంగీత ప్రదర్శన చేయనిచ్చేవారు కాదు. దేవదాసీలు తప్ప సాధారణ గృహస్థులెవరూ బహిరంగంగా పాడటానికి , నృత్యం చేయడానికి ఒప్పుకునే వారు కాదు. రెండు వర్గాలు నాదస్వరాన్ని కూడా ప్రదర్శనలలోకి అనుమతించేవారు కాదు.


అప్పట్లో బెంగుళూరు నాగరత్నమ్మ అలాంటి దేవదాసీగా ఉండేది. అప్పటి విద్వాంసులలో ఆమెకు ప్రముఖ స్థానం ఉండేది. త్యాగరాజుకు , సంగీతానికి వీరాభిమాని అయిన ఆమె అప్పట్లో మద్రాసులో నివసించేది. ఆమె ప్రదర్శనల్లో చాలావరకు ఆయన కృతులను ఆలపించేది. ఆయన అనుగ్రహం వల్లనే తనకు మంచి సంపద సమకూరిందని భావించేది. 1921లో , ఆమెకు వయసు మీరింది. పిల్లలు కూడా లేరు. ఆమె తన యావదాస్తినీ త్యాగరాజు యొక్క వారసత్వాన్ని తర్వాతి తరాలకు అందేలా చేయడానికి ఆయన స్మృతులను భద్రపరచడానికి రాసిచ్చేసింది. 1925 లో ఆయన స్మారకానికి ఆలయ నిర్మాణం ప్రారంభించింది. కొంతమంది ఆమె ఆలయాన్ని నిర్మించడానికి వీలుగా సమాధి ఉన్న స్థలాన్ని కొన్నదనీ , మరికొంతమంది ఆ స్థలం గ్రామ పంచాయితీకి సంబంధించినదనీ , ఆమె నిర్మాణం నిబంధనలకు విరుద్ధమైనదనీ , కానీ ఆమె ఉద్దేశం మంచిదవడంతో గ్రామపెద్దలు అందుకు అడ్డు చెప్పలేదనీ భావించారు. ఆ సమాధి దగ్గరే త్యాగరాజు విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసింది. 1926 మొదట్లో ఆ ఆలయానికి కుంభాభిషేకం జరిగింది. రెండు వైరి వర్గాలు ఈ నిర్మాణంలో జోక్యం కలుగజేసుకోలేదు కానీ నాగరత్నమ్మను అక్కడ ప్రదర్శన ఇవ్వడానికి , కనీసం హరికథ చెప్పడానికి ఒప్పుకోలేదు. త్యాగరాజు తన పాటలలో అక్కడక్కడా మహిళపై చేసిన ఆరోపణలను అందుకు కారణంగా చూపించారు.


కానీ నాగరత్నమ్మ వాటన్నింటికీ బెదరక మూడో వర్గాన్ని ప్రారంభించి ఆ ఆలయం వెనుకలే ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించింది. ఇక్కడ చాలామంది మహిళా సంగీత విద్వాంసులు ఆలపించేవారు. దాంతో మిగతా వర్గాల పాపులారిటీ కొంచెం తగ్గింది. ఆమె అంతటితో ఆగకుండా ఆ రెండు వర్గాలను ఆలయంలోకి నిషేధించాలనీ ఆమె నిర్మించింది కాబట్టి ఆ హక్కు తనకే ఉండాలని కోర్టుకు ఎక్కింది. ఆమె కేసు ఓడిపోయింది. కానీ కోర్టు మూడు వర్గాలు ఆరాధనను మూడు సమాన భాగాలుగా విభజించుకుని నిర్వహించుకోమని తెలిపింది.


ఈ సాంప్రదాయం 1940 వరకు అలాగే కొనసాగింది. 1941 యస్.వై కృష్ణస్వామి అన్ని వర్గాలవారిని ఏకం చేశాడు. అప్పటి నుంచి ప్రస్తుతం జరుగుతున్న ఆరాధన సంప్రదాయం మొదలైంది. హరికేశనల్లూరు ముత్తయ్య భాగవతార్ పంచరత్నకీర్తనలను బృంద గానానికి బాగా సరిపోతాయని వాటిని ఎన్నుకున్నాడు. అప్పటి నుంచి అందరూ కలిసి పంచరత్నకీర్తనలను ఆలపించడం సాంప్రదాయంగా మారింది. 1941 కు మందు మూడు వేర్వేరు ప్రదర్శనలు జరపడం వల్ల ఎవరికిష్టం వచ్చిన కీర్తనలు వారు పాడుకునేవారు.


నాగరత్నమ్మ తన మిగతా రోజులు కూడా తిరువయ్యూరు లోనే గడపాలనీ , తన సంపదనంతా త్యాగరాజు స్వామి సేవకే అంకితం చేసింది. అంతే కాకుండా మహిళలు కూడా ఆరాధనల్లో పాల్గొనేందుకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చేసింది. 1952 లో ఆమె చనిపోయినపుడు ఆమెను త్యాగరాజు సమాధికి సమీపంలోనే ఖననం చేసి ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం త్యాగరాజు సమాధిని చూస్తూ ఉన్నట్లు ఉంటుంది. ప్రస్తుతం తిరువయ్యూరులో  ఏటేటా పెరుగుతున్న ప్రేక్షకులకు అనుగుణంగా అతి పెద్ద మండపం నిర్మాణంలో ఉంది.🌷

ఉమా

 *🌷ఉమా🌷*



ఉకారము శివుడు. మా అంటే పార్వతి. ఉమ అంటే శివశక్తులు అని అర్ధం. తారకాసుర సంహారం కోసం దేవతలు పరమేశ్వరిని ప్రార్ధించారు. అప్పుడు ఆమె వారికి ప్రత్యక్షమై నా అంశతో హిమవంతునికి ఒక కుమార్తె పుడుతుంది. ఆమెను శివునకిచ్చి

వివాహం చెయ్యండి. వారిద్దరికీ పుట్టిన కుమారుడు తారకుని సంహరిస్తాడు అని చెబుతుంది. కొంతకాలానికి హిమవంతుని భార్య మేనక గర్భవతి అయి ఆడపిల్లను ప్రసవించింది.

ఆ బాలిక దినదిన ప్రవర్ధమానమైంది. సర్వకాల సర్వావస్థలయందు శివనామాన్నే జపిస్తుండేది. రానురాను తాను శివుణ్ణి తప్ప వేరెవరినీ వివాహమాడను అని తేల్చి చెప్పింది.

ఆ సమయంలో శివుడు విరాగియై తపోదీక్షలో ఉన్నాడు. అతణ్ణి భర్తగా పొందాలంటే తపస్సు ఒక్కటే మార్గం. అందుకని తపస్సు చెయ్యటానికి ఇంటి నుంచి బయలుదేరింది. అప్పుడు తల్లి అయిన మేనక కుమార్తెను వారిస్తూ ఉ - ఓయమ్మా, మా - వద్దు అన్నది. అప్పటి నుండీ ఆమెకు 'ఉమా' అనే పేరు సార్ధకమై పోయింది.


ఉత్తమమైన చిత్తవృత్తి గలది. సూతసంహితలో పరానుభూతియు,  సంసార పాపములను నశింపచేయునదియు, సదాశివుని కన్న మించిన శోభనసంపద గల ఉమ అను పేరు గల అనేక విధాలయిన వైభవముగల ఉత్తమ చిత్తవృత్తికి మ్రొక్కెదను అని చెప్పబడింది. 


విష్ణు శివ బ్రహ్మ వాచకములైన అకార ఉకార మకారములతో కూడిన త్రిమూర్త్యాత్మకమైన ప్రణవస్వరూపిణి. అందుచేతనే ఉమా అంటే - దేవీ ప్రణవము అని చెప్పబడినది.


లింగపురాణంలో శివుడు దేవితో “అకార ఉకార మకారములు నా ప్రణవము. ఉకార మకార అకారములు నీ ప్రణవమందు గలవు' అంటాడు.


మహావాసిష్టంలో “ఓంకార సారశక్తి గలదగుటచే ఉమ అని కీర్తించబడింది" అని చెప్పబడింది. 


ఉమ అంటే చంద్రకళ. ఇది ముల్లోకాలలోను నిద్రించువారి మేల్కొనువారి హృదయాలను ప్రేరేపిస్తుంది.


శివసూత్రాలలో ఇచ్ఛాశక్తి ఉమాకుమారి అని చెప్పబడింది. యోగుల యొక్క ఇచ్ఛకు ఉమ అని పేరు, సింధువనమున ఉండే దేవత. ఉమా అంటే - కాంతి అని అర్ధం.


యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా

అన్ని జీవులయందు కాంతిరూపంలో ఉంటుంది.


కేనోపనిషత్తులో “ఒకసారి దేవదానవులకు భీకరయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు విజయం సాధించారు. ఆ తరువాత వారందరూ ఒకచోట చేరి యుద్ధం రకంగా జరిగింది. తాము ఏ విధంగా విజయం సాధించాము అనే విషయాలను గాధలుగా

చెబుతున్నారు.  ఆ విజయానికి కారణం నేనే అని ప్రతివారూ చెబుతున్నారు. 


అగ్నిదేవుడు అంటున్నాడు. “ఆ యుద్ధంలో నేను నిప్పులు కురిపిస్తుంటే రాక్షసులంతా మాడిమసి అయిపోయారు"


వాయుదేవుడు అంటున్నాడు " ఆయుద్ధంలో నేను చండప్రచండగా గాలులు వీస్తుంటే రాక్షసులు ఆ గాలులకు కొట్టుకుపోయారు"


పరబ్రహ్మతత్త్వం ఈ మాటలు విన్నది. దేవతలంతా గర్వించి ఉన్నారు. వారికి జ్ఞానోదయం చెయ్యాలి అనుకున్నది. అనుకున్నదే తడవుగా వారి ఎదుట పెద్ద భూతాకారంగా ప్రత్యక్షమైంది. దాన్ని చూసి భయపడ్డారు దేవతలు. ఆ భూతం ఏమిటో వారికి అర్ధం కాలేదు. అప్పుడు వారు అగ్నిదేవుని దగ్గరకు వచ్చి, “ఓ దేవా ! నీ పరాక్రమం

వల్లనే రాక్షసులను జయించగలిగాము. ఇప్పుడు ఆ భూతం ఏమిటో కనుక్కోవలసినది అన్నారు. సరేనన్నాడు అగ్నిదేవుడు. ఆ భూతాన్ని సమీపించాడు. అప్పుడు ఆ భూతం

అగ్నిని చూసి ఎవరు నువ్వు ? అన్నది.


అగ్ని: నేను అగ్నిదేవుడను. జాతవేదుడు అంటారు నన్ను.

భూతం : నీ శక్తి ఏమిటి ?

అగ్ని: ఎటువంటి వస్తువునైనా క్షణాల్లో దహించివేస్తాను.

భూతం : అలా అయితే ఈ గడ్డిపరకను దహించు. అంటూ ఒక గడ్డిపరకను చూపించింది. అగ్నిదేవుడు శతవిధాల ప్రయత్నించాడు. గడ్డిపరక కసికందలేదు. అవమానంతో వెళ్ళిపోయాడు అగ్నిదేవుడు. ఆ తత్త్వం ఏమిటో తెలుసుకోవటం తనవల్ల కాలేదన్నాడు. దేవతలంతా ఈ సారి వాయువును ప్రార్ధించారు. ఆ తత్త్వం ఏమిటో తెలుసుకోమని అర్ధించారు. సరేనన్నాడు వాయువు. ఆ తత్త్వం దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు

ఆ భూతం వాయువుతో అన్నది.


భూతం : ఎవరు నువ్వు ?

వాయువు : నేను వాయుదేవుడను. ఆకాశంలో చరిస్తుంటాను. అందుచేత నన్ను మాతరిశ్వుడంటారు.

భూతం : నీ గొప్పతనం ఏమిటి ?

వాయువు : ఏ వస్తువునైనా క్షణాల్లో ఎగరగొట్టగలను.

భూతం : అలా అయితే ఈ గడ్డిపరకను ఎగరగొట్టు.

వాయుదేవుడు తన శక్తి అంతా కూడదీసుకుని గాలులు వీచాడు. గడ్డిపరక కదలను కూడా లేదు. అవమానంతో వెళ్ళిపోయాడు వాయువు, దేవతల దగ్గరకు వెళ్ళి ఆ తత్త్వం ఏమిటో తనకు తెలియలేదు అన్నాడు. ఈ సారి దేవతలు ఇంద్రుణ్ణి వెళ్ళమన్నారు.ఇంద్రుడు బయలుదేరి ఆ తత్త్వాన్ని సమీపించాడు.


ఆ తత్త్వం మాయమైపోయింది. ఆ స్థానంలో ఉమాదేవి ఉన్నది. అప్పుడు ఇంద్రుడు ఆమెతో అమ్మా ! ఇప్పటి దాకా ఇక్కడ ఉన్న తత్త్వం ఏమిటి ? అన్నాడు అందుకు ఉమాదేవి.


దేవేంద్రా ! అదే పరబ్రహ్మతత్త్వము. దాన్ని మీరు గుర్తించలేకపోయారు. ఆ తత్వానికి నాకూ తేడా లేదు. మేమిద్దరమూ ఒకటే అని చెబుతుంది. ఈ రకంగా పరబ్రహ్మను

ముందుగా దర్శించినవాడు కాబట్టే ఇంద్రుడు దేవతలకు రాజయినాడు. అగ్ని వాయువులు దిక్పాలకులయినారు అని చెప్పబడింది.


కాబట్టి ఉమ అంటే ఆ పరబ్రహ్మమే. ఆరు సంవత్సరాల బాలికను కూడా ఉమ అంటారు.


శ్రీమాత్రే నమః🌷

దర్శనం

 🙏🏻🍁🙏🏻🍁🙏🏻🍁🙏🏻

🍁🙏🏻🍁🙏🏻🍁🙏🏻🍁




*🙏🏻దైవ దర్శనం తరువాత అక్కడి నుంచి తిరిగి ఇంటికే రావాలా ?🙏🏻*




దైవదర్శనం మనసును పవిత్రం చేస్తుంది. మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. కష్టాలు  నష్టాలు బాధలు బాధ్యతలు ఎక్కువైనప్పుడు దైవదర్శనం వలన మనసుకి ఉపశమనం లభిస్తుంది. దైవం మనకి అండగా ఉందనే భరోసా కలుగుతుంది. దైవం అనుగ్రహం కన్నా మనకు కావలసిందేముందనే సంతృప్తి మిగులుతుంది.


అందుకే చాలా మంది ఉదయాన్నే ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకుంటూ వుంటారు.కరుణాకటాక్ష వీక్షణాలను తమపై ప్రసరింపజేయవలసిందిగా దైవాన్ని ప్రార్ధిస్తుంటారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించి మనసు కుదుటపడేవరకూ ఆలయ ముఖమంటపంలో కూర్చుంటారు. ఇక సమస్యలు పెద్దగా లేనివారు సైతం నిత్యం దైవదర్శనం చేసుకుంటూవుంటారు. వీరిలో ఒకరకమైన తేజస్సు చైతన్యం స్పష్టంగా కనిపిస్తుంటాయి.


ఇక ఇలా ఆలయానికి వచ్చే భక్తులను ఓ సందేహం సతమతం చేస్తుంటుంది. ఆలయానికి వెళ్లిన తరువాత అక్కడి నుంచి తిరిగి ఇంటికే రావాలా? లేదంటే అక్కడి నుంచి నేరుగా ఎక్కడికైనా వెళ్లవచ్చా? అని అనుకుంటూ వుంటారు. ఈ సందేహానికి సమాధానం మనకి శాస్త్రాల్లో కనిపిస్తుంది. పండితుల ప్రసంగాల్లోనూ వినిపిస్తుంటుంది.


విశేషమైనటువంటి పుణ్య తిథుల్లో ఆలయానికి వెళ్లినప్పుడు, పూజ పూర్తి అయిన తరువాత తిరిగి నేరుగా ఇంటికి రావాలని పెద్దలు చెబుతుంటారు. ఆ తరువాతే దైనందిన వ్యవహారాల నిమిత్తం బయటికి వెళ్లాలని అంటూ వుంటారు.


ఇక సాధారణ రోజుల్లో కూడా దైవదర్శనం తరువాత, అపవిత్రమైన ప్రదేశాలకు, మైలలో వున్న ఇళ్లకు వెళ్లకూడదని చెబుతుంటారు. అందువలన దైవ దర్శనం తరువాత ఆ పవిత్రత చెడని ప్రదేశాలకు ప్రశాంతత చెదరని ప్రదేశాలకు వెళ్ల వచ్చని సూచిస్తుంటారు.


*ఓం నమో నారాయణాయ🙏*

గోరంతదీపం

 🪔🙏🏻🪔🙏🏻🪔🙏🏻🪔

🙏🏻🪔🙏🏻🪔🙏🏻🪔🙏🏻




*🪔గోరంతదీపం కొండంత వెలుగు🪔*


           


దీపాలను వెలిగించడమనేది తెలుసుకున్న నాటినుండే మానవాళి నాగరికత  అభివృద్ధి చెందిందని భావించవచ్చును. ఆదిలో రాళ్ళ రాపిడితో, కట్టెలతోను, జంతువుల కొవ్వుతోను  ఆదిమానవుడు దీపం వెలిగించడం నేర్చుకున్నాడు. తరువాత గవ్వలతో , శంఖులతో దీప ప్రమిదలు తయారు చేయడం మొదలయింది. 

ఆ తరువాత తయారు చేయబడిన  మట్టి ప్రమిదలు ఈనాటికి వాడుకలోవున్నవి.


ఆషాఢ మాసం నుండి ఆశ్వీయుజ మాసంవరకు  విశేషంగా వర్షాలు కురుస్తాయి.  దీనితో అనారోగ్యకారకాలైన క్రిములు వాతావరణంలో వ్యాపిస్తాయి.  కలరా వంటి అంటు వ్యాధులని వ్యాపింప చేస్తాయి. అలాటి అంటువ్యాధుల నిర్మూలనకు  కార్తిక దీపోత్సవాలలో వందలాది మంచి నూనె  దీపాలు  మన గృహాలలో వెలిగించడం ఒక సంప్రదాయంగా మారింది.

ఇది మన సనాతనులు కనిపెట్టి మనకు అందించిన వైజ్ఞానిక సంపద.  


ప్రతీదినమూ  మన ఆలయాలలో వేలకి వేలు దీపాలు వెలిగిస్తారు. ఈ దీపాలకాంతుల శక్తికి  రోగ క్రిములు నశిస్తాయి. 



*🪔కామాక్షి దీపం*


దీపాలలోనే ఇది పవిత్రమైన దీపం.అందరి గృహాలలో వుండవలసిన దీపం. 

పూజకి ముందు  పువ్వులతో  అలంకరించి, బొట్టు పెట్టి మంగళకరంగా దీపం వెలిగించి, నిత్యం పూజించవలసిన దీపం కామాక్షి దీపం. దక్షిణాదిన వంశపారంపర్యంగా యీ కామాక్షి దీపాన్ని  బంగారంలా కాపాడుకోవడం ఒక ఆచారంగా పాటిస్తారు.

కొంతమంది తమ గృహాలలో, వారి పెద్దవారు వెలిగిస్తూ వచ్చిన కామాక్షి  దీపం ఆరిపోకుండా కాపాడుకుంటూ

వస్తారు. 


గృహ ప్రవేశ సమయాలలో,  వధూవరులు  పెళ్ళి పందిరికి ప్రదక్షిణం చేసినప్పుడు , అంధకారాన్ని తొలగించే విధంగా , అనుగ్రహకాంతులు అందరికీ లభించేలాగ దీపాన్ని పట్టుకుని  భయభక్తులతో తీసుకుని వెళ్ళే దీపం కామాక్షి దీపం. తమ కుమార్తె అత్తవారింటికి వెళ్ళేటప్పుడు రెండు  పెద్ద దీప స్ధంభాలవంటి కుందులు, కామాక్షి దీపాన్ని 

సారెగా తప్పకుండా యిచ్చి సాగనంపుతారు.🙏

ఆంజనేయుడు శనీశ్వరుడిని

 ఆంజనేయుడు శనీశ్వరుడిని తలపై 

ఎందుకు కూర్చోబెట్టుకున్నాడో తెలుసా ?🙏


పంచభూతాలను తన వశం చేసుకున్న పరమాత్ముడు ఆంజనేయుడు. అలాగే జ్ఞానేంద్రియాలను కూడా నియంత్రణలో వుంచుకోగలిగిన మహాశక్తిశాలి.. హనుమంతుడు. శ్రీ రాముడు లంకకు చేరుకునేందుకు గాను.. రామసేతు నిర్మాణంలో ఆంజనేయుడు నిమగ్నమై వుండగా.. శనిభగవానుడు హనుమంతుడిని బంధించేందుకు వచ్చాడు. రెండున్నర గంటసేపు హనుమను పట్టేందుకు వచ్చిన శనీశ్వరుడికి ఆంజనేయుడు చుక్కలు చూపించాడు. 


''రెండున్నర గంట పాటు హనుమా నిన్ను చెరపట్టాలి. నీ శరీరంలో ఏదైనా ఒక ప్రాంతాన్ని నాకివ్వమని అడుగుతాడు. అయితే రామసేతు నిర్మాణంలో తానుండగా.. చేస్తున్న పనికి ఆటంకం కలిగిస్తున్నావని హనుమ చెప్తాడు. అయినా నీకు నా తలభాగం ఇస్తాను. అక్కడ ఎక్కి కూర్చోమంటాడు. అంతే శని కూడా హనుమంతుడి తలపై ఎక్కి కూర్చుంటాడు. 


కానీ ఆంజనేయుడు రాళ్లను, కొండలను తన తలపై మోసాడు. భారం తాళలేక శనిభగవానుడు గగ్గోలు పెట్టగా, మాట తప్పకూడదు. రెండున్నర గంట సేపు అలానే వుండాల్సిందేనని షరతు విధిస్తాడు. ఆ రెండున్నర గంటకు తర్వాతే హనుమంతుడు శనీశ్వరుడు తల నుంచి శనీశ్వరుడిని కిందికి దించుతాడు. ఆపై రామ భక్తులను, ఆంజనేయ భక్తులను శనీశ్వరుడు ఇక్కట్లకు గురిచేయకూడదని హెచ్చరించాడు'' అలా శనీశ్వరుడి చెర నుంచి హనుమంతుడు తప్పుకున్నాడు. 


అలాంటి మహిమాన్వితుడైన హనుమంతునికి తులసీ మాలను సమర్పించుకుంటే శనిగ్రహ బాధల నుంచి గట్టెక్కవచ్చు. ఆంజనేయునికి రామనామం అంటే మహాప్రీతి. హనుమజ్జయంతి రోజున ''రామ రామ రామ'' అనే మంత్రాన్ని పఠించడం చేయొచ్చు. 


''ఓం ఆంజనేయాయ విద్మహే

వాయుపుత్రాయ ధీమహి

తన్నో హనుమాన్ ప్రచోదయాత్'' అనే మంత్రాన్ని 11 సార్లు పఠించడం ద్వారా శనీశ్వర గ్రహ దోషాల నుంచి గట్టెక్కవచ్చు. హనుమజ్జయంతి రోజున తులసీమాల సమర్పించడం, తులసీ ఆకులతో అర్చన చేయడం ద్వారా సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆ రోజున వడమాల సమర్పించడం, వెన్నతో ఆంజనేయుడిని అలంకరించడం, అన్నదానం చేయడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు. 


మనోబలం, బుద్ధిబలం, శరీరబలం, ప్రాణ బలం కోసం ఆంజనేయ స్వామిని స్తుతించడం చేయాలి. ఆంజనేయ ఆరాధన ద్వారా వీరం, వివేకం పెంపొందుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.🙏