2, సెప్టెంబర్ 2020, బుధవారం

పోయిన ధనం

పునర్విత్తం పునర్మిత్రం
పునర్భార్య పునర్మహి
ఏతత్సర్వం పునర్లభ్యం
న శరీరం పునః పునః।।

పోయిన ధనం మళ్లీ చేరుతుంది.
దూరమైన మిత్రుడు చేరువ అవుతాడు.
భార్య గతిస్తే మరొక భార్య లభిస్తుంది. భూసంపద మళ్లీ ప్రాప్తిస్తుంది.
పోయినవన్నీ మళ్లీ తిరిగి రాబట్టుకోవచ్చు!
కాని శరీరం మాత్రం మళ్లీ మళ్లీ రాదు.
అందుకే శరీరం ఖలు ధర్మ సాధనం అన్నారు. కేవలం శరీరం ఉంటేనే ధార్మిక పనులు చేయవచ్చు. శరీరం ఉంటేనే నాలుగు మంచి పనులు చేసే అవకాశం వస్తుంది. శరీరం ఉంటేనే హిత వాక్యాలు చెప్పవచ్చు. ఏ పని చేయడానికైనా శరీరం కావాలి. కనుక శరీరమును రక్షించుకోవాల్సింది మానవ జన్మ వచ్చిన వాళ్లే.

జంతువులకు శరీరం ఉంటుంది కాని వాటికి ఆలోచన ఉండదు.
పైగా ఆలోచన కలిగినా దాన్ని అమలు చేయడానికి శరీరం సహకరించదు.

బుద్ధి, ఆలోచన ఉండేది మనుష్యులకే. వాటిని అమలు చేసే నైపుణ్యమూ మనుష్యులకే ఉంటుంది. కనుక మనం అందరమూ శరీరాన్ని కాపాడుకోవాలి. అతిగా తిన్నా, అతిగా ఆలోచించినా, అతిగా సుఖం కలిగించినా,
అతిగా దుఃఖం కలిగించినా
ఏదైనా అతి చేస్తే శరీరం కాస్త పుటుక్కుమంటుంది.
ఇక శరీరం చేజారి పోయాక చేసేది ఏమీ ఉండదు.
కనుక ముందు శరీరమును జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికి సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలను పాటించడమే మహౌషధంగా పనికి వస్తుంది.

విస్తరాకు

విస్తరి ఆకుని ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని భోజనానికి కూర్చుంటాము. బోజనము తినే వరకు ఆకుకు మట్టి అంటకుండా జాగ్రత్త వహిస్తాము.
తినిన మరుక్షణం ఆ విస్తరి ఆకును మడిచి, దూరంగా పడేసి వస్తాము,
మనిషి జీవితం కూడ అంతే. ఊపిరి పోగానే ఊరి బయట పారేసి వస్తారు.
విస్తరి ఆకు పారేసినప్పుడు సంతోష పడుతుంది, ఎందుకంటే పొయే ముందు ఒకరి ఆకలిని తీర్చటానికి తను ఉపయోగ పడినాను అన్న తృప్తి ఆకుకు ఉంటుంది.
విస్తరి ఆకుకు ఉన్న ముందు ఆలోచన భగవంతుడు మనుషులకు కూడా ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ !

సేవ చేసే అవకాశము వచ్చినపుడు చేయండి.

మరి ఎప్పుడో చేయవచ్చు అనుకొని వాయిదా వేయకండి. ఆ అవకాశము మళ్లీ వస్తుందని అనుకుంటే కుండ ఎప్పుడైనా పగలవచ్చు. అప్పుడు విస్తరికి ఉన్న తృప్తి కూడ మనకి ఉండదు.
యెంత సంపాదించి ఏమి లాభం ? ఒక్క పైసా అయినా తీసుకుపోగలమా?

కామెంట్‌లు లేవు: