29, సెప్టెంబర్ 2020, మంగళవారం

రామాయణమ్..77

 

..

గుహుడు తెప్పించిన మర్రిపాలు జుట్టుకు తను రాసుకొని తమ్ముడు లక్ష్మణునికి తానే స్వయంగా రాశాడు రాముడు.

నార చీరలుకట్టి జటలు ధరించిన సోదరులిరువురూ ఋషులలాగా శోభిల్లారు.

.

మిత్రమా గుహా ! సైన్యమూ,ధనాగారము,దుర్గము.(.Armed forces,Treasury,Defence systems) ఈ మూడిటి విషయములో ఏ మాత్రము ఏమరుపాటు లేకుండా ఉండు .రాజ్యము పరిపాలించుట చాల కష్టమని పెద్దలు చెపుతున్నారు ,అని రాముడు పలికి అతనిని వీడుకొల్పి నావవద్దకు వెళ్లాడు.

.

లక్ష్మణుడు ముందుగా సీతమ్మను ఎక్కించి,తాను ఎక్కాడు ఆ తరువాత రాముడు నావ ఎక్కి కూర్చున్నపిదప గుహుడు నావను అవతలి ఒడ్డుకు చేర్చమని ఆజ్ఞాపించాడు.

.

రాముడు నావెక్కిన వెంటనే తన శ్రేయస్సును కోరుతూ నావెక్కేటప్పుడు జపించే మంత్రాన్ని జపించాడు .

.

నావ గంగానది మధ్యకు చేరింది!

.

అప్పుడు సీతమ్మ గంగమ్మను ప్రార్దించింది .ఆవిడకు మొక్కుకుంది.

అమ్మా ! వనవాసము నుండి మేము క్షేమముగా తిరిగి వచ్చిన పిదప నిన్నుకొలుస్తానమ్మా! 

.

నీ సంతోషం కోసం బ్రాహ్మణులకు లక్షలగోవులు,అన్నవస్త్రాలు ఇస్తాను

నేను నియమముతో నీకు వేయి కుండ లతో కల్లు,మాంసాహారము, సమర్పించుకుంటానమ్మా!

నీ ఒడ్డున ఉన్న సమస్తదేవతలను పూజించుకుంటాను.

.

ఇలా ఆవిడ మొక్కులు మొక్కుకుంటూ ఉండగనే నావ దక్షిణపు ఒడ్డును చేరుకుంది.

.

రాముడు నావ దిగాడు మెల్లగా సీతమ్మకు చేయి అందించి సుతారంగా పట్టుకొని దింపాడు ,ఆతరువాత లక్ష్మణుడు కూడా దిగాడు.

.

అది నిర్జన ప్రదేశము ! లక్ష్మణుడితో కూడి సీతారాములు నడక మొదలు పెట్టారు. ముందు లక్ష్మణుడు ఆవెనుక సీత వారిరువురినీ కాచుకుంటూ వెనుక రామచంద్రుడు.సీతమ్మ భద్రంగా రామలక్ష్మణుల మధ్యలో నడువసాగింది.

.

నడుస్తూ మాట్లాడు కుంటున్నారు.వనవాసంలో కష్టాలేమిటో ఇకనుంచీ సీతకు బాగా అర్ధమవుతయిలే( రావద్దంటే పట్టుబట్టి భర్తమీద అలిగి మరీ వచ్చిందిగా సీతమ్మ,ఇహ రామయ్యమొదలుపెట్టాడు ఆవిడకు కష్టాలగురించి చెప్పటం ! ఇది దెప్పిపొడుపేనేమో)..ఏ పని అయినా మన చేయిదాటిపోతే దానిని సరి చేయటం చాలా కష్టం ! ( నిజమే కదా).

.

ఈ వనంలో జనులుగానీ ,పొలాలుగానీ,తోటలుగానీ ఉండవు !మిట్టపల్లాలు,లోతైన లోయలు ఉంటాయి అట్లాంటి వనంలోకి సీత ఈనాడు ప్రవేశిస్తున్నది.

.

నడిచీ,నడిచీ బాగా ఆకలి వేస్తున్నది మువ్వురికీ 

అప్పుడు లక్ష్మణుడు వరాహము,దుప్పి,నల్లచారలదుప్పి ,ఋష్యము అనే మహా మృగాలను చంపి వాటి మాంసాన్ని శుద్ధిచేసి భుజించి రాత్రి విశ్రమించటానికి ఒక చక్కటి చెట్టు మొదలు చూసుకొని దాని క్రిందకు చేరారు.

.


జానకిరామారావు వూటుకూరు గారి 

సౌజన్యం తో ....


*ధర్మధ్వజం*

హిందు చైతన్య వేదిక

కామెంట్‌లు లేవు: