4, నవంబర్ 2020, బుధవారం

వి.బి.రాజేంద్రప్రసాద్

 నటుడవ్వాలని వచ్చి నిర్మాతగా స్ధిరపడ్డ వి.బి.రాజేంద్రప్రసాద్ జగపతి పిక్చర్స్ మరియు జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత. అరవై, డెబ్బై దశకాలలో విజయవంతమైన చిత్రాలు నిర్మించి ఆనాటి మేటి చిత్ర నిర్మాతలలో ఒకరిగా నిలిచారు. ఆయన నిర్మాత, దర్శకుడు కూడా. తెలుగు, తమిళ హిందీ భాషలలో 32 సినిమాలు నిర్మించి 19 సినిమాలకు దర్శకత్వం వహించారు.


శ్రీ వి.బి.రాజేంద్రప్రసాద్ 1932 నవంబర్ 4 వ తేది, న కృష్ణా జిల్లాలోని డోకిపర్రు (కృష్ణా జిల్లా) గ్రామంలో, వ్యవవసాయ కుటుంబానికి చెందిన జగపతి చౌదరి, లక్ష్మీనరసమ్మ దంపతులకు జన్మించారు. ఆయన పాఠశాల విద్యాబ్యాసం డోకిపర్రు గ్రామంలోనూ, కళాశాల  విద్యాబ్యాసం కాకినాడ లోనూ జరిగింది. అక్కడ వారికి ఏడిద నాగేశ్వరరావుతో పరిచయమైంది.' రాఘవ కళాసమితి' అనే సాంస్కృతిక సంస్థను ప్రారంభించి ఇన్‌స్పెక్టర్ జనరల్ వంటి వంటి పలు నాటకాలు ప్రదర్శించడమే కాకుండా స్త్రీ పాత్రలో నటించి ఉత్తమ కథానాయిక బహుమతిని గెలుచుకున్నారు. కొన్నాళ్ళు విజయవాడ లో, కొంతకాలం బందరులో వ్యాపారాలు నిర్వహించారు.


నటుడవ్వాలని మద్రాస్ కి వచ్చారు వి.బి.రాజేంద్రప్రసాద్. అక్కడ ఆయనకు అక్కినేని నాగేశ్వరరావుతో పరిచయం కలిగింది. అది రాజేంద్రప్రసాద్ జీవితంలో ఒక మలుపు. అక్కినేని నాగేశ్వరరావు, వి.బి. రాజేంద్రప్రాద్ ను చాలా ప్రోత్సహించారు. వి.బి.రాజేంద్రప్రసాద్ ను అక్కినేని, ప్రముఖ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావుకు  పరిచయం చేసారు. కానీ నటుడిగా అవకాశాలు దొరకలేదు. దానితో నాగేశ్వరరావు ప్రోత్సాహంతో తండ్రిగారి పేరిట జగపతి సంస్థ స్థాపించి అన్నపూర్ణ చిత్రంతో చిత్ర నిర్మాణం ప్రారంభించారు. దసరా బుల్లోడు  చిత్రంతో దర్శకుడిగా మారారు. వారి సంస్ధలలో నిర్మించిన చిత్రాలకేకాకుండా అందరూ దొంగలే సినిమాకు దర్శకత్వం వహించారు. ఎనభై దశకం నుండి చిత్ర విజయాలు తగ్గాయి. క్రమంగా చిత్రనిర్మాణాన్ని తగ్గించారు.


చిత్రరంగానికి నిర్మాతగా, దర్శకునిగా వి.బి.రాజేంద్రప్రసాద్ అందించిన సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2003వ సంవత్సరానికి ప్రతిష్ఠాత్మకమైన రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించింది.


తీవ్రమైన అస్వస్థతకు గురై హైదరాబాద్ లోని ఇషా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈయన 2015, జనవరి 12 సోమవారం రోజున మరణించారు

కామెంట్‌లు లేవు: