2, సెప్టెంబర్ 2020, బుధవారం

*🌷(ఓ నీతి కథ)🌷*

🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹
 
ఒక అడవిలో కొంతమంది ఆటవికులు ఒక గుడి కట్టుకున్నారు. వారికి రాతి విగ్రహాలు దొరకవు కనుక ఒక చెక్క దుంగని విగ్రహంలా చేసి పసుపు కుంకుమలు అలిమి వస్త్రం కప్పి దానికే పూజలు చేసేవారు. అమ్మవారు కూడా ప్రసన్నమై కోరిన కోర్కెలు తీర్చేది. ఆగుడికి ఒక పూజారిని మాట్లాడి నిత్యం పూజలు చేయించేవారు. అతడు అక్కడికి 5మైళ్ళ దూరం నుండి రోజు వచ్చి పూజలు చేసి వెళుతూ ఉండేవాడు. ఒక్కనాడు కూడా విసుక్కోలేదు. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు భోరున వర్షం కురిసింది. కుంభవృష్టి లా మారింది.

ఆరోజు ఆగుడికి దగ్గర్లోకి కట్టెలు కొట్టుకునేవాడు ఒకడు వచ్చాడు. వర్షం కురుస్తూ ఉండడం వలన నిలువడానికి నీడలేక చుట్టూ వెదికితే దగ్గరలో ఈ గుడి కనబడింది. వెంటనే గుడిలోకి వెళ్ళాడు. ఎదురుగా చూస్తే పెద్ద దుంగ కనబడింది. వెంటనే ఆహా! వర్షం వచ్చి చెట్లన్నీ తడిసిపోయాయి ఈరోజు కడుపుకి తిప్పలే అనుకుంటున్న తరుణంలో ఎదురుగా ఇంత పెద్ద దుంగ దొరకడం అదృష్టం, అనుకొని ఆటవికులు పూజించే ఆదుంగని కొట్టబోయాడు. వెంటనే "ఒరేయ్ నన్ను కొట్టకు అంది. అందులో ఉన్న అమ్మ. వీడికి దేవుడు దెయ్యం అంటే ఏమిటో తెలియని నిషాదుడు కనుక "ఎవర్రా దుంగ వెనుక దాక్కొని మాట్లాడుతుంది? రండి బయటికి" అన్నాడు అమ్మవారు అని తెలియని అజ్ఞానంతో.

అప్పుడు ఆ దుంగ నుండి అమ్మవారు బయటికి వచ్చి నేను అమ్మని. నన్ను కొట్టకు అనగానే! ఐతే నిన్ను కొట్టకపోతే నాకడుపు సంగతి ఏంటి? అంటే! ఇదిగో నీకు వంద బంగారు నాణేలు ఇస్తాను, అని ఒక మూట అక్కడ పడేసి మాయమయింది. ఆ మూటలో ఉన్న బంగారు నాణేలు చూసేసరికి చేతిలో ఉన్న గొడ్డలి అక్కడ పడేసి మూట తీసుకొని వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడే అక్కడికి వచ్చి ఇదంతా చూస్తున్న పూజారికి ఒక సందేహం వచ్చింది. రోజూ నేను అంత దూరం నుండి వచ్చి పూజలు చేస్తుంటే నాకు మాత్రం ఏమి ఇవ్వదా! గొడ్డలితో కొట్టబోయే ఆబోయవాడిని కనికరించిందా! అని గొడ్డలితో అమ్మవారిని నరకబోయాడు. గొడ్డలి ఎత్తాడో లేదో కళ్ళు పోయాయి. చూపు పోయింది.

అమ్మా! ఎంత అపచారం చేశాను! తల్లీ నన్ను క్షమించు అనగానే అమ్మవారు ప్రత్యక్షమై "వాడు అజ్ఞాని. దేవుడంటే ఏమిటో తెలియదు. నన్ను చూసి ఒట్టి కట్టె ముక్క అనుకోని కొట్టబోయాడు. నువ్వు జ్ఞానివి. నిత్యం నన్ను పూజిస్తున్నావు. "అజ్ఞాని నరకబోగా కనికరించాను అని నువ్వు అనుకొని నువ్వు కూడా అదేపని చేయబోయావు. ఏమితెలియని అజ్ఞాని చేసిన పని అన్ని తెలిసిన నువ్వు చేస్తే ఎలా? పైపెచ్చు దేవతగా కొలిచే నన్నే నువ్వు నరకబోయావు. అందుకే కళ్ళు మాత్రమే తీసేశాను. చూపు తీయకపోతే నువ్వు పూర్తిగా సర్వనాశనం అయిపోయేవాడివి" అనగానే అమ్మా! క్షమించు. మరొక సారి ఇలాంటి పొరబాటు చేయను. దయచేసి చూపు ప్రసాదించు అనగా అమ్మ కనుక కనికరించి చూపు ఇచ్చి వాడికి సంపద దొరికిందని నువ్వు పొరబాటు పడుతున్నావు. అకారణంగా వచ్చే సంపాదన ఉపయోగపడదు. అక్కడ ఏమి జరుగుతుందో నీకు తెలియదు. వెళ్ళు, వెళ్లి అక్కడ ఏమి జరుగుతుందో చూడు అనగానే ఆ బోయవాడిని అనుసరిస్తూ వెనుకే వెళ్ళాడు పూజారి.

బోయవాడు తన ఇంటికి చేరుకొని భార్యని పిలిచి "జరిగింది చెప్పి ఇదిగో 100 బంగారు నాణేలు" అని చూపించగానే భార్యకి బంగారం మీద ఆశపుట్టి నాకు ఒడ్డాణం చేయించు, ఉంగరం చేయించు, బొంగరం చేయించు అని భర్తని అడిగింది. భర్త వినలేదు. ఇంతలో కొడుకు వచ్చాడు. వాడు వ్యసనపరుడు. రోజూ ఆరంగా ఆరంగ త్రాగుతూనే ఉంటాడు. అప్పటికే బాగత్రాగి ఉన్నాడు. ఆ బంగారు నాణేలు చూసి "నాన్నా! అవి నాకు ఇవ్వు. నేను జూదమాడలి. బాగా త్రాగాలి అని అడిగాడు. భార్యని కొడుకుని బయటికి గెంటి లోపల ఉన్న బీరువాలో దాచాడు. భార్య లోపలికి వచ్చింది. ఇద్దరికీ వాదోపవాదాలు బాగా జరుగుతున్నాయి. ఇంతలో కొడుకు ఒక గొడ్డలి తీసుకొచ్చి తల్లిదండ్రులను ఇద్దరిని నరికేసి ఆ బంగారు నాణేలు తీసుకెళ్లిపోయాడు. అకారణంగా వచ్చిన సంపద ఆకారణంగానే పోయింది. ఆ సంపదతో పాటు ప్రాణాలు కూడ పోయాయి. అది చూసి చలించిపోయిన పూజారి వెంటనే గుడికి వెళ్లి అమ్మ పాదాలపై పడి క్షమాపణలు కోరుకున్నాడు.🙏

చూసేరా నిత్యం పూజలు చేస్తూ మధ్యలో నాస్తికవాదం లోకి మారితే ఇలాంటి ప్రమాదాలే వస్తాయి. దేవుడిని వేడుకోక ముందు కష్టాలు ఉన్నాయి. వేడుకున్న తరువాత ఇంకా కష్టాలు వస్తున్నాయి అంటే మనం చేసిన పాపాలు ముందుగా తీసేస్తున్నాడు అని అర్థం. అంతేకాని అడిగిన వెంటనే సుఖం ఇచ్చి కోరిన కోర్కెలు తీరిస్తే సుఖంగానే ఉంటాం. కానీ మళ్లీ ఏదో ఒక సమయంలో కష్టాలు చుట్టుముడతాయి. మళ్లీ జన్మ ఎత్తాలి. అప్పుడు మళ్లీ మళ్లీ పరుగులుపెట్టాలి అవసరమా?

అదే మనం చేసిన పాపాలు ముందుగా ప్రక్షాళన అయిపోతే చివరివరకు సుఖంగా జీవిస్తావు. అలాగే మనం కోరుకునే కోరిక కూడా మనకి తగినది అవునా కాదా! అనేది కూడా తెలుసుకొని కోరుకోవాలి. కొందరు ఎంత వేడుకున్నా కోరికలు జీవితంలో తీరవు. ఎందుకంటే వాడు దానికి అర్హుడు కాదు.
నేను సీఎం అవ్వాలి అనుకుంటే అయిపోతుందా అవ్వదు, ఎందుకంటే నేను దానికి అర్హుడిని కాదు కాబట్టి ఆ కోర్కె తీరదు. కష్టపడతాను సాధిస్తాను అంటే జీవితకాలం కష్టపడుతూనే ఉంటావు. కోట్లమందిలో ఒక్కడికి మాత్రమే అవకాశం వస్తుంది. అది నేను ఎందుకు కాకూడదు అని పిడివాదం చేస్తే నాస్తికుడిలా మారిపోతావు. చివరికి భ్రష్టత్వం వస్తుంది.

మనకు ఏది కావాలో మనకు తెలీదు. మనల్ని సృష్టించిన పరమాత్మకు, మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు. పరమాత్మని కొలిచేటప్పుడు కష్టం రావచ్చు కానీ నువ్వు చేసిన పూజ ఫలించే (మెచ్యూరిటీ) వరకు వేచి చూడాల్సిందే. ఏదో ఒకరోజు ఫలం వచ్చి తీరుతుంది. ఫలితం రాకుండా మాత్రం ఉండదు. నువ్వు పూజలు చేసినన్ని రోజులు కష్టాలు పడి నాస్తిక వాదంలోకి మారిపోగానే కలిసి వచ్చింది అనుకోవడం అజ్ఞానం. నువ్వు చేసిన వ్రత ఫలం అనుభవిస్తున్నావు. ఆవిషయాన్ని నువ్వు గ్రహించడం లేదు అంతే. ఎందుకంటే అప్పటికే నాస్తికవాదంలో కూరుకుపోయావు. దీని ఫలితం కూడా అనుభవించాల్సిందే. పాపానికి కూడా పరిపూర్ణత (మెచ్యూరిటీ) రావాలి కదా, భక్తి అయినా, నాస్తికవాదం అయినా పుట్టుకతో వస్తే దానిని అలా చనిపోయేవరకు తీసుకెళ్లాలి. నాస్తిక వాదం నుండి భక్తిలోకి వస్తే పర్లేదు, కాని భక్తి నుండి నాస్తికవాదం లోకి వెళితే వంశాలకి వంశాలు సర్వనాశనం అవుతాయి. కాబట్టి చేసిన పూజకి ఏనాటికైనా ఫలితం తప్పకుండా వస్తుంది. రాలేదని నాస్తికవాదంలోకి వెళ్ళకండి. సహనమే ప్రదానం.

దైవానికి ఎవరిమీద పక్షపాతం ఉండదు. చేసే ప్రతిపనికి ఫలితాన్ని ఇస్తాడు. నువ్వు పరిపూర్ణుడివి కావాలంటే ముందుగా నువ్వు శుద్ధం అవ్వాలి. బంగారాన్ని పుటం పెట్టిన తరువాత ఎంత అద్బుతంగా తయారవుతుందో చేసిన పాపాలు ప్రక్ష్యాళన అయ్యేవరకు కష్టాలు పడుతున్నట్లు అనిపిస్తుంది. ఒక్కసారి కర్మ శుద్ధం అవగానే పరిపూర్ణత్వం వస్తుంది అప్పుడు ఎచక్క
 ప్రతి క్షణం ఒకే స్థితి ఆనందమే ఆనందం
ఆ తండ్రి పాదాల చెంత చేరే వరకు 🙏

 శివయ్యా! అందరిని చల్లగా చూడు తండ్రీ! 🙏

కామెంట్‌లు లేవు: