28, సెప్టెంబర్ 2020, సోమవారం

రామాయణమ్.76

 

..

భాస్కరోదయ కాలొయం గతా భగవతీ నిశా

అసౌ సుకృష్ణో విహగః కోకిలస్తాత కూజతి

.

నాయనా పూజ్యురాలైన రాత్రి గడిచినది సూర్యోదయ సమయము ఆసన్నమైనది చాలా నల్లనియైన పక్షి కోకిల కూయుచున్నది.(పూజనీయురాలైన రాత్రి అట ,వందే వాల్మీకి కోకిలం).

.

రామచంద్రుడు నిదుర లేచాడు ఆయనకు కోకిలకూతలు,నెమళ్లక్రేంకారాలు సుప్రభాతగీతికలయి మేల్కొలుపులు పాడినాయి.( ప్రకృతి ఏర్పాటు చేసిన వంది మాగధులు వీరు).

.

లేచిన వెంటనే ఆలస్యం చేయకుండా తాము చేయవలసిన పనిని లక్ష్మణునకు చెప్పాడు. వెంటనే గంగ దాటాలి .

.

లక్ష్మణుడు ఆ వార్త గుహుడికి చేరవేశాడు ! హుటాహుటిన గుహుడప్పుడు దృఢమైనది ,చక్కగా అలంకరింపబడినది,సమర్ధులైన నడుపువారు కలది,అయిన నావను రేవులో సిద్దం చేసి ,రాముని వద్ద వినమ్రుడై నిలుచున్నాడు.

.

అప్పుడు రాముడు ఆనందంగా మిత్రమా మమ్ము ఆవలి ఒడ్డుకు చేర్పించవయ్యా అని పలికాడు.

.

ఇంతలో సుమంత్రుడు వచ్చి రామా ఏమి ఆజ్ఞ అన్నట్లుగా చేతులు మోడ్చి నిలుచున్నాడు.

.

రాముడు తన కుడి చేతితో సుమంత్రుని స్పృశిస్తూ ఇక నీవు తిరిగి వెళ్ళి రాజును కనిపెట్టుకొని ఉండుము అని పలికాడు.

.

అప్పటిదాకా రాముడితో కలిసి వున్న సుమంత్రుడు తిరిగి వెళ్ళాల్సి వచ్చేటప్పటికి కరిగి నీరైనాడు ...రామా ! నీ కష్టాలు చూస్తుంటే ఋజుత్వానికి గానీ,బ్రహ్మచర్యానికి గానీ,వేదాధ్యయనమునకు గానీ, మృదుత్వానికిగానీ ఫలం లేదు అనిపిస్తున్నది ! 

.

నీ కష్టాలు భరించగలగటం నీవలననే సాధ్యం లోకంలో ఏ ఒక్క పురుషుడి వల్లకూడా కాదు సుమా ! ( ఈ మూడు రోజులకే ఇట్లా అంటున్నాడీయన ,ఇక ముందు ఏమి కానున్నదో ఈయనకు తెలియదు).

.

మేమెంత దురదృష్టవంతులము! ! నీకు దూరమై పాపాత్మురాలైన ఆ కైక వశులమై ఇక బ్రతుకీడ్చాలి.అని పరిపరివిధాలుగా దుఃఖిస్తున్న సుమంత్రుని చూసి రాముడు ,సుమంత్రా ఇన్ని వేల సంవత్సరాలనుండీ రాజులు పరిపాలిస్తున్నారు రాజాజ్ఞ అనుల్లంఘనీయము ,అప్రతిహతము కదా! అయినా అడవిలో జీవించవలసినందులకు నేనుగానీ సీతగానీ లక్ష్మణుడుగానీ ఏ మాత్రము బాధపడటంలేదు.పద్నాలుగేండ్లు ఎన్నాళ్ళలో తిరిగి వస్తాయి చెప్పు ,మేము ఇలా వెళ్లి అలా తిరిగి వస్తాము. అయోధ్యలో మరల మీ అందరితో కలిసి ఆనందంగా కాలం గడుపగలము. కావున నీవు విచారింపకుము అని పలికి అయోధ్యలో అందరికీ పేరుపేరునా తన నమస్కారములు తెలియచేయమన్నాడు.

.

రామా నిన్ను విడిచి నేను వెళ్ళలేను ,నిన్ను విడిచి ఉండలేనయ్యా! నీ భక్తుడను,నీ భృత్యుడను,మర్యాద కాపాడువాడను నన్ను విడువకయ్యా, నీ తోటే ఉంటాను నాకు అనుజ్ఞ ఇవ్వు అని సుమంత్రుడు రాముని వేడుకుంటున్నాడు.

.

సుమంత్రా నీవు తిరిగి వెళ్ళకపోతే మా అమ్మ కైకేయికి నేను అరణ్యానికి వెళ్ళాననే నమ్మకము కలిగేదెట్లా? అందుకోసమైనా నీవు తిరిగి వెళ్లాలి.అని సుమంత్రుని సమాధాన పరిచినాడు.

.

గుహుని వైపు తిరిగి మిత్రమా మర్రిపాలు తెప్పించయ్యా జటాధారిని కావాలి నేను ! అని పలికాడు.

.


జానకిరామారావు వూటుకూరు గారి 

సౌజన్యం తో ....


*ధర్మధ్వజం*

హిందు చైతన్య వేదిక

కామెంట్‌లు లేవు: