🙏🕉️శ్రీమాత్రేనమః.శుభోదయం🕉️🙏 🌹మంచి మానవ సంబంధాలు, దయగల గుణము, ప్రశాంతమైన మనస్సు అనేవి మన సాధించిన విజయాలు.. మనకు వచ్చే అవార్డులు.. మన డబ్బు, మన హోదా మరియు చదువు కంటే కూడా ముఖ్యమైనవి🌹 *ప్లీజ్, సారీ, థాంక్స్ అనే పద త్రయం వినడానికి మరియు చూడడానికి సాధారణంగా కనిపిస్తాయి* 🌹కాని అద్భుతాలు ఎన్నో ఎన్నెనో నిస్సందేహంగా అవి బందు మరియు స్నేహసంబంధాలను సమన్వయపరచి నిత్య జీవితంలో కార్య వ్యవహారాలను చక్కదిద్దుతాయి.. బంధాలను అనుబంధాలను నిలబెడతాయి.. అనుకున్న కార్యాలను నెరవేరుస్తాయి🌹వినయంతో కూడిన ప్లీజ్ పదాన్ని ఉపయెగించి ఎదుటి వాళ్ళని మనసు మోప్పించి సహాయం పొండవచ్చు.. మన ద్యారా జరిగిన తప్పును గర్తించి సారీ అని చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళ కోపానికి గురి కాకుండా సురక్షితంగా ఉండవచ్చు.. ఎదుటి వాళ్ళు నుంచి పొందిన మేలును కృతజ్ఞతలు తెలిపే థాంక్స్ ఇరువురికి ఎంతో ఆత్మ సంతృప్తిని కలిగిస్తుంది🌹అందుకే భగవంతుడు చెబుతారు..మనిషి మాటల్లో తీపి ధనం ఉండాలి.. కానీ మాట తీరు వ్యవహారం కత్తెరలా ఉండకూడదు..సూది దారం వలె అందరి మనస్తత్వలను ఒకటి చేశాల ఉండాలి.. అందుకే మంచి ఆలోచన మంచి మనసులో మెలగాలి అందరూ🌹🌹మీ అల్లం రాజు* భాస్కరరావు . శ్రీ విజయ ఆయుర్వేదిక్ & జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం 9440893593.9182075510* 🙏🙏🙏
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
11, జనవరి 2025, శనివారం
వేద ఆశీర్వచనం.
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5125*
*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం - హేమంత ఋతువు - పుష్య మాసం - శుక్ల పక్షం - ద్వాదశి & త్రయోదశి - రోహిణీ - స్థిర వాసరే* (11.01.2025)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
----------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
వాసనా త్రయం
వాసనా త్రయం దేహా వాసన, లోక వాసన శాస్త్ర వాసన
*శాస్త్రాన్ని
ఎంత తెలుసుకున్నా - ఎన్ని సాధనలు చేస్తున్నా ఎందువల్ల ఆత్మసాక్షాత్కారం
కలగటం లేదు?* అంటే బుద్ధికి సూక్ష్మత్వం - శుద్ధత్వం లేకపోవటం వల్లనే అని
తెలుస్తున్నది.
*బుద్ధికి శుద్ధత్వం ఎందుకు లేదు?* మలిన వాసన వల్ల –
*మలిన వాసనలు ఏవి?* - 1.లోక వాసన 2.శాస్త్ర వాసన 3.దేహ వాసన.
*(1)
లోక వాసన* :- ఇతరులు నన్ను స్తుతించేటట్లు - నిందించకుండా ఉండేటట్లు పనులు
చేయాలి అనే భావనతో పని చేయటం లోక వాసన. ఏం చేయాలి? ఇతరుల నిందాస్తుతులను
పట్టించుకోకుండా తన హితం కొరకు పని చేయాలి.
*(2) శాస్త్ర వాసన* :- (i) శాస్త్రాలన్నీ చదివి పూర్తి చేయాలి అనే పాఠ వ్యసనం.
(ii) అభ్యాసం కోసం అనేక విధాలైన శాస్త్రాలను సంగ్రహించి, వెదకటమనే బహు శాస్త్ర వ్యసనం
(iii)
వేద శాస్త్రాలలో విధించబడిన కర్మానుష్టానమునందే జీవిత కాలమంతా
గడిపివేయటమనే అనుష్టాన వ్యసనం. కర్మలయందు శ్రద్ధ అనే జడత్వాన్ని
విడిచిపెట్టాలి. ఈ కర్మ వాసన పునర్జన్మకు కారణమౌతుంది. అలాగే శాస్త్ర
వాసన దర్పం పెరగటానికి తోడ్పడుతుంది.
మరేం చేయాలి? -
పరమార్థ తత్వాన్ని తెలుసుకొనేంతవరకే శాస్త్రాలను తిరగేయాలి. స్పష్టంగా
తెలుసుకున్న తర్వాత ఆచరణకు ప్రాధాన్యత నివ్వాలి.
*(3)
దేహ వాసన* :- దేహాత్మ బుద్ధి. దేహమే ఆత్మ (నేను) అనే బుద్ధి. దేహ పోషణ
యందే కాలమంతా వెచ్చించటం. కంఠాన్ని బాగుచేసుకోటానికి ఔషధాలు సేవించుట,
సుగంధ తైలాలు, వస్త్ర భూషణాలు ఉపయోగించటం, పుణ్యం కోసం గంగా స్నానాలు,
సాలగ్రామాదులు సంపాదించటం, దోషాలు పోగొట్టుకొనుటకు శౌచం, ఆచమనం ద్వారా
పవిత్రమగుట - ఇవన్నీ జ్ఞాన ప్రతి బంధకాలు -
ఈ 3 రకాల వాసనలు తొలగించుకుంటే బుద్ధి శుద్ధమౌతుంది. ఇక *బుద్ధికి సూక్ష్మత్వం ఎందుకు లేదు? ఎలా వస్తుంది?* -
రాజస తామస వృత్తుల వల్ల (ఆలోచనల వల్ల) సూక్ష్మత్వం లేదు. ఆ వృత్తులను
నిరోధించి బుద్ధికి పదును పెడితే సూక్ష్మమవుతుంది. దానిని రెండు విధానాల
ద్వారా సాధించాలి.
(i) యోగం. (ii) విచారణ (వివేకం)
*(i)* ధ్యాన యోగం ద్వారా రాజస తామస వృత్తులను నిరోధించవచ్చు.
*(ii)* ఆత్మ విచారణ ద్వారా బుద్ధి సూక్ష్మమవుతుంది.
*ఆత్మ విచారణ అంటే* -
దేహమనోబుద్ధుల కన్న - వేరుగా ఉన్నది, పంచకోశాలకు ఆవల ఉన్నది, మూడు
అవస్థలకు సాక్షిగా ఉన్నది ఆత్మ అని విచారణ చేసి గ్రహించాలి, ఆ ఆత్మ నేనేనని
మళ్ళీ మళ్ళీ స్మరించాలి.
ఇలా వాసనాక్షయం ద్వారాను,
ధ్యాన యోగ, ఆత్మ విచారణ ద్వారాను బుద్ధి శుద్ధమౌతుంది, సూక్ష్మమవుతుంది.
ఇట్టి బుద్ధి తత్వంలో నిలిస్తే - ఆత్మలో నిలిస్తే - బ్రహ్మంలో నిలిస్తే
సమాధిలో నిలిస్తే ఆత్మానుభూతి కలుగుతుంది.
శ్రీ ఆదిశంకరాచార్యులవారి ఆత్మబోధ.
శ్రీ ధన్వంతరి ఆలయం
🕉 మన గుడి : నెం 986
⚜ కేరళ : నెల్లువాయ, త్రిశూర్
⚜ శ్రీ ధన్వంతరి ఆలయం
💠 మహావిష్ణువు యొక్క వివిధ అవతారాలు మరియు దాని ప్రతిమ గురించి తెలుసుకున్నప్పుడు, మహావిష్ణువు యొక్క 10 అవతారాలు మాత్రమే మనం సాధారణంగా ఎందుకు ప్రస్తావిస్తాము అని ఆశ్చర్యపోతాము
💠 నిజానికి కూర్మావతారం (తాబేలు అవతారం) సమయంలో మహా విష్ణువు మోహినిగా (అమృతాన్ని పంచిపెట్టిన అమ్మాయి) మరియు అమృతం ధన్వంతరి (ఖగోళ వైద్యుడు) కుండను తీసుకువచ్చిన వ్యక్తిగా కూడా వచ్చాడు.
💠 తాబేలు అవతారం ప్రసిద్ధి చెందినప్పటికీ ఈ ఇద్దరు మోహిని మరియు ధన్వంతరి గురించి మాట్లాడలేదు.
💠 ఉత్తర భారతదేశంలో ధన్వంతరికి అంకితం చేయబడిన ఆలయాలు చాలా లేవు కానీ దక్షిణాదిలో కొన్ని ఉన్నాయి.
దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలలో కేరళలో అనేక ధన్వంతరి ఆలయాలు ఉన్నాయి. వీటిలో నెల్లువాయ, తొట్టువ, కూజాకొట్టు, అనక్కల్, మారుతోర్ వట్టం, ప్రయిక్కరా ప్రాంతాలు ఎక్కువగా సందర్శిస్తారు.
💠 వైద్యశాస్త్ర దేవుడుగా భావింపబడుతున్న ధన్వంతరి పేర కేరళ రాష్ట్రంలోని నెల్లువాయ దేవాలయం వెలసింది.
భారతదేశంలోని అరుదైన ధన్వంతరి దేవాలయాలలో ఇది ఒకటి.
💠 మనవారు ధన్వంతరిని విష్ణుమూర్తి అవతారంగా భావిస్తున్నారు. దేవ దానవులు కలిసి పాల సముద్రాన్ని వాసుకి సర్పాన్ని కవ్వంగా చేసి చిలికినప్పుడు ధన్వంతరి ఉదయించినట్లు ప్రాచీన హిందూపురాణం చెబుతోంది.
ఆయన చేతిలో అమృత కలశం తీసుకుని తన దివ్య ఆకారంతో వెలువడినట్లు రాయబడింది.
💠 అన్ని రకాల రోగాలను ఈ అమృతం దూరం చేస్తుంది. ఆ కారణంగా ఆయుర్వేదాన్ని, అల్లోపతి మందుల్ని అధ్యయనం చేస్తున్న ప్రతి ఒక్కరితోపాటు రోగ విముక్తిని కోరే లక్షలాది మంది రోగులకూ ఈ క్షేత్రం పవిత్రమైన ముఖ్య యాత్రాస్థలంగా మారింది.
🔆 స్థల పురాణo
💠 ఈ రోజు ఆలయంలో ఉన్న ధన్వంతరి విగ్రహాన్ని ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని తల్లిదండ్రులు వసుదేవ మరియు దేవకి పూజించారని నమ్ముతారు.
ఈ విగ్రహం ఆలయానికి చేరుకోవడానికి ఒక కథనం ఉంది.
💠 నెల్లువాయ గ్రామస్థులు ఆయుర్వేద ప్రభువు ధన్వంతరికి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అక్కడ అనువైన విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు సమీపంలోని మురింగతేరిలోని చిన్న కొండపై నుంచి కృష్ణ శిలను తీసుకొచ్చి దానిపై విగ్రహాన్ని నిర్మించారు.
💠 ఆలయ నిర్మాణం పూర్తయి, సంప్రోక్షణకు సన్నాహాలు జరుగుతుండగా, ఎక్కడినుండో ఇద్దరు తెలివైన అబ్బాయిలు ముందుకు వచ్చి, ప్రతిష్టించడానికి ప్రతిపాదించిన విగ్రహం కంటే దివ్యమైన విగ్రహం ఉందని చెప్పారు.
దీంతో వారితో పాటు సమీపంలోని వరిగడ్డి వద్దకు వెళ్లిన స్థానికులు ఈ విగ్రహాన్ని గుర్తించి ఆలయంలో ప్రతిష్ఠించారు.
💠 తొలుత ప్రతిష్ఠించాలనుకున్న విగ్రహాన్ని సమీపంలోని క్షేత్రంలో ప్రత్యేక ఆలయంలో ప్రతిష్ఠించారు. అనంతరం దానిని ధన్వంతరి క్షేత్ర ప్రాకారానికి తరలించారు.
💠 ఈ క్షేత్రాన్ని నేడు 'చెరుతేవర్' అని పిలుస్తారు. చోరేవను విష్ణువుగా భావిస్తారు. విగ్రహాన్ని కనుగొన్న పిల్లలు అశ్విని దేవతలు, గొప్ప వైద్యం చేసేవారు అని నమ్ముతారు.
💠 నెల్లువాయ ఆలయానికి ప్రసిద్ధ గురువాయూర్ ఆలయంతో చాలా దగ్గరి సంబంధం ఉంది.
రెండు దేవాలయాల విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి (గురువాయూరప్పన్ తూర్పు ముఖంగా మరియు నెల్లువై తేవర్ పడమర వైపు).
💠 ఇక్కడి గర్భగృహం రాగిరేకులతో కప్పబడి ఉంది. సరిగ్గా మధ్య భాగంలో 4 భుజాల ధన్వంతరి విగ్రహం విరజిల్లుతోంది.
ఈ నాలుగు చేతులలో వరుసగా అమృతం, జలగ, చక్రం, గద ఉన్నట్లు విగ్రహం చెక్కబడింది.
💠 జలగలు చిత్తడి ప్రదేశాలలో కనిపించే గగుర్పాటు పురుగులు. అవి సాధారణంగా రక్తం పీల్చేవి కానీ ధన్వంతరి దానిని తన చేతిలో ఎందుకు పట్టుకుంటాడు అనేది ప్రశ్న?
💠 సముద్ర మథన సమయంలో ధన్వంతరితో జలగలు వచ్చాయి. శరీరం నుండి గడ్డకట్టిన రక్తాన్ని బయటకు తీయడానికి ఆయుర్వేదం జలగలను ఉత్తమమైనదిగా పరిగణిస్తుంది. యుద్ధంలో సైనికులకు రక్తం గడ్డకట్టినప్పుడు మరియు తెగిపోయిన అవయవాలను తిరిగి జత చేయడంలో పురాతన భారతదేశంలో జలగ చికిత్సను ఉపయోగించారు, ఇక్కడ జలగలు క్రమానుగతంగా సిరల నుండి స్తబ్దుగా ఉన్న రక్తాన్ని కోలుకునే వరకు పీల్చుకునేవి. అద్భుతమైన భాగం ఏమిటంటే, జలగ కాటు అనుభవించబడదు, ఎందుకంటే దాని లాలాజలం మత్తుమందు లక్షణాలను కలిగి ఉంటుంది; రక్తం గడ్డకట్టకుండా నిరోధించే ఎంజైమ్లు మరియు సీరమ్లు కూడా ఇందులో ఉన్నాయి.
💠 ఇంగ్లీషు నెలలు నవంబర్, డిసెంబరులో ఈ నెల్లువాయలో నెల్లువాయ ఏకాదశి పేరుతో వార్షికోత్సవాలు జరుగుతాయి.
ఈ ఉత్సవాలు 37 రోజులపాటు జరుగుతాయి.
💠 ఈ ఉత్సవాల సందర్భంగానే ముఖ్యంగా ఏకాదశి రోజున మొత్తం కేరళ రాష్ట్రంలో ఉన్న ఆయుర్వేద వైద్యులు, అల్లోపతి వైద్యులు గుమికూడి ధన్వంతరి దేవుడి ఆశీస్సులను వ్యక్తిగతంగా పొందడానికి ఆ రోజున నెల్లువాయలో గడుపుతారు.
💠 ఈ ఆలయం త్రిస్సూర్ జిల్లాలో ఉంది మరియు కేరళలోని త్రిస్సూర్ మరియు గురువాయూర్ మధ్య ఉంది.
రచన
©️ Santosh Kumar
తిరుమల సర్వస్వం 115-*
*తిరుమల సర్వస్వం 115-*
*తాళ్ళపాక అన్నమాచార్యుడు 3*
*అలమేలు మంగమ్మ దర్శనం*
ఇంతలోనే, *"అన్నమయ్యా! లే నాయనా!"* అంటూ ఓ స్త్రీమూర్తి ఆప్యాయమైన పిలుపు స్పహతప్పి పడిఉన్న అన్నమయ్యకు వినబడింది. పుత్రవాత్సల్యం తొణికిసలాడుతున్నట్లున్న ఆ మధురస్వరం, తన తల్లి లక్కమాంబ తనను లాలనతో పిలుస్తున్నట్లుగా అనిపించి, కొద్దిగా ఊరట చెందాడు. నడిమార్గంలో దిక్కుతోచని స్థితిలో ఉన్న తనను కాపాడమని ఆ స్త్రీమూర్తిని వేడుకున్నాడు. దయార్ద్ర హృదయురాలైన ఆ తల్లి, *"నాయనా! అందరికీ అమ్మనైన నేను అలమేలుమంగను. శ్రీవేంకటేశ్వరుని హృదయంలో కొలువై ఉంటాను. ఇప్పుడు నీవు సాక్షాత్తు పరమ పవిత్రమైన తిరుమలక్షేత్రం పై ఉన్నావు. ఈ క్షేత్రం అంతా సాలగ్రామమయం. కొండపైనున్న శ్రీనివాసుడు కూడా సాలగ్రామ శిలారూపమే! అందువల్ల పాదరక్షలతో ఈ కొండను ఎక్కడం మహాపాపం. నీ కాలికి ఉన్న పాదరక్షలను విడిచి శిఖరాన్ని అధిరోహించు. నీ మనోరథం సిద్ధిస్తుంది."* అంటూ దారీ-తెన్నూ తెలియని అన్నమయ్యను ఓదార్చింది.
అప్పటికే శ్రీనివాసుని గురించి, అలమేలుమంగను గురించి చాలా విషయాలు తెలుసుకొని ఉన్న అన్నమయ్యకు, తన తప్పు తెలిసింది. వెంటనే కాలిజోళ్లను దూరంగా విసిరి వేశాడు. అలమేలుమంగ దర్శనంతో తన జన్మ చరితార్థం అయినట్లుగా భావించి, నిండు మనసుతో తన తప్పు క్షమించమని ఆ లోకపావనిని వేడుకున్నాడు. ఆ తల్లి తనతో తెచ్చిన శ్రీవారి అన్నప్రసాదాలను-గోరుముద్దలుగా చేసి బాలుడైన అన్నమయ్యకు తినిపించి, తనను *"ముల్లోకాలకు తల్లి"* గా చాటుకుంది.
శ్రీవారి ప్రసాదం!! అందునా సాక్షాత్తు అమ్మవారి చేతితో తినిపించబడింది.. ఇంకేముంది! అన్నమయ్యలో సరిక్రొత్త ఉత్సాహం ఉరకలు వేసి, ఒక మహత్తరమైన ఆధ్యాత్మికశక్తి ఆవహించింది
*జొచ్చితి తల్లీ! నీ మరగు*
*సొంపుగ నీ కరుణా కటాక్షమె* *ట్లిచ్చెదొ నాకు నేడు పర*
*మేశ్వరి! యో యలమేలుమంగ! నీ..*
అంటూ ప్రారంభించి, అలమేలుమంగను ఓ నూరు పద్యాల శతకంతో ఆశువుగా స్తుతించాడు.
దాంతో పరమానందం చెందిన అలమేలుమంగ, అన్నమయ్యను మనసారా ఆశీర్వదించి, వేంకటాచలాన్ని స్వయంగా సేవించి, తరించి, ఇతరులను కూడా తరింపజేయమని ఆదేశించి అదృశ్యమయ్యింది. అమ్మవారి అనుజ్ఞను శిరసావహించిన అన్నమయ్య, తరువాతి కాలంలో పలుమార్లు శ్రీవారి దర్శనం చేసుకోవడం ద్వారా తాను తరించి, శ్రీవారి యెడ భక్తిభావం ఉట్టిపడే తన రసరమ్య గీతాలాపనతో కోటానుకోట్ల భక్తులను తరింపజేశాడు.
కారణజన్ముడు అన్నమయ్య తిరుమలశిఖరాన్ని చేరుకోవడం, శ్రీవేంకటేశ్వరుని దివ్యమంగళమూర్తిని దర్శించుకోవడం, ఆయాసందర్భాల్లో అన్నమయ్య నోటినుండి ఆశువుగా అనేక గీతాలు వెలువడడం వివరంగా తెలుసుకుందాం.
కరుణామయు రాలైన అలమేలుమంగమ్మ చేతి ప్రసాదసేవనంతో, ఆమె ప్రోత్సాహంతో, అన్నమయ్య నిరాశానిస్పృహలు పటాపంచలయ్యాయి. ఉత్సాహం రెట్టింపైంది. ప్రతి రాయిలోను, ప్రతి చెట్టులోనూ, ప్రతి మెట్టులోనూ, అన్నింటిలోనూ శ్రీవారే గోచరిస్తున్నారు. శ్రీవేంకటేశ్వరునిపై రాగరంజితమైన కీర్తనలను అలవోకగా ఆలపిస్తుండగా, భక్తులు ఒక్కొరొక్కరుగా అన్నమయ్యను అనుసరిస్తూ, పదంలో పదం కలుపుతున్నారు. ఇంతలోనే అల్లంత దూరంలో వేంకటాద్రి పర్వత శిఖరం గోచరించింది. ఇనుమడించిన ఉత్సాహంతో శేషాచల శిఖరాలను ఆర్తిగా అభివర్ణించాడు:
*అదివో అల్లదివో శ్రీహరి వాసము*
*పదివేల శేషుల పడగల మయము ||*
*అది వేంకటాచల మఖిలోన్నతము*
*అదివో బ్రహ్మాదుల కపురూపము*
*అదివో నిత్యనివాస మఖిల మునులకు*
*అదె చూడుడదె మ్రొక్కు డానందమయము ||*
*తాళ్ళపాక అన్నమాచార్యుడు-2*
*"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన*
*వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"*
*తిరుమల కొండపై అన్నమయ్య*
మోకాళ్ళపర్వతాన్ని వడివడిగా ఎక్కుతూ, మధ్యదారిలో ఉన్న *"త్రోవభాష్యకార్ల సన్నిధి"* లో భగవద్రామానుజుల వారిని సేవించుకుని, తనను అనుసరిస్తున్న భక్తబృందంతో పాటుగా శేషాచల శిఖరాన్ని చేరుకున్నాడు. ముందుగా స్వామిపుష్కరిణిలో పవిత్ర స్నానమాచరిస్తూ -
*సకల గంగాది తీర్థస్నాన ఫలములివి*
*స్వామి పుష్కరిణి జలమె నాకు...*
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
11-54-గీతా మకరందము
11-54-గీతా మకరందము
విశ్వరూపసందర్శనయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అ ||భగవత్స్వరూపదర్శనము మఱి దేనివలన లభించునో తెలియజేయుచున్నారు -
భక్త్యా త్వనన్యయా శక్య
అహమేవం విధోఽర్జున |
జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన
ప్రవేష్టుం చ పరన్తప ||
తా:- శత్రువులను తపింపజేయువాడా! ఓ అర్జునా! ఈ విధమగు రూపముగల నేను అనన్యభక్తిచేత మాత్రమే యథార్థముగ తెలిసికొనుటకును, చూచుటకును, ప్రవేశించుటకును, సాధ్యమైనవాడ నగుచున్నాను.
వ్యాఖ్య:- క్రిందటి శ్లోకమున వేదపఠన యజ్ఞాదులవలన భగవద్దర్శనము కాజాలదని చెప్పబడినది. మఱిదేనిచేత భగవద్దర్శనము కాగల్గునో ఈ శ్లోకమందు విపులముగ చెప్పబడినది. భగవత్సందర్శనమునకు ఉపాయము చెప్పబడిన శ్లోకమగుటచే ఇది అతి ముఖ్యమైనది. ముముక్షువు లిద్దానిని బాగుగ మననముచేసి అందలి భావములను కార్యాన్విత మొనర్పవలెను.
అనన్యభక్తివలననే మనుజుడు పరమాత్మను సందర్శింపగల్గునని యిట వచింప బడినది. భక్తి అను పదమునకు ‘అనన్య’ అను విశేషణముచేర్చుటవలన, ఇతరములగు ప్రాపంచిక పదార్థములపై ఆసక్తినుంచక కేవలము పరమాత్మయందే అనన్యమగు ప్రేమ, అనురాగము, ఆసక్తి కలిగియుండవలయునని స్పష్టమగుచున్నది. పంపకములేని భక్తి, మఱియొక వస్తువుపై చెదిరిపోనిభక్తి, పరమాత్మతప్ప, అన్యవస్తువును అభిలషింపని భక్తి అనన్యభక్తి యనబడును. సామాన్యముగ జనులయొక్క భక్తి కొంత గృహారామాదులందు, దారాపుత్రులందు, సంపదలయందు, కీర్తిప్రతిష్ఠలయందు విభజింపబడినది యగుటవలన,భగవంతునిపై ఏ కొద్దియో భక్తి మిగులుచున్నది. ఇది అనన్యభక్తికాదు. దృశ్యపదార్థములందు పంపకము లేని భక్తియే అనన్యభక్తి. అదియే భగవత్సందర్శనమునకు ఏకైక ఉపాయమని యిట తెలుపబడినది.
అట్టి అనన్యభక్తి భగవానుని (1) తెలిసికొనుటకు (జ్ఞాతుం), (2) చూచుటకు (ద్రష్టుం), (3) ప్రవేశించుటకు (ప్రవేష్టుం) శక్యమగునని పేర్కొనబడినది. దాని భావమేమి?ఇచట తెలిసికొనుట, చూచుట, ప్రవేశించుట అను మూడు క్రియలు చెప్పబడినవి. ప్రారంభమున మనుజునకు ‘భగవంతుడిట్టివాడు’ అను పరిజ్ఞానము కలుగును. ‘జ్ఞాతుమ్’ ఇది మొదటి అంతస్తు. ఈ స్థితియందు భక్తునకు భగవంతుడొకింత దూరముగనే యుండును. ఇది ద్వైతస్థితి. తదుపరి అభ్యాసవశమున ఆ భక్తుడు భగవంతునకు ఇంకను సమీపమునకు వచ్చి ప్రత్యక్షముగా (face to face) ఆతనిని దర్శింపగల్గును. (ద్రష్టుమ్). ఇక భగవద్విషయమై అతనికేమాత్రము సందేహము యుండజాలదు. ఇది రెండవ అంతస్తు. ఇది మొదటిదానికంటె పైస్థితి. ఈ స్థితియందు భక్తుడు భగవంతునకు అతిసమీపమున వచ్చి చేరును. అత్తఱి, కరతలమందలి బిల్వఫలమునుగాని, ఆమలకఫలమునుగాని, మనుజుడు ప్రత్యక్షముగ చూడగల్గునట్లు, యాతడు భగవంతుని విస్పష్టముగ గాంచగల్గును. ఇది దాదాపు విశిష్టాద్వైతస్థితికి సమానము.
అటుపిమ్మట అభ్యాసప్రాబల్యముచే ఆ భక్తుడు భగవంతునికింకను సమీపమునకు వెళ్లి క్రమముగ వాఱియందు ప్రవేశించి ఐక్యమైపోవును. (ప్రవేష్టుమ్). ఉప్పుకల్లు సముద్రమునందు లయించినట్లు, వర్షబిందువు నదీజలమున మిళితమైపోవునట్లు, నీళ్లు పాలలో కలిసిపోయినట్లు, అత్తఱి భక్తుడు భగవంతునియందు విలీనమైపోవును. అపుడు భక్తుడు, భగవంతుడు - అను రెండు వస్తువులుండనేరవు. ఒకే భగవద్వస్తువు మిగిలియుండును. ఇది మొదటి రెండంతస్తులకంటెను పరమైనది. ఇది పూర్ణఅద్వైతస్థితి. ప్రతివాడు మొదటి రెండంతస్తుల యనుభవమునుబొంది, అంతటితో తృప్తినొందక సాధనాభ్యాసమును ఇతోధికముగ కొనసాగించుచు మూడవది యగు భగవత్సాయుజ్యమును బొందవలెను. పైన దెల్పిన మూడుస్థితులలో మొదటిది సామీప్యము, రెండవది సారూప్యము, మూడవది సాయుజ్యము. సామాన్యముగ కొందఱు భగవంతునిగూర్చి శాస్త్రాదులవలన ఒకింతతెలిసికొని అంతయు తెలిసినదని తృప్తినొంది సాధనను విరమింతురు. అది సరికాదు. అట్టివాడు పూర్ణత్వమును బొందజాలదు. ఆతడింకను ముందుకుపోయి, భగవానుని ప్రత్యక్షముగ దర్శించుటకు, ఆతనిలో ఐక్యమొందుటకు యత్నింపవలెను. కనుకనే శ్రీకృష్ణమూర్త్తి కేవలము ‘జ్ఞాతుమ్’ అనిచెప్పి ఊరుకొనక, ‘ద్రష్టుమ్’, ‘ప్రవేష్టుమ్’ అనికూడ వచించిరి.
ఒకమంచిఫలము బజారునందు కలదనియు, దానివర్ణము, రుచి, విలువ ఇట్టి దనియు ఒకడు ఇంటివద్ద కూర్చొని మఱియొకని ద్వారా తెలిసికొనెను - అనుకొనుడు. వెంటనే దానినిగూర్చి యాసక్తిగలిగి బజారునకువెళ్ళి దానిని చూచును. చూచిన పిదప ఇంకను ఆసక్తిగలిగి దానినికొని భుజించును. ఇచ్చోట, మొదటిస్థితి ‘జ్ఞాతుమ్’ అని భగవానుడు చెప్పినదానికి సరిపోవును. (భగవంతునిగూర్చి సద్గురువులవలన, సచ్చాస్త్రముల వలన తెలిసికొనుట). అట్లే రెండవస్థితి ‘ద్రష్టుమ్’ అనుదానికి సరిపోవును. (సాధనాభ్యాసములచే భగవంతుని ప్రత్యక్షముగ గాంచగల్గుట). మూడవస్థితి ‘ప్రవేష్టుమ్’ అను పదమునకు సరిపోవును. (సాధనపరిపక్వతచే భక్తుడు భగవంతుయందైక్యమగుట). ఇదియే జీవన్ముక్తదశ, మోక్షస్థితి. ఒక ఇంటినిగూర్చి తెలిసికొనుట, తెలిసికొనిన పిమ్మట దానిని సమీపించుట, తదుపరి ఇంటిలో ప్రవేశించుట యెట్లో, అట్లే భగవంతునిగూర్చియు నెఱుంగవలయును.
ప్రతివాడును అనన్యభక్తియొక్క సమాశ్రయముచే భగవదైక్యరూపమగు అద్వైత పరాకాష్ఠస్థితిని జీవితములో తప్పక పొందియేతీరవలెను. అపుడే సంసారదుఃఖమంతమగును.
‘యదాహ్యేవైష ఏతస్మిన్నుదరమన్తరం కురుతే అథ తస్య భయం భవతి’ అను ఉపనిషద్వాక్యానుసారము భగవంతునకు తనకు రవ్వంతైనను ఎడమున్నచో భయము జనించును. భయముగలస్థితి పూర్ణస్థితి యెన్నటికిని కానేరదు. కాబట్టి ‘ప్రవేష్టుమ్’ అను మూడవదశను ప్రతిజీవియు అనన్యభక్తియొక్క సాహాయ్యముచేపొంది కృతార్థుడు కావలయును.
కేవలము వేదపఠనాదులచే ముక్తికలుగునని వచించినచో చదువురానివారు అక్కార్యమును చేయజాలరు. కనుక వారికీ ముక్తిలేకపోవును. కేవలము తపస్సులచేగాని, యజ్ఞములచేగాని ముక్తికలుగునని వచించినచో అవియు సర్వులకు అందుబాటులో లేవు, గనుక అందఱును చేయజాలరు. కేవలము దానములచే మోక్షము సిద్ధించునని చెప్పినచో బీదవారు దాని నాచరింపలేరు, కావున వారికిన్ని ముక్తిలేకపోవును. భక్తిచేతనే భగవద్దర్శనము, (భగవదైక్యము) చేకూరగలదని ఇచ్చట చెప్పుటవలన, అది సులభముగ నుండుటచేతను, సర్వులకును అందుబాటులో నుండుటచేతను ఎల్లరుకును అవలంబనీయమై యొప్పుచున్నది. కావున జీవరాసులయెడల కరుణగలిగి ఇట్టి సర్వజనసులభమగు మోక్షసాధనమును భగవాను డిచట తెలిపినవారైరి.
ప్ర:- భగవద్దర్శనమున కుపాయమేమి?
ఉ:- అనన్యభక్తి.
ప్ర:- దానివలన జీవునకు ఏ యే ప్రయోజనములు సిద్ధించును?
ఉ:- భగవంతునిగూర్చి తెలిసికొనగల్గును. వారిని చూడగల్గును. వారియందు ప్రవేశింపగల్గును.
మహాభారతము
*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*భీష్మ పర్వము ద్వితీయాశ్వాసము*
*253 వ రోజు*
*పాండవ కౌరవ సేనల మధ్య సంకుల సమరం*
ఇది చూసిన సాత్యకి క్రూర బాణములను భీష్మునిపై గుప్పించాడు. భీష్ముడు కుపితుడై సాత్యకి సారథిని చంపాడు. సాత్యకి రథం ఊగిసలాడింది. రథముకు కట్టిన గుర్రములు కకావికలై పోగా వికల రథుడైన సాత్యకితో పోరు సల్ప ఇష్టపడక భీష్ముడు అతడిని విడిచి పాండవ సైన్యాలపై తన ప్రతాపం చూపసాగాడు. ఇంతలో విరాటుడు భీష్ముని ఎదుర్కొని మూడు బాణాలతో భీష్ముని కొట్టాడు. భీష్ముడు ఆ బాణములను మధ్యలో త్రుంచి పది బాణములతో విరాటుని కొట్టాడు. భీష్ముని ఎదుర్కోవడానికి వచ్చిన అర్జునిని అశ్వథ్థామ అడ్డం వచ్చి ఆరు బాణములతో అర్జునిని కొట్టాడు. అర్జునుడు నవ్వుతూ అశ్వథ్థామ విల్లును విరిచాడు. అశ్వథ్థామ మరొక విల్లందుకుని అర్జునిని మీద శరపరంపర కురిపించాడు. అశ్వథ్థామ అస్త్ర, శస్త్ర ధాటికి నరనారాయణులు బాగా నొచ్చుకున్నారు. కుపితుడైన అర్జునుడు అశ్వథామ శరీరాన్ని బాణాలతో కొట్టి రక్తసిక్తం చేసాడు. భీష్ముని ఎదుర్కొన్న భీముని సుయోధనుడు అడ్డుకుని అయిదు బాణములు ప్రయోగించి భీముని కవచాన్ని ఛేదించాడు. ఇరువురి మధ్య పోరు తీవ్ర రూపం దాల్చింది. సుయోధనునికి సాయంగా భీష్ముడు, చిత్ర సేనుడు, పురుమిత్రులు వచ్చారు. వారిని అభిమన్యుడు సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. అభిమన్యుని బాణములను వారిరువురు సమర్ధవంతంగా ఎదుర్కొని అభిమన్యునిపై బాణవర్షం కురిపించాడు. అభిమన్యుడు కోపించి వేసవిలో అడవిని దావాగ్ని దహించిన విధంగా బాణపరంపర ప్రయోగించి చిత్ర సేనుని విల్లు విరిచి అతడి రథాశ్వాలను చంపాడు. అలా పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్న అభిమన్యుని సుయోధన కుమారుడైన లక్ష్మణ కుమారుడు ఎదుర్కొన్నాడు. అభిమన్యుడు ముందు లక్ష్మణుని గుర్రములను చంపి తరువాత సారథిని చంపి అతని రథమును విరుగ కొట్టాడు. విరధుడైన లక్ష్మణుడు శక్తి బాణమును అర్జునిపై ప్రయోగించాడు. అభిమన్యుడు దానిని మధ్యలోనే విరిచి లక్ష్మణుని శరీరం తూట్లు పడేలా బాణ ప్రయోగం చేసాడు. ఇది గమనించిన కృతవర్మ లక్ష్మణుని తన రథంపై ఎక్కించుకుని తీసుకు పోయాడు. సుయోధనుడు తన సేనలను పోరుకు ఉత్సాహపరిచాడు. భీష్ముడు పాండవ సేనుని తనుమాడ సాగాడు. సాత్యకి తన శరములతో కౌరవ సేనలను చికాకు పరుస్తున్నాడు. ఇది గమనించిన సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు ఎదుర్కొని సాత్యకిని చికాకు పరిచాడు. సాత్యకి పుత్రులు భూరిశ్రవుని ఎదుర్కొని " భూరిశ్రవా ! నీతో యుద్ధం చేసి వినోదించడానికి వచ్చాము. కనుక మాలో ఒకరిని ఎన్నుకుని నీ పరాక్రమం చూపించు " అన్నారు. భూరిశ్రవుడు " మీరంతా ఒక్కటిగా వచ్చినా నాకు భయం లేదు " అన్నాడు. వారంతా ఒక్కుమ్మడిగా బాణవర్షం భూరిశ్రవునిపై కురిపించగా భూరిశ్రవుడు వారిని శరపరంపరలో ముంచెత్తాడు. వీరోచితంగా పోరాడుతున్న సాత్యకి పుత్రులను భూరిశ్రవుడు వారి తలలు నరికి నేల కూల్చాడు. ఇది చూసిన కౌరవ సేనలోఉత్సాహం పెల్లుబికింది. తనకుమారుల మరణం సాత్యకిని ఆగ్రహోదగ్రుని చేయగా కౌరవ సేనపై విరుచుకు పడి దొరికిన వారిని దొరికినట్లు చంపి భూరిశ్రవుని రథాశ్వములు, సారథిని చంపాడు. భూరిశ్రవుడు కూడా సాత్యకి రథం విరుగ కొట్టాడు. ఇరువురు నేల మీదకు దుమికి కరవాలంతో యుద్ధం చేయసాగారు. ఇంతలో సాత్యకిని భీముడు భూరిశ్రవుని సుయోధనుడు తమ తమ రథములపై ఎక్కించుకుని తీసుకు వెళ్ళారు. అర్జునుడు కౌరవ సేన మీదకు దూకి తన శరపంపరతో కౌరవ సేనుని నుగ్గు నుగ్గు చేసాడు. సూర్యుడు పశ్చిమాద్రికి చేరుకుంటున్న తరుణంలో భీష్ముని ఆదేశంతో ఆనాటి యుద్ధం ముగుసింది.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
*శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం
🎻🌹🙏 *శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం మంగళగిరి*
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌸 ఇటు నరుడు కాకుండా .. అటు జంతువు కాకుండా ఇద్దరి రూపాల కలయికతో భక్త సంరక్షణ కోసం విష్ణువు చేసిన అద్భుత అవతారం నారసింహ అవతారం.. కోరి కొలిచిన వారి పాలిట కొంగు బంగారం నరసింహ స్వామి గా భక్తులతో కీర్తించబడుతున్నాడు.
🌿 అంతటి దయామయుడైన ఆ స్వామి కృష్ణానదీ తీరాన గుంటూరు జిల్లా మంగళగిరిలో వెలసిన స్వామిని పానకాల నరసింహ స్వామిగా భక్తులు పూజిస్తారు.
🌸 ఈ దేవాలయంలో విగ్రహమేమీ ఉండదు; కేవలం తెరుచుకుని ఉన్న నోరు ఆకారంలో ఒక రంధ్రం ఉంటుంది. ఆ తెరచుకొని ఉన్న రంధ్రమే పానకాల స్వామిగా ప్రజల నమ్మకం.
🌿 హిరణ్యకశిపుని వధానంతరం
శ్రీ నరసింహస్వామి చాలా భయంకర రూపంతో, రౌద్రంగా , అందరికీ భీతికొల్పుతూ వున్నారు.
దేవతలంతా ఆ దేవదేవుని శాంతించమని ప్రార్ధించినా ఫలితం కనబడలేదు.
🌸శ్రీ లక్ష్మి ఇక్కడ తపస్సు చేసి స్వామికి అమృతము సమర్పించినది. దానిని గ్రహించి స్వామి శాంత స్వరూపులైనారు.
🌿ఈయనే మంగళాద్రిపై వెలసిన పానకాల లక్ష్మీ నరసింహస్వామి.
ఈయనకి భక్తులు కృత యుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవునెయ్యిని , ద్వాపర యుగంలో ఆవు పాలను సమర్పించారు. కలియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పిస్తున్నారు.
🌸 ఇక్కడ ముగ్గురు నరసింహస్వాములు భక్తుల పూజలందుకుంటున్నారు.
ఒకరు ఎగువ సన్నిధి పానకాల నరసింహస్వామి,
రెండవ వారు దిగువ సన్నిధి లక్ష్మీనరసింహస్వామి కాగా, కొండ శిఖరాగ్రాన గండాల నరసింహస్వామి మూడవవారు.
🌿 కృష్ణానదికి అతి దగ్గరలో ఈ వైష్ణవక్షేత్రం నెలకొని వుంది. లక్ష్మీదేవి యీ పర్వతంపైన తపస్సు చేసినందున యీ క్షేత్రాన్ని మంగళగిరిగా పిలువబడుతున్నది. అంతకు ముందు ఈ కొండకు మూర్కొండ , మార్కొండ అనే పేర్లుండేవి.
🌸ఈ క్షేత్రంలో పానకాల నరసింహస్వామి ముఖ్య దైవం. పానకాన్ని భక్తుల నుండి స్వీకరిస్తూ పానకాలరాయుడుగా యీ దైవం పేరొందారు.
🌿 పురాణాల ప్రకారం పానకాల స్వామి స్వయం వ్యక్తరూపుడు. ఈ ఆలయాన్ని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే తెరిచి ఉంచుతారు. రాత్రులు దేవతలు పూజకై వస్తారని భక్తుల నమ్మకం.
🌸పానకాల స్వామికి బెల్లం, మిరియాలు, యాలుకులు కలిపిన నీటితో పానకం తయారుచేసి భక్తులు సమర్పిస్తారు. నివేదించిన పానకంలో స్వామి వారు సగం త్రాగి మిగిలినవి భక్తులకు వదిలి వేస్తారని నమ్మకం.
🌿భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని పూజారిగారు ఇక్కడ స్వామి నోట్లో పోస్తారు. పానకం సగం అవగానే గుటక వేసిన శబ్దం వస్తుంది. ఇంక పానకం పోయటం ఆపి , మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఇంత పానకం ఇక్కడ వినియోగమవుతున్నా , ఇక్కడ ఒక్క చీమ కూడా కనిపించక పోవటం విశేషం.
🌸సృష్టిలో ధర్మం పూర్తిగా నశించి యుగ సమాప్తి దగ్గరపడినపుడు మాత్రమే పానకం ఒలికినపుడు ఈగలు, చీమలు చేరడం ఆరంభమవుతుందని అంటారు.
🌿 మంగళగిరి దిగువ క్షేత్రములో శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయుమువున్నది. దేవతలు ప్రతిష్ఠించిన మూర్తులు దైవీయాలు.
🌸ఈ దేవాలయములోని మూల విరాఠ్ను ద్వాపరయుగంలో పాండవుల అరణ్యవాస కాలమందు ధర్మరాజు ప్రతిష్ఠించారని చెప్తుంటారు. కాబట్టి ఈ మూర్తి దైవీయము.
🌹 గండదీపం : 🌹
🌿 కొండశిఖరాన వున్న గండాల స్వామికి రూపం లేదు. అక్కడ దీపం వెలిగించేందుకు ఏర్పాటు మత్రమే ఉంటుంది గాని ప్రత్యేక విగ్రహం వుండదు. భక్తులు తమకు గండాలు వచ్చినప్పుడు గండం నుండి గట్టెక్కించమని, గండం తీరిన తరువాత గండదీపం వెలిగిస్తామని మొక్కుకుని ఆ ప్రకారం వెలిగిస్తారు.
🌸 అక్కడ వుండే భాండీలో ఆవు నెయ్యిగాని, నువ్వుల నూనెగాని పోసి, పెద్ద వత్తి పెట్టి సాయంత్రాలలో వెలిగించి వస్తారు. ఆ గండదీపం చుట్టుప్రక్కల చాలా గ్రామాల పజలకు కన్పిస్తుంటుంది.
🌹 దక్షిణావృత శంఖం :🌹
🌿 మంగళగిరి లక్ష్మీ నరసింహ దేవాలయంలో వున్న విశిష్ఠ సంపదలో దక్షిణావృత శంఖం ఒకటి. దీనిలో నుండి సర్వదా, సర్వవేళలా ప్రణవనాదం(ఓంకారం) వినిపిస్తుంటుంది. బంగారు తొడుగు యీ శంఖానికి వుంది. ముక్కోటి ఏకాదశినాడు యీ శంఖంతో భక్తులకు తీర్ధమందిస్తారు.
🌸 ఈ దేవాలయానికి 11 అంతస్థుల గాలిగోపురం తరువాత చెప్పుకోదగిన నిర్మాణము "పెద్ద రథము". ఇది ఆరు చక్రాలతో ఎంతో సుందరంగా గంభీరంగా వుంటుంది. దీనిని ఎంతో బరువైన, పొడవైన త్రాడుతో ప్రజలు ఉత్సాహంగా, అలుపెరుగకుండా లాగుతారు.
🌿 మంగళగిరిలో పానకం విశిష్టత.
ఆలయాల్లో ఇచ్చే తీర్థప్రసాదాల్లో నాలుగు రకాలున్నాయని పురోహితులు చెబుతున్నారు. వీటిని జలతీర్థం, కషాయతీర్థం, పంచామృత
అభిషేక తీర్థం, పానక తీర్థం అంటారు.
🌸ఇక్కడి పానక తీర్థాన్ని సేవిచండం ద్వారా దేహంలో ఉండే ఉష్ణం సమస్థితికి వస్తుంది. మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. నీరసం దరిచేరదు. ఆకలి బాగా వేస్తుంది. ఎముకలకు సంబంధించిన వ్యాధులు నయం అవుతాయి... స్వస్తి..🌞🙏🌹🎻
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
సుభాషితమ్
💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
*స్వప్నములనైన నేవేళ సంతతమును*
*బుద్ధి నీ పాదపద్మములయందు బూనియుండు*
*భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!*
*దుష్ట సంహార! నరసింహ! దురితదూర!*
*తా𝕝𝕝 ఓ నరసింహస్వామీ! చెవులు నీ కథలను, శరీరము నీ సేవలను ముఖము నీ భజనము,నాలుక నీ కీర్తనము, చేతులు నీ పూజలు, చెవులు నీ కథలను, శరీరము నీ సేవలను, కన్నులు నీ దర్శనమును, శిరస్సు నీ పాదాభివందనమును, ఆత్మా నీ అధీనమును ఆశించు చుండును. కలలోనైనను, *అన్నివేళలలో నా మనస్సు నీ పాదధ్యానములోనే యుండునట్లు ఆశీర్వదించుము.*
✍️🌹🌺🌷🙏
తిరుప్పావై 27వ పాశురం*
*తిరుప్పావై 27వ పాశురం*
🔥🕉🌞🌏🌙🌟
*27.పాశురం*
*ॐॐॐॐॐॐॐॐॐॐ*
*కూడారై వెల్లుమ్ శీర్ గోవిన్డా వుందన్నై*
*ప్పాడిప్పఱై కొణ్ణు యామ్ పెరు శమ్మానమ్*
*నాడుపుకళుమ్ పరిశినాల్ నన్డాక*
*శూడగమే తోళ్ వళై యేతోడేశేవిప్పూ*
*యామినహొమ్ పాడగమే యేన్ఱనైయ పల్ కలనుమ్*
*అడైయుడుప్పోమ్ అతన్ పిన్నే పాల్ శోఱు*
*మూడ, నెయ్ పెయ్ తు* *మళుంగైవళివారకూడి యిరుస్టు కుళిర్ న్దేలో రెమ్బావాయ్!!*
*ॐॐॐॐॐॐॐॐॐॐ*
*భావం:-*
*ॐॐॐॐॐॐॐॐॐॐ*
తనతో కూడని శతృవులను జయించెడి కళ్యాణగుణసంపదగల గోవిందా ! నిన్ను కీర్తించి వ్రత సాధనమగు 'పఱ' అను వాద్యమును పొంది, పొందదలచిన ఘన సన్మానము లోకులందరూ పొగడెడి తీరులో ఉండవలెను.
చేతులకు గాజులు మొదలగు ఆభరణములు బహువులకు దండకడియములు, చెవి భాగమున దాల్చెడి దుద్దులు, పై భాగమున పెట్టుకొనెడి కర్ణ పూవులు, కాలి అందెయలు - గజ్జెలు మొదలగు అనేక ఆభరణములు మేము ధరించవలెను. తరువాత మంచి వస్త్రములు ధరించవలెను. పాలు అన్నము మునుగునట్లు నెయ్యి పోసి ఆ మధుర పదార్ధము మోచేయి వెంబడి కారునట్లు నీతో కలసి కూర్చొని చల్లగా - హాయిగా భుజించవలెను.
నిన్ను ఆశ్రయింపని వారిని కూడా వారి మనసులను మార్చి నీకు దాసులౌనట్లు చేసి విజయాన్ని సాధించగల ధీమంతుడౌ ఓ గోవిందా! నిన్ను సుత్తించి నీనుండి 'పఱ' అనే వాద్యాన్ని పొంది లోకులచే సన్మానింపబడలేనని మా కోరిక నీ అనుగ్రహానికి పాత్రులమైన మమ్ము లోకమంత పొగడాలి. మేము పొందు ఆ సన్మానము లోకులందరూ పొగుడునట్లుండాలి.
అనాటి మా రూపాలు ప్రకాశవంతంగా, తేజోమయంగా విరాజిల్లుతూ వుండాలి. దానికై మాకు కొన్ని భూషాణాలు కావాలి. ముంజేతులకు కంకణాలు కావాలి. భుజముల నాలంకరించుకొనుటకు భుజకీర్తులు కావాలి. దండలకు తోడవులును __
ఇంకా ఎన్నో అభూషణములను నీవనుగ్రహించగ మేము ధరించాలి. సన్మానమొందాలి.
వీటన్నింటిని ధరించి ఆపై మేలిమి చీరలను కట్టుకోవాలి. అటుపై క్షీరాన్నము మునుగునట్లు పోసిన నేయి మోచేతిగుండా కారుచుండగ మేమంతా నీతో కలసి చక్కగా అరిగించాలి. ఇదీ మా కోరిక . ఇట్లైన మా వ్రతము మంగలప్రదమైనట్లే!
*ॐॐॐॐॐॐॐॐॐॐ*
*అవతారిక*
*ॐॐॐॐॐॐॐॐॐॐ*
గోపికలు తాము ఆచరింపబోవు మార్గశీర్ష వ్రతమునకు కావలసిన పరికరములను వెనుకటి పాశురమున విన్నవించిరి. అందు వారు అడిగిన ద్రవ్యములు సులభములే ఐనను, వారు కోరిన గుణములుగల ద్రవ్యములు దుర్లభములు.
అందుచే శ్రీకృష్ణ పరమాత్మ వీరి హృదయము వస్తువులను కోరుటకాదు, నన్నే కోరి వీరు ఈ వస్తువులు కోరినారు అని అనుకొనెను. గోపికలు కోరిన పరికరాలన్నీ స్వామితో విడదీయరానివే. అంటే స్వామి తమతోనే ఉండాలని ధ్వనించే విధంగా గోపికలు చాలా చాతుర్యంతో వ్యవహరించారు. అనగా స్వామి గోపికలను సంపూర్ణంగా కటాక్షించాలని కోరారు.
స్వామిమొక్క ఆశ్రిత వ్యామోహాన్ని కీర్తించి వ్రతమును చేయటానికి కావలసిన పరికరాలన్నింటినీ అర్ధించారు గోపికలు. గోపికలు కోరిన పరికరాలన్నీ స్వామితో విడదీయరానివే! అంటే స్వామి తమతోనే వుండాలని ద్వానించేవిధంగా గోపికలు చాల చాతుర్యంతో వ్యవహరించారు. అనగా స్వామి గోపికలను సంపూర్ణంగా కటాక్షించాలని కోరారు. స్వామి యిదంతా విని 'మీరు చేసే వ్రతానికి ఫలాన్ని వివరించండి' అన్నారు గోపికలు యీ పాశురంలో ఆ ఫలాన్ని వివరిస్తున్నారు.
*ॐॐॐॐॐॐॐॐॐॐ*
*హంసద్వనిరాగము _ అదితాళము*
*ॐॐॐॐॐॐॐॐॐॐ*
ప ... అనాశ్రిత విజయ! శుభ, గుణదామా!
నిను సుత్తియించి ప్రాప్యము నొంది
అ..ప.. నిను సుత్తియించి ప్రాప్యము నొంది.
సన్మానమంది సన్నుతి జేతుము
చ.. కంకణమ్ములను భుజకీర్తులను
కర్ణ భూషలును కర్ణ పుష్పములు
మెరుగుటందియలు మేని తోడవులును
పరవశత నలంకరించుకొందుము
చ.. మేలిమి పలువల మేము ధరించి
పాలు నేయి గలసిన పరమాన్నము
కేలోడ మనము కలసి భుజియించి
ఇల నీ సంశ్లేషమున సుఖింతుము!!
*ॐॐॐॐॐॐॐॐॐॐ*
*పంచసంస్కారం ఆపై మోక్ష అనుభవం*
*ఆండాళ్ తిరువడిగళే శరణం*
*ॐॐॐॐॐॐॐॐॐॐ*
లోకంలో విగ్రహాన్ని కొందరు ధనం క్రింద మార్చుకోవటానికి వాడుకుంటారు, దాన్ని కొందరు వస్తువుగా పెట్టి వ్యాపారం చేయాలని అనుకుంటారు, మరి కొందరు దాని నుండి రాజకీయాలు చేస్తారు.
ఏఒక్కరో నూటికి *“కశ్చత్ మామ్వేహి తత్వతః”* రెండో అధ్యాయంలో తానే చెప్పి వాపోయినట్లుగా, ఆతత్వాన్ని వినియోగించుకొని ఆతత్వాన్ని సాక్షాత్కరించుకొని మన ఉజ్జీవనకోసం వచ్చిన రూపం ఇదీ అని విశ్వసించడం సామాన్యమైన విషయం కాదు. మనస్సు ఎంతో పరిపక్వం అయితే తప్ప లభించే స్థితి కాదు కూడా.
ఆ స్థితి మనకు లభించాలి అంటే మనకు కూడా కొంత తెలుసును అనే అహంభావం తొలగాలి. నేనేదో నా ప్రయోజనం పొందాలి అనే స్థితి తొలగాలి గొల్ల పిల్లల మాదిరిగా. కృష్ణుడు చెప్పిందే తమకు జ్ఞానం తప్ప తమకంటూ ఒక జ్ఞానం లేనే లేదు. వారికి చేరాల్సిన స్థానం శ్రీకృష్ణుడే తప్ప వేరే గమ్యం కూడా తెలియదు.కనుక సాధనము, సాధ్యము, జ్ఞానము, జ్ఞేయము, నడిపేది సర్వం శ్రీకృష్ణుడే అనే పరిపూర్ణ విశ్వాసం కలవారు గొల్ల పిల్లలు.
అందుకే వారికి పరమాత్మ సర్వాత్మనా లొంగే ప్రవర్తించాడు, వారికి ఏ ఆటంకాలు వచ్చినా తొలగించాడు. ఇది లోకంలో ఉండే జీవులలో ఎవరు తననే సర్వమూ అని భావించి, తన ఆజ్ఞని శిరోధార్యంగ స్వీకరించి ఎవరు తన మార్గంలో పయనిస్తారో అలాంటి వారి కోసం విగ్రహ రూపంలో ఉండే తానే ఏమైనా చేయగలను అని నిరూపించటమే ఆండాళ్ తల్లి భగవంతుని యొక్క వాక్కుగా మనకు చూపించే సారం. తాను ఒక అర్చామూర్తిని విశ్వసించింది, ఫలితాన్ని తను పొందింది.
భగవంతుణ్ణి మనం విశ్వసించాలి అంటే అది విగ్రహ రూపంలోనే, మరొక చోటికి ఎగరటానికి ప్రయత్నం చేసి కూడా వ్యర్థం. విభవానికి మనం పోలేం, లోపల ఉండే అంతర్యామిని మనం చూడలేం, పరమపదం మనకు ఊహకికూడా అందనటువంటిది, కనిపించేరూపం భగవంతుడిది అర్చారూపం మాత్రమే. విగ్రహంలో భగవంతుడు కాదు మన సాంప్రదాయం, విగ్రహమే భగవంతుడు అని మన ఆగమాలు నిరూపించే సిద్దాంతం. దాన్ని నమ్మిన ఆండాళ్ దాన్నే మనకు ఆదేశించింది, దాన్నే ఉపదేశించింది.
శ్రీకృష్ణ అవతారంలో తాను మన దగ్గర ఉన్నప్పుడు సౌలభ్యాన్ని మనకు చూపించాడు, నేను నీకు కూడా ఎందుకు అందను నన్ను విశ్వసించండి అని అదే విషయాన్ని గోదాదేవి వద్ద నిరూపించినట్లే మన దగ్గర నిరూపించటానికి ఈనాడు మన వద్ద అర్చామూర్తియై ఉన్నాడు. కావల్సింది మనలో ఉండే విశ్వాసం.
శ్రీకృష్ణుడు ఆనాడు దివ్య అనుభవం అనేది ఎట్లా ఉండాలో చూపించాలని అనుకున్నాడు అందుకే సద్దులు ఆరగించుట అనే అద్భుతమైన లీలను తన చుట్టు ఉండే గొల్ల పిల్లలకి చూపి వాళ్ళని ఆనందంతోటి ఉన్మస్తక స్థితిలోకి తీసుకు పోయాడు.
అయితే దాన్ని విశ్వసించటం "చతుర్వేద అధ్యేతను" నేను అనుకున్న చతుర్ముఖ బ్రహ్మ లాంటి వారికి కూడా అర్థం కాలేదు. చివరికి వారికి పాఠం నేర్పి జ్ఞానోదయం కలిగించాల్సి వచ్చేంత వరకు. శ్రీకృష్ణుడు ఒకనాడు తన చుట్టూ ఉండే గొల్ల పిల్లలనందరికి చెప్పాడు, రేపటి నాడు మనం అంతా వనభోజనాలతో విందు చేసుకుందాం, ఎవరెవరి ఇళ్ళలోంచి వారివారికి తోచినవి ఏవేవో తెచ్చుకోండి అని చెప్పాడు. అందరూ తెచ్చుకున్నారు, తాను తెచ్చుకున్నాడు.
అందరిని చుట్టూ కూర్చోబెట్టాడు, ఒక్కొక్కరివస్తువులని రుచిచూడటం ప్రారంభించాడు, అందంగా వారు తయారుచేసిన వైనాన్ని పొగడుతూ తాను ఆరగిస్తూ వాళ్ళకి ఆరగింపు చేస్తూ అద్భుతమైన ఆనందాన్ని వాళ్ళకి అందిస్తూ, తాను ఆనందం పొందుతున్నాడు శ్రీకృష్ణుడు. అయితే ఒక పిల్లవాడు తన ఇంటి దగ్గరి నుండి తెచ్చుకున్నవి గంజి నీళ్ళు అవడంతో, కృష్ణుడికి ఎలా ఇవ్వడం, కృష్ణుడు తన దగ్గరికి వచ్చేలోపు తాగేయ్యాలని గబ గబా త్రాగటం మొదలు పెట్టాడట.
అయితే కృష్ణుడు తన పై ప్రేమ తో తెచ్చిన ఆ గొల్లపిల్లవాడి సంబంధం కల్గిన పదార్థం తనకు దొరక కుండా పోతుందేమో నని దిగులు చెంది, గబ గబా వెళ్ళి వాడి పెదవుల నుండి కారుతున్న గంజిని తాగటం ప్రారంభించాడు. దీన్ని చూసి చతుర్ముఖ బ్రహ్మకి ఏం అర్థం కాలేదు. వేదాధ్యయనం చేసినవాడాయే నిప్పును కూడా కడిగి తీసుకొనే ఆచారవంతుడు, తనకు ఈ విషయం నచ్చలేదు. జగత్ కారణ తత్వం ఇలా ఎంగిలి మంగళమా చేసేది అని అనుకున్నాడట బ్రహ్మ.
అయితే, ఈ పిల్లవాడు ఏదో ఇంద్రజాలం చేస్తున్నాడు, వీడికి బుద్ది చెప్పవలెనని బ్రహ్మగారు అనుకున్నారు, గోవులను గోపబాలురను దాచడం, తరువాత బ్రహ్మ లోకంలో బ్రహ్మకు ఆదరణ లేకుండా కృష్ణుడు చెయ్యటం, ఆపై బ్రహ్మకు బుధ్ధి రావడం జరిగాయి. ఆనాడు ఆ పిల్లలకందరికి సద్దులు ఆరగించే అనుభవాన్ని కృష్ణుడు అందించాడు, మోక్షానందం ఏమిటో చూపించాడు.
*అయితే మోక్షం అనగా ఏమి ?*
మోక్షం అనగా ఆనందించుట, దీనిపై రక రకాల ప్రశ్నలు ఉన్నాయి. ఉపనిషత్తులు మోక్షంలో జీవుడు ఎలా ఉంటాడో అని ప్రశ్న వేస్తూ, *“బ్రహ్మవిత్ ఆప్నోతి పరం”* అని చెప్పాయి. ఆంటే ఆనందం అనేది తెలుసుకున్నవాడు ఒక గొప్ప స్థితిని లేక పరంను పొందును.
అయితే ఆ పరం ఎలా ఉండును ? అని త్తైత్తిరీయ ఉపనిషత్తు వర్ణించింది ఇలా *“ఆప్నోతి ”* అంటే పోందటం, లేక తినటం లేక అశ్నుత అని చెప్పింది.
*“సోశ్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణాభి పశ్చితేభిః"* . సహ- ఈ ముక్త జీవుడు అస్నుతే- ఆరగించును. దేనిని ? సర్వాన్ కామాన్ - దేన్నైతే జీవుడు కోరుకుంటాడో దాన్ని. మరి జీవుడు ఏమి కోరుకుంటాడు ? భగవంతునిలోని కళ్యాణ గుణాలను కోరును. దీన్నే వేదం ఇలా చెప్పింది. *"తస్మిన్ యదంతః తదుపాసితవ్యం"* అంటే తస్మిన్- ఆ పరమాత్మ యందు, అంతః-యత్ - లోపల ఏదైతే కళ్యాణ గుణ సంపద ఉన్నదో, తదుపాసితవ్యం- ఆ ధనాన్ని కోరదగును అని చెప్పింది.
సర్వాన్ కామాన్- అన్ని కళ్యాణ గుణములను మరి ఎట్లా అనుభవించును ? బ్రహ్మణాభి- పరమాత్మతో, సహ-కలిసి పశ్చితేభిః- అనుభవించును. అయితే సంస్కృత వ్యాకరణంలో *"తో కలసి"* అని చెప్పేప్పుడు భోగ్య సహచర్యం మరియూ భోక్తృ సహచర్యం అని రెండు ఉంటాయి. రాజుగారితో మంత్రి కలిసి వచ్చెను అన్నప్పుడు రాజుగారికే ప్రాధాన్యత ఉంటుంది. భోక్తృ సహచర్యం అంటారు.
అయితే భగవంతుడు తన కళ్యాణ గుణాలతో కలిసి ఎప్పటికీ ఉంటాడు, గుణాలను విడదీసి అనుభవించటం అనేది జరగదు. ఇక జీవుడు భగవంతుడిలో ఏకం అవడం అనేది జరగదు. ఉపనిషత్తులు చెబుతూ *"తమః పరేదేవే ఏకీ భవతి"* ఏకీ భావమే పర్యవసానం తప్ప, *"ఏకం భవతి"* అని చెప్పట్లేదు, ఇది గుర్తుంచుకోవాలి. *"ఏకీ భవతి"* అంటే ఒకటివలె అగును అని వ్యాకరణం చెబుతుంది.
మరి జీవుడు పరమాత్మలో ఐక్యం కాడు, జీవుడు పరమాత్మను. చేరును. చేరి ఏమగును ? ఎక్కడో మూలన పడి ఉండునా, అలా పడి ఉంటే దాన్ని కైవల్యం అంటారు. మరి ఏమగును ? అంటే జీవుడు పరమాత్మను ఆయన గుణములతో అనుభవించును. మరి గుణములతో అనుభవించటం అంటే ఏంటి? ఇది అర్థం అవడం కష్టం. గుణములను చూడలేం, లెక్క పెట్టలేం. బ్రహ్మం అంటే తెలియదు, గుణం అంటే తెలియదు, ఇక అనుభవించటం అంతకన్నా తెలియదు.
దీన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. అందుకే వేదవ్యాస భగవానుడు *"శ్రీకృష్ణభగవానుడు సద్దులు ఆరగించే కార్యక్రమాన్నే మోక్ష అనుభవం అని చెప్పాడు"* ఒకడు అనేకమందితో కలసి తన సంతోషాన్ని వారికి పంచుతూ వారి ఆనందాన్ని తాను పొందుతూ అన్నం తినెను. ఇదే కదా కృష్ణుడు చేసిన సద్దులు ఆరగించే లీలలో ఉన్నది.వేదం మోక్షాన్ని అన్నం తినడం అనే దానితో పోల్చి చెబుతుంది. మోక్షంకి వెళ్ళాక "అహం అన్నం అహం అన్నం అహమన్నాదో అహమన్నాదో" అంటూ సాగుతుంది. అయితే ఉపనిషత్తులు అన్నం అంటే *"అద్యతే అత్తిచ భూతాని తస్మాద్ అన్నం తదుచ్యతే ఇతి"* అద్యతే- క్రమంలో తింటే తృప్తినిస్తుంది, అత్తిచ భూతాని- క్రమం తప్పి తింటే అది మనల్ని తినేస్తుంది, అంటే శరీరం పాడై పోతుంది అని అర్థం. అందుకే క్రమంలో తినే దాన్నే అన్నం అంటాం. అయితే జీవుడు మోక్షానికి వెళ్ళాక భగవాన్ అహం అన్నం- నేను నీవు అనుభవించటానికి అని అంటాడట. అయితే భగవంతుడు లేదు అహం అన్నం- నేను నీవు అనుభవించటానికి అని అంటాడట.
అయితే జీవుడు అహమన్నాదో- నేను ఆ అన్నాన్ని అనుభవించే వాడిని అని అంటాడట, ఆపై భగవంతుడుకూడా
*అహమన్నాదో-*
నేను ఆ అన్నాన్ని అనుభవించే వాడిని అని అంటాడట. అయితే అనుభవం పోందేదెవడు, అనుభవించేదెవడు ఇటా అటా, ఆ ఆనంద దశ మాత్రమే పైన ఉంటుంది తప్ప ఏది ఏవరు అనేది గుర్తించ వీలు కానట్లు సామానత్వం ఏర్పడుతుంది.
అయితే జీవుడు పరమాత్మను చేరాక సర్వాత్మనా సముడగును ఆయన వంటి రూపం,గుణం,ఆనందం, అనుభవం పొందును. బ్రహ్మసూత్రాలు రచించిన వేదవ్యాసభగవానుడు రెండు విషయాలు తప్ప సముడగును అని చెప్పాడు. అది శ్రీయ పతిత్వం, జగత్ కారణత్వం.ఇది వీడు కోరడు, వాడు ఇవ్వడు. శ్రీ మనకు అమ్మ ఇక జగత్ సృష్టీ స్థితీ లయాలు పెద్ద భాద్యత వాడే ఉంచుకుంటాడు. బ్రహ్మ సూత్రాల్లో *"భోగ్య మాత్ర సామ్య లింగాః"* అయితే అనుభవం మాత్రం సమానం, జీవుడికీ భగవంతుడికీ తేడా ఉండదు. ఇక ఈ ఆనందం ఒక్కో జీవికి ఒకలా ఉండదు, అందరికీ సమానం. ఆ ఆనందం పరమాత్మ ఆనందంతో సమానం అని భగవద్గీతలో భగవంతుడే చెప్పాడు. వేదం అదే చెప్పింది. శ్రీ కృష్ణుడు ఆనాడు గొల్ల పిల్లలతో అదే ఆనందం అనుభవించాడు, వాళ్ళకీ చూపించాడు. గోదా దేవి సద్దులు ఆరగించడం ఏం ప్రారభ్దం కనుక ఎంచక్కా మనం పరమాన్నాన్నే ఆరగిద్దాం అని చెప్పింది.
అందుకే గోదాదేవి *"పాల్ శోఱు మూడనెయ్ పెయ్దు మురంగైవరివార కూడి ఇరుందు కుళిరుంద్"* కలిసి అందరం పరమాన్నాన్ని తినవలెనని చెబుతుంది.
మరి ఎలాంటి పరమాన్నం అంటే జీవుడుంటాడు దేవుడుంటాడు, ఇరువురిలో సమానత్వం ఉంటుంది. ఇరువురిలోనూ ప్రీతి ఉంటుంది, ఎవరు ఎవరిని ఎంత ప్రేమిస్తున్నారు తెలియనంతగా, మరి ఈ ప్రీతి ఎట్లా ఏర్పడింది? అంటే వాడి కళ్యాణ గుణాలవల్ల ఏర్పడింది. ప్రీతి పైన నిండి ఉంది, వారిరువురి మద్య కలిసి వీడనంత స్నేహం, అది ప్రీతిలో అంతటా కల్సి ఉంది. జీవుడూ పరమాత్మ కల్సి ఉన్నారు సుమా అని గుర్తించాలే తప్ప విడదీసి చూడలేం. ఉపనిషత్తులు చెప్పిన ఈ సారాన్నే మనం పరమాన్నం లేక పాయసంలో చూడొచ్చు.ఆండాళ్ ఇదే పాయసాన్ని కోరుతుంది. *"పాల్ శోఱు"* పాలు కల్సిన అన్నం *"మూడనెయ్ పెయ్దు"* అందులో నెయ్యి పూర్తిగా తేలుతూ ఉండాలి, దాంట్లో తీపి పాలల్లో, నెయ్యిలో, భియ్యపు కణాల్లో కల్సి ఉండాలి. వేదాంత స్థితిలో చేరే మోక్షానుభవం ఇదే.
ఏమిటీ పరమాన్నం ? ఈ బియ్యపు కణాలే జీవుడు, దానికి ఉండే పొట్టే శరీరం. ఇది భగవంతుడు జీవుల్ని పండించాలి అని ప్రకృతి అనే క్షేత్రంలో నాటితే మనకీ శరీరం లభించింది.
దాన్యానికి పైన ఎరుపు రంగులో ఉండే పొర మన అనురాగానికి గుర్తు. దాన్యాన్ని దంపి పైన ఉండే పొట్టుని తీసివేసినట్లే ఈ జీవుడు శరీరంతో సాగించే యాత్రలో సుఖాలు దుఃఖాలు, కామాలు, క్రోదాలు, లాభాలు, అలాభాలు, జయాలు, అపజయాలు, ఐశ్వర్యాలు, అనైశ్వర్యాలు, జ్ఞానం, అజ్ఞానం ఇవన్నీ దంపి మనల్ని పొట్టు వీడేట్టు చేస్తాయి. ఇక అక్కడి నుండి వీడి యాత్ర సాగుతుంది. ఇక ధాన్యాన్ని కడిగి వేయించి ఉడికించినట్లే, జీవుడు ఆచరించిన శరణాగతి ఫలితంగా ముక్తి ఇలా లభిస్తుందని ఉపనిషత్తులు తెలుపుతాయి.
*"శ్రీశం ప్రపద్య ఆత్మవాన్*
*ప్రారభ్దం పరి భుజ్య*
*కర్మ శకలం ప్రక్షీణ కర్మాంతరః| న్యాసా దేవ*
*నిరంకుశేష్వర దయా నిర్లూణ మాయాన్వయః హార్థానుగ్రహ లబ్దం మధ్య దమని ద్వారాత్ బహిర్ నిర్గతః ముక్తః"*
ఉపనిషత్తులు జీవుడు ఎలా సాగునోయని చెబుతూ, మనకు లభించిన కర్మ అనుభవంచేత తనయందు ఫల కర్తృత్వాన్ని త్యాగం చేస్తూ వాటి యందు పట్టు లేకుండా సాగించే జీవన యాత్రలో కర్మలు అన్నీ తొలగినట్లయితే ఈ హృదయంలో పరమాత్మ చూపిన మార్గంలోంచి బ్రహ్మరంద్రం గుండా బయటికి ముక్తుడగును.
ఇలా పన్నెండు మార్గాలు అర్చి దిన పూర్వపక్ష షడు దఙ్మాస అబ్దవాత్ అంశుమత్ తో విద్యుత్ ఇంద్ర ధాత్రు ఇలా పన్నెండు లోకాలను దాటుతూ విరజాస్నాతుడవుతాడు. విరజలో జీవుడిని కడుగుతాడు. జీవుడిపై ఉండే సూక్ష్మ శరీరం తొలగి, దాన్యం పై ఉండే పొరను తీసినట్లుగానే.
రజస్ సంపర్కం పూర్తిగా తొలగేట్టు చేస్తాడు పరమాత్మ. అప్పుడు జీవుడు పరమపదం చేరగల్గుతాడు. పరమాత్మ రూపు పొందగల్గుతాడు. సారూప్యం ఏర్పడుతుంది. అక్కడున్న ముక్త జీవులు వీణ్ణి పరమాత్మ వద్దకు తీసుకు పోతారు. సామీప్యం ఏర్పడుతుంది. అక్కడ పరమాత్మ-అమ్మ ఒడిలో వివిద రకాల సేవలు అందిస్తూ, అనందం పొందుతాడు. సాలోక్యం ఏర్పడుతుంది. ఇలా చివరి స్థితి సాయుజ్యం ఏర్పడుతుంది. యుక్ అంటే కల్సి ఉండేది. జీవుడికి జ్ఞానం, పరమాత్మకు కళ్యాణ గుణాలు, వీటిలో ఇరువురూ కల్సి ఉండడమే సాయుజ్యం, దీన్నే మోక్షం అంటారు.
మొదట బియ్యాన్ని నేతిలో వేయించినట్లే అక్కడ స్నేహంతో వేయిస్తారు. భగవంతుడి కళ్యాణగుణాలు పాలవంటివి, స్వచ్చమైనవి. పాలు పశువుల నుండి వస్తాయి, మనం ఉపనిషత్తులని పశువులని అనుకోవచ్చు. ఈ కళ్యాణ గుణాలనే పాలలో జీవుడు ఉడకాలి. భగవంతుని సేవచేయాలనే రుచి వీడి ఉండాలి, తన కళ్యాణగుణాలను ఇవ్వాలని రుచి ఆయనకుండాలి. ఈ రుచి అనేది అంతటా కల్సి ఉండాలి, తియ్యదనం వలె. ఇందులో జీవుడూ భగవంతుడూ కల్సి ఉన్నారా లేదా అన్నట్లుగా కల్సి ఉంటారు. పరమపదాన్ని పోలిన ఈ పాయసమే పరమాన్నం. పరమాన్నం దీనికి ప్రతీక. ఆండాళ్ దీన్నే కోరుతుంది.
పరమాత్మ కున్న పేరు నారాయణ, అది ఒక పెద్ద సాగరం లాంటిది, అందులోంచి తేలిన ఒక నామమే గోవింద నామం. భగవంతుడు అవతరించి సంపాదించుకున్న నామం *“గోవింద”* నామం. అందుకే మన వాళ్ళు ఏదైన పని చేసే ముందు శ్రీ గోవింద గోవింద గోవింద అంటూ సంకల్పం చేసుకొని కార్యంలోకి ఉద్యమిస్తారు.
ఈ నామం కృష్ణావతారానికి ప్రత్యేకం. ఏడు రోజులు గోవర్దన పర్వతాన్ని ఎత్తి పట్టి గో గోప గోపీ జన సంరక్షణ చేసి, ఇంద్రుడిచే గోవింద పట్టాభిషేకం చేయించుకున్నాడు. కష్టపడి సంపాదించిన నామం అవడంచే ఆ నామంతో పిలవడం ఆయనకు చాలా ఇష్టం. అందుకె ఈరోజు నుండి వరుసగా మూడు రోజులు గోవిందనామం ఉచ్చరించి అనుగ్రహం పొందుతారు.
*"గోవిందా"* గో గోప గోపీజన సంరక్షకా *"శీర్"* నీకున్న కళ్యాణ గుణాలు ఎట్లా ఉన్నాయంటే, *"కూడారై"*
కూడని వారిని, నీ దరికి రాని వారిని *"వెల్లుమ్"* జయించి నీ దరికి రప్పించుకుంటావు. కూడని వారంటే ఈ లోకంలో మూడు రకాలుగా ఉంటారు. ద్వేషంతో కొందరు, ఏం పట్టక ఉదాసీనులు కొందరు, ప్రేమ అధికమై తాము దరికి చేరితే స్వామికి ఎక్కడ మచ్చ అంటుతుందో అని కొందరు. కూడని వారిని తన
బాణాలతో దరికి లాక్కుంటాడు.
ఇక ప్రేమించి దూరం అయ్యేవాళ్ళను తన అనునయంతో దరికి చేర్చుకుంటాడు. నమ్మాళ్వార్ అలానే, స్వామీ నే దరికి రానే రాను, నాలాంటి అల్పుడు నీ వద్దకు వస్తే ఆ కాంతి అనే శ్వేత వస్త్రంకు మచ్చ అంటూ దూరం పోతుంటే, స్వామి నమ్మాళ్వార్ ని నిలిపి *"వళవేళ్ ఒలగిన్"* అనే తిరువాయిముళి అనే దివ్యప్రబంధంలో ఇలా అంటాడు స్వామి. నమ్మాళ్వార్ అనగనగా ఒక గోకులం, నేనే శ్రమించి గోవులని కాచా, పాలు పెరుగు వెన్న బాగావచ్చాయి, కానీ నాకందకుండా వాళ్ళంతా దాచుకుంటున్నారయ్యా. తప్పెవరిదయ్యా అంటే నమ్మాళ్వార్ వారిదేనయ్యా అని చెప్పాడు.
మరి నేను కష్టపడి సంపాదించింది దాచటం తప్పా కాదా అంటే, తప్పేనయ్యా అని నమ్మాళ్వార్ చెప్పారు. నీవు ఒక కుండ, దానిలో జీవుడి జ్ఞానమే పాలు, పెరిగిన ప్రేమే పెరుగు, మరి ఇదంతా నేను పండించిది కదా మరి నాకు ఇవ్వకుండా తీసుకెళ్తున్నావే తప్పెవరిది అంటే పాపం నమ్మాళ్వార్ స్వామికి లోంగిపోవాల్సొచ్చింది. గొప్పవాడై ఏ యోగ్యతలేని వారి వద్ద అరమరికలు చూపక ఉండే ఆ సౌశీల్యం అనే గుణంతో తను ప్రేమించిన వాళ్ళని దరికి తీసుకుంటాడు. ఇక ఉదాసీనులని తన అందం, ప్రసాదం చూపి దరికి చేర్చుకుంటాడు. ఆలయాల్లో జరిగే తిరువీది ఉత్సవాలు ఉదాసీనులని కటాక్షించటానికే.
ఇంత వరకు నిన్ను ఎడబాసి ఎంత దుఃఖం కలిగించామో కదా, ఇన్నాళ్ళకు నీ సన్నిధి చేరామయ్యా! నీమాట పలకటానికి ఇష్టపడని ఈ లోకం, *"ఉన్ఱనై ప్పాడి"* నీ నామాన్నే పాడేట్టుగా మమ్మల్ని మార్చు కున్నావు. *"పఱైకొండు"* నీ పాట పాడి నీవిస్తానన్న వ్రత పరికరాలు స్వీకరించి *"యామ్ పెరుసమ్మానమ్"* మేం గొప్ప సత్కారం పోందాలని అనుకుంటున్నాం.
మేం చేసే వ్రతం మాకు ఏదో లాభం, సత్కారం లభించటానికి కాదు, ఇవన్నీ నీవు ఇప్పించినవి కదా, అది నీకే వైభవం. చేతుకు వేసే కంకణం వ్యక్తికే ఆనందం కానీ చేతుకు కాదు కదా! *"నాడు పుకరం పరిశినాళ్ నన్ఱాక"* లోకం అంతా కీర్తించేలా సత్కారం కావాలి. విభీషణుడికి , సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయటం వల్ల లోకం రాముణ్ణే కదా కీర్తించింది. ఇక ఒక్కో పరికరాలను అడగటం ప్రారంభించారు. గురువుని ఆశ్రయం చేసినప్పుడు మనకు గురువు కొన్ని సంస్కారాలు చేస్తాడు. వాటిని సూచిస్తోందా అన్నట్టుగా గోదా పంచ సంస్కార పక్రియను చెబుతుంది.
*"శూడగమే"* చేతికి ఒక కంకణం కావాలి, *"తోళ్ వళైయే"* భుజానికి ధరించే ఆభరణం, *"తోడే"*, చెవికి ధరించే ఒక ఆభరణం, *"శెవి పువ్వే"* చెవి పైకి పరిమళం కోసం ధరించే మరొక ఆభరణం, *"పాడగమే"* పాదాలకు ధరించే ఒక ఆభరణం. ఇవన్నీ కోరుతుంది గోదా. ఆచార్య ఆశ్రయణం చేసినప్పుడు చేతికో కంకణం, భుజానికి శంఖ చక్రాలు, చెవికి అష్టాక్షరీ మహా మంత్రం, పరిమళాన్నిచ్చే ద్వయ మంత్రం, పాదాలా అన్నట్టుగ చరమ శ్లోకం అందిస్తారు మన ఆచార్యులు.
*"యెన్ఱనైయ పల్కలనుమ్ యామణివోమ్"* మాకు తెలియని ఆభరణాలు ఎన్నెన్నో, అవన్నీ ఇవ్వు. *"ఆడైయడుప్పోం"* నూతన వస్త్రాలు కావాలి. జీవుడు భగవంతుణ్ణి చేరాటానికి లభించిన వస్త్రం శరీరం, ఇది పాంచబౌతిక శరీరం, పరమపదానికి వెళ్ళే ముందు, విరజానదిలో సూక్ష్మ శరీరం తొలగి పంచ ఉపషణ్మయ దివ్య విగ్రహం లభిస్తుంది.
*"అతన్ పిన్నే"* అలా వేరే శరీరం లభించాక ఇక మాకు కావల్సింది *"పాల్ శోఱు మూడనెయ్ పెయ్దు మురంగైవరివార"* పరమాన్నం, అదే పరమ పదం. *"కూడి ఇరుందు "* అందరు కల్సి గోష్టిగా తినడానికి, *"కుళిరుంద్"* ఈ కలయిక తో మన ఈ సంసార తాపం అంతా తొలగాలి.
*ॐॐॐॐॐॐॐॐॐॐ*
*తిరుప్పావై 27 వ పాశురము/తెలుగు పద్యానువాదము*
*రచన*
*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*
*మిట్టాపల్లి*
*ॐॐॐॐॐॐॐॐॐॐ*
*సీసమాలిక*
*గోవిందుడా యని గుణములు పాడుచు*
*వేడుక కలుగగా పాడినాము*
*ఆడవారలనుచు కూడదు యనబోకు*
*తగని కోరికలపై తలపు యనుచు*
*స్నానమాడిన మేము చయ్యన నీ చెంత*
*ముదము గల్గిన కృష్ణ పదము లందు*
*వచ్చిరాని వ్రతము మెచ్చెద వీవని*
*కోరిక వినిపించ కూడినాము*
*ఆభరణము లేవి యడుగము మిమ్ముల *
*పలువిధములయిన వలువలిమ్ము*
*యింత కన్నను మిన్న వేళ లేదని నమ్మి*
*పంక్తిగా మిముచేర వచ్చినాము*
*ఆనందమందుచు హాయిగొల్పుచు నుండ*
*స్వామిని కీర్తించ సమయ మేది!!*
*తే.గీ.వెన్న మీగడ నేతులు తిన్నవేళ*
*తీయ తీయగా త్రాగెడు పాయసమ్ము*
*చాల చిక్కని పాలెల్ల జాలువార*
*చేయు మనవిని శ్రద్ధగా చిత్తగింపు*
*శ్రద్ధ భక్తిని కల్గించి బుద్ధినిమ్ము*
*శ్రీధరుని మానసంబున స్థిరము కమ్ము!!*
🕉🌞🌎🌙🌟