20, జులై 2020, సోమవారం

#గుడ్డు #పాలు #_శాకాహారమా #_మాంసాహారమా?

వివరణాత్మకమైన వ్యాసం ఒక గ్రూపు నుండి సేకరించింది దయచేసి కొంత సమయం వెచ్చించి తీరికగా చదువగలరు.

ముందుగా మనం శాకాహారం అంటే ఏమిటి?
మాంసాహారం అంటే ఏమిటి?
అనే విషయం పై శాస్త్రం చెప్పిన వివరణ పరిశీలిద్దాం!

భగవంతుని ప్రేరణ చేత ఈ భూమిపై చరాచర సృష్టి (పుట్టుక) అనేది నాలుగు రకాలుగా విభజించి అర్ధంచేసుకోబడింది.
వీటిని జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజములు అని పిలుస్తారు.
1. జరాయుజములు: గర్భంలోని పిండమునావరించియుండి మాయవలన పుట్టునవి.(మనుష్యులు పశువులు)
2. అండజములు: గ్రుడ్డు నుండి పుట్టు పక్షులు, పాములు, మొదలగునవి.
3. స్వేదజములు: చెమట వలన పుట్టు దోమలు, నల్లులు మొదలగునవి.
4. ఉద్భిజములు : విత్తనము పగలదీసి జన్మించు వృక్షలతాదులు.

ఇక ఇందులో రెండురకాలు:
"చర సృష్టి" , "అచర సృష్టి" .
జరాయుజములు, అండజములు, స్వేదజములను "చరసృష్టి" అనియు; ఉద్భిజములను మాత్రం "అచర సృష్టి" అనియు; 
చర అంటే కదిలేవి (మనుషులు, పశువులు, పక్షులు, పాములు, దోమలు, నల్లులు ఇటువంటివి కదలిక కలిగి ఉంటాయి). ఇవి ముఖ్యంగా తమ కదలికలను తమను తాము కాపాడుకునే పనిలోనూ తమ ఆహార ప్రయత్నంలోనూ వాడతాయి.
ఇవి రజోగుణ, తమోగుణ స్వభావులు. అందువల్ల ఇవి ధరించే శరీరాలను దోషభూయిష్టమైనవిగా, అంతర్గతంగా దుర్గంధాన్ని ఆవరించి యుండేవిగా భావించి వీటిని ’నీచమని’, ’మాంసమని’, మాంసాహారమనీ పూర్వీకులు చెప్పారు.
ఈ నీచము అనే మాటనుండే నీచు అనే అర్థం మాంసానికి వచ్చింది.
ఈ చరసృష్టి అంతా తల కిందకు దించి తమ ఆహారాన్ని స్వీకరించ ప్రయత్నంచేస్తాయి. పశువులు మేతమేసినా, మానవులు ఆహారంతింటున్నా తలను నీచానికి చూస్తారు కాబట్టి నీచం అనే పదం వాడారు.
ఇకపోతే ఉద్భిజములు:  విత్తనమునుండి వచ్చేవి. వీటిని ఉచ్చములు అని అంటారు.
ఇవి వీలైనంతవరకూ సూర్యుడిని అందుకోవడానికి ఆకాశంవైపు సాగుతాయి. ఇవి అత్యధికశాతం సత్వగుణపూరితములు.
అందువల్ల వీటిని ’శాకాహారమని’ అంటారు.

చరసృష్టిని ఆహారము కొరకు వాడగూడదు అని యాజ్ఞవల్క్యస్మృతి చెబుతోంది. ఒక జంతువు యొక్క ఒక కాలు మనం కత్తిరిస్తే అది జీవితాంతం కుంటుతుంది. అంతేగానీ వేరొక కాలు మొలిపించుకోలేదు.
కానీ అచరసృష్టి దీనికి భిన్నం. ఒక చెట్టుయొక్క ఒక కొమ్మని నరికితే అది వేరొక కొమ్మను మళ్లీ మొలిపించుకుంటుంది. చెట్టు తన ఆకులను సమృద్ధిగా రాల్చేస్తుంది. చెట్టు తన పండ్లను రాల్చేస్తుంది. అలాగే వరి వంటి మొక్కల ధాన్యాన్ని మనం ఆ మొక్క ప్రకృతిసిద్ధంగా చనిపోయిన తర్వాతే పంటను కోసి విత్తనాలను ఇంటికి తెచ్చుకుంటాము. ఈ అచరసృష్టి తమకు ఒకచట ఆహారం దొరకలేదుగదా అని వేరొకచోటికి కదలవు వీటిలో సత్వగుణం (సత్వం సుఖే సంజయతి). అందువల్ల అరటి, మామిడి, గోధుమలు, యవలు, తిలలు, వంటి వాటిని భుజిస్తే సత్వగుణవృద్ధి జరిగి ఆలోచనలో క్రూరత్వం నశించి మనిషి ఆరోగ్యపూరితమైన జీవనాన్ని సాగిస్తాడు కాబట్టి శాకాహారము (అచర చేతనా సృష్టి) ని భుజించి మానవుడు సుఖించి కైవల్యాన్ని పొందవచ్చని సాధనాగ్రంధములలో ఋషులు బోధించారు.

ఇక ఈ శాకాహార మాంసాహారం గూర్చి.
మానవులు మావినుండి పుడతారు. తల్లి పాలు తాగి పెరుగుతారు. అలాగే తోటి జరాయుజములైన ఆవులు, లేడులు, గుర్రముల వంటి వాటి పాలు వీరు తాగవచ్చు అని చెప్పారు.
ఈ పాలు అనేవి తమ బిడ్డ తాగేదాని కంటే రెండింతల ఎక్కువగానే జరాయుజములు ఉత్పత్తిచేస్తాయి. కాబట్టి దూడ తాగిన తర్వాత మిగిలిన పాలను ఈ జరాయుజములు సహజంగానే విసర్జించేస్తాయి. అంటే పితకకపోతే ఎక్కువైన పాలను ఏ చెట్టుకో పొదుగును అదిమిపెట్టి కార్చేస్తాయి. కాబట్టి ఇలాంటి పాలు సేకరించడంవల్ల జరాయుజముల ప్రాణనష్టాన్ని కలిగించడం జరగడంలేదు!
కాబట్టి #పాలు #ఖచ్చితంగా #శాకాహారమే!
అయితే దీనికి ఒక నియమం చెప్పారు. ఉద్భిజములను’ తిని బ్రతికే ’జరాయుజముల’ పాలు మాత్రమే శాకాహారం – అంటే గడ్డి తిని పాలిచ్చే ఆవుపాలు శాకాహారం.
కానీ మిగిలినవాటిని తిని పాలిచ్చే జరాయుజముల పాలు మాంసాహారం అంటే ఆవును తిని పాలిచ్చే పులి పాలు మాంసాహారమే!
మానవులు స్వతస్సిద్ధంగా ఉద్భిజములను’ తిని బ్రతికే ’జరాయుజములు’.

#గుడ్డు అనేది #ఖచ్చితంగా #మాంసాహారమే! Sterile Egg అనేదాన్ని కొన్ని రసాయనాలనుపయోగించి పెరగకుండా దానిలోని జీవాన్ని మాతృగర్భంలో ఉండగానే చంపేస్తారు. అందుకే అది పుట్టిన తర్వాతగూడా పెరగకుండా గుడ్డులాగా మిగిలిపోతుంది. ఆ గుడ్డులోనుండి పిల్ల బైటికి రాకుండా రసాయనాలు వాడి, పైగా పిల్లరాదుగదా! అది శాకాహారమే అని చెప్పడం అర్ధంలేని వాదం.

కాబట్టి సూక్షంగా ఏది కదులుతుందో, ఏది కదిలి తన ప్రాణాలను కాపాడుకో ప్రయత్నిస్తుందో, ఏది కదలిక కలిగే తనవంటి ప్రతిరూపానికి జన్మనిస్తుందో దానిని తినడం మాంసాహారం.
గుడ్డు ఖచ్చితంగా మాంసమే!

 పాలు  శాకాహారం

ఏది కదలదో, ఏది తన కొమ్మలను మరింతగా, ఆకులను మరింతగా మొలిపించుకో గలుగుతుందో అది శాకాహారం.

చేపలు ‘అండజముల‘ క్రిందకే వస్తాయి. అంటే గుడ్లనుండి పుట్టేవి, కదలిక కలిగినటువంటివి కాబట్టి చేపల వంటివి గూడా మాంసాహారం క్రిందకే పరిగణించబడుతుంది.
ప్రతి జీవికి తన స్వతస్సిద్ధమైన తిండి ఉంటుంది. మేకలు, ఆవులు, గుర్రములు స్వతస్సిద్ధంగా పచ్చిక మేస్తాయి. పులులు, సింహములు, గద్దలు స్వతస్సిద్ధంగ మాంసమును తింటాయి.
మానవులు స్వతస్సిద్ధంగా పండ్లు, కూరగాయలు, కొన్నిరకముల గడ్డి మరియు గడ్డిగింజలు (వరి, గోధుమ మొదలగునవి) తింటారు.
మనుషుల శరీర నిర్మాణాకృతి అంతర్గతమైన జీర్ణావయవములు
ఈ విషయాన్నే నిర్ధారిస్తాయి.

మానవుల ప్రేగులు దాదాపు ఏడు మీటర్ల పొడవుంటాయి.
ఇవి మిగిలిన శాకాహార జరాయుజములైన దుప్పి,లేడి, ఆవులను పోలిన నిర్మాణం.
కానీ పులి, సింహము వంటి సహజసిద్ధమైన మాంసాహార జరాయుజముల పొట్టలోని ప్రేగులు మీటరు పొడవుగూడా ఉండవు. ఎందుకంటే ఇవి మాంసం తింటాయి, మాంసము అంటే అప్పటికే ఒక జంతువు తిని అరిగించుకుని బలంగా మార్చుకున్న పదార్థం. అందువల్ల తిరిగి మాంసాన్ని అరిగించుకోవాల్సిన అవసరం వీటి ప్రేగులకు ఉండదు,
వీటి ప్రేగులపై అంత భారమూ పడదు. అందుకని స్వతస్సిద్ధంగా మాంసం తినే జంతువుల ప్రేగులు చాలా చిన్నవిగా ఉంటాయి.

కాబట్టి మానవులు స్వతస్సిద్ధంగా శాకాహరజీవులు. అలాగే జీవించాలి.

కామెంట్‌లు లేవు: