22, జులై 2026, బుధవారం

అద్భుతమైన కథ*

  🟡🔵🔴🟢🙏🟢🔴🔵🟡


బ్రాహ్మణ పురాణము నుండి ఒక చిన్న కథ 


*ఇల - అద్భుతమైన కథ*


చాలా కాలం క్రితం సూర్యుడికి వైవస్వత మనువు అనే కుమారుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు శ్రద్ధ. వాళ్ళిద్దరికీ చాలా కాలం పిల్లలు లేరు. 


అందుకని వాళ్ళు మహర్షి అగస్త్యుడిని పెద్దగా నియమించి "మిత్రావరుణేష్టి" అనే యజ్ఞం చేశారు. కొడుకు కావాలని మనువు కోరుకున్నాడు. కానీ కూతురు పుట్టాలని శ్రద్ధ కోరిక. ఆడపిల్లను అనుగ్రహించమని శ్రద్ధ మనసులోనే ప్రార్థించింది.


యజ్ఞ ఫలితంగా శ్రద్ధకు కూతురే పుట్టింది. ఆ పాపకు 'ఇల' అని పేరు పెట్టారు. కానీ కుమారుడు కావాలని సంకల్పించి యజ్ఞం చేసినందుకు మనువు అగస్త్యుడిని అడిగాడు. అప్పుడు అగస్త్యుడు "సంకల్పదోషం వల్ల కూతురు పుట్టింది" అని చెప్పాడు. వశిష్ట మహర్షి తన తపోమహిమతో 'ఇల'ను మగపిల్లవాడిగా మార్చాడు. అతనికి "సుద్యుమ్నుడు" అని పేరు పెట్టారు.


ఒకరోజు సుద్యుమ్నుడు మిత్రులతో కలిసి వేటకు వెళ్ళాడు. దారిలో వాళ్ళు కైలాసానికి దగ్గర్లో ఉన్న కుమారవనంలోకి ప్రవేశించారు. ఆ వనంలోకి అడుగుపెట్టగానే అందరూ ఆడవాళ్ళుగా మారిపోయారు. 


అసలు ఏం జరిగిందంటే... ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ఆ వనంలో ఉండగా శంకరుడి మహిమను చూడడానికి మునులు వచ్చారు. లజ్జతో పార్వతి ఒక పొద చాటున దాక్కుంది. ఆ స్థితిని చూసిన మునులు వెంటనే వెళ్ళిపోయారు. దాంతో కోపం వచ్చిన పరమేశ్వరుడు "ఇకపై ఈ వనంలోకి ప్రవేశించే ఏ పురుషుడైనా సరే వెంటనే స్త్రీగా మారిపోతాడు" అని శపించాడు.


శాపం తెలియక వచ్చిన సుద్యుమ్నుడు కూడా స్త్రీగా మారిపోయాడు. చాలా రోజులు అడవిలోనే ఉండిపోయిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. అలా సుద్యుమ్నుడు మళ్ళీ 'ఇల'గా మారాడు.


ఇల రూపంలో ఉన్నప్పుడు బుధుడు ఆమెను చూసి మోహించాడు. వాళ్ళిద్దరి అనురాగానికి పురూరవుడు అనే కుమారుడు పుట్టాడు. తర్వాత ఇల మళ్ళీ పురుషుడిగా కావాలని వశిష్టుడిని వేడుకుంది. వశిష్టుడు పరమేశ్వరుడిని ప్రార్థించాడు. ఈశ్వరుడు కరుణించి "ఇకపై ఇల నెలకు 15 రోజులు పురుషుడిగా, 15 రోజులు స్త్రీగా ఉంటుంది" అని వరం ఇచ్చాడు.


పురుషుడిగా ఉన్న రోజులు సుద్యుమ్నుడు రాజ్యాన్ని పాలించేవాడు. స్త్రీగా ఉన్న రోజులు ఇల రాజప్రాసాదంలోని మందిరంలో పూజలు చేసుకునేది. 


ఇల-బుధుల కుమారుడు పురూరవుడు పెద్దయ్యాక రాజ్యాన్ని చేపట్టాడు. అప్పటివరకు ఇల సోదరుడు ఇక్ష్వాకుడు రాజ్యాన్ని చూసుకున్నాడు. 


తర్వాత వైవస్వత మనువుకు ఇల తర్వాత ఇంకా పదిమంది కుమారులు పుట్టారు. వాళ్ళతోనే సూర్యవంశం మొదలైంది.


పురూరవుడు రాజ్యభారం తీసుకున్నాక సుద్యుమ్నుడు తపస్సుకు వెళ్ళాడు. నారదుడు ఉపదేశించిన మంత్రంతో దేవిని స్తుతించాడు. దేవి ప్రసన్నురాలై మోక్షాన్ని ప్రసాదించింది.


పురూరవుడు జనార్దనుడిని ఆరాధించి గొప్ప చక్రవర్తి అయ్యాడు. ఊర్వశిని వివాహం చేసుకున్నాడు. వాళ్ళకు పదిమంది కుమారులు కలిగారు. కొన్ని పురాణాల ప్రకారం ఆరుగురు, మరికొన్నింటి ప్రకారం తొమ్మిదిమంది అని కూడా ఉంది.

🔵🔴🟢🟡🙏🟡🟢🔴🔵

కామెంట్‌లు లేవు: