17, అక్టోబర్ 2020, శనివారం

  సేకరణ 👇


క్రియా యోగం అంటే 



?




ప్రపంచమంతా సంచలనం కలిగించి,అనేక భాషలోకి అనువదించబడి,పలు ప్రచురణలు పొంది– లక్షలాది మంది జీవితాలను మార్చిన గ్రంధాలలో “Autobiography of a Yogi” ఒకటి. దీనిని వ్రాసిన పరమహంస యోగానందగారు, యుక్తేస్వర్ గిరిగారి శిష్యుడు. ఆయన లాహిరీ మహాశయుల శిష్యుడు. లాహిరీ మహాశయుడు బాబాజీగారి శిష్యుడు.బాబాజీ అనే మహనీయుడు రెండువేల సంవత్సరాల నుంచి బ్రతికే ఉన్నాడంటారు.ఈయన నివాసస్థలం హిమాలయాలలోని తెహ్రీ ఘర్వాల్ ప్రాంతం. ఈయన ఈనాటికీ అదృష్టవంతులకు కనిపిస్తూ ఉంటాడు అని అంటారు.. ఈయనకు కాలం, దూరంతో సంబంధం లేదు. కాంతి శరీరంతో ఎక్కడైనా ప్రత్యక్షం కాగలడని వారి అనుచరుల నమ్మకం. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కి బాబాజీ గారి దర్శనభాగ్యం అయినట్లు ఆయనే చెప్పటమే కాకుండా,బాబా’అనే పేరుతొ ఒక సినిమాను కూడా నిర్మించాడు.




భగవానుడు సూర్యునికి నేర్పిన యోగం కాల క్రమేణా క్షయమై పోగా, నవీన కాలంలో దీనిని తిరిగి ఉద్ధరించిన మహాత్ముడు బాబాజీ. దీనినే ‘క్రియాయోగం’ అని అంటారు. దీనిని గురు ముఖతః నేర్చుకోవాలి. దీనిని బాగా అభ్యాసం చేస్తే 12 సంవత్సరాలలో భగవత్(సత్య) దర్శనం పొందటానికి అనువుగా శరీరాన్ని తయారు చేస్తుంది. క్రియా యోగంలో ముఖ్య మైన అంశం క్రియాకుండలినీ ప్రాణాయామం. దీనిని అభ్యాసం చెయ్యటం ద్వారా వెన్నెముకలో గల నాడులు, చక్రములు ఉత్తేజితములై సాధకునికి ఓంకార నాదం వినబడుతుంది. భ్రూమద్యంలో వెలుగు కనిపిస్తుంది. శరీరంలోగల అన్ని ప్రాణనాడులు ఉత్తేజాన్ని పొందుతాయి.        




    క్రియా యోగంలో అయిదు మెట్లు ఉన్నాయి. మొదటి క్రియాదీక్షతోనే చాలా వరకు సాధన జరుగుతుంది. సాధకుని పురోగతిని బట్టి తరువాతి దీక్షలు ఇవ్వ బడుతాయి. కొందరికి పరమ గురువుల దర్శనం కలుగుతుంది. వారి ద్వారానే తరువాతి దీక్షలు ఇవ్వబడవచ్చు.క్రియాయోగమన్నది,మనిషి రక్తంలో ఉన్న కర్బనాన్ని హరింప చేసి,ప్రాణ వాయువుతో నింపే ఒకానొక మానసిక-శరీరక ప్రక్రియ.ఎలిజా,ఏసు,కబీరు,మొదలైన వారు ఈ ప్రక్రియను ఉపయోగించి ఫలితాలను సాధించారని అంటారు .భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ ఈ క్రియాయోగాన్ని గురించి రెండు చోట్ల ప్రస్థావించారు.నాల్గవ అధ్యాయం,29 వ శ్లోకమిలా చెబుతుంది–




అపానే జుహ్వాతి ప్రాణం ప్రాణేపానాం తథాపరే


ప్రాణాపానగతీ రుద్ధ్వా ప్రాణాయామ పరాయణ:


అర్ధాన్ని వివరిస్తాను–యోగి,ఊపిరితిత్తులు ,గుండె చేసే పనిని నెమ్మదిచేసి, దాని ద్వారా అదనంగా ప్రాణశక్తి సరఫరా అయేటట్లు చేసుకొని,శరీరంలో జీవకణ క్షయాన్ని అరికడతాడు.




అంతే కాకుండా,అతను,అపానాన్ని(విసర్జక ప్రవాహం) అదుపు చేసుకొని శరీరంలో పెరుగుదలకు సంబంధించిన మార్పులను కూడా అరికడతాడు.ఈ ప్రకారంగా యోగి తన శరీరంలో అరుగుదల,పెరుగుదలలను నిలిపివేసి, ప్రాణశక్తిని అదుపులో ఉంచుకుంటాడు.మరో రెండు శ్లోకాలలో ఇలా ఉంది (అయిదవ అధ్యాయం,27 ,28 శ్లోకములలో).అర్ధం మాత్రం వివరిస్తాను.


కనుబొమల మధ్య బిందువు మీద చూపు నిలపడం వల్లా,ముక్కుల్లోను ఊపిరితిత్తుల్లోనూ (ఆడే) ప్రాణ,అపాన వాయువుల సమ ప్రవాహాలని తటస్థీకరించటం వల్లా సర్వోన్నత లక్ష్యాన్ని సాధించబూనిన ధ్యానయోగి,బాహ్య విషయాలనుంచి వెనక్కి తగ్గగలుగుతాడు. 




మనస్సునూ, బుద్దినీ అదుపు చెయ్యగలుగుతాడు. కోరికనూ,భయాన్నీ,కోపాన్నీ పారదోలగలుగుతాడు. శాశ్వతంగా విముక్తుడౌతాడు. నాశరహితమైన ఈ యోగాన్ని,వెనకటి ఒక అవతారంలో,ప్రాచీన జ్ఞాని అయిన వివస్వతుడికి తనే ఉపదేశించానని కూడా శ్రీ కృష్ణుడు చెబుతాడు. ఆ వివస్వతుడు


మహాధర్మ శాసకుడైన మనువుకు ఉపదేశించాడని కూడా శ్రీ కృష్ణుడు చెబుతాడు.యోగవిద్యకు ప్రధమ శాస్త్రకారుడని చెప్పబడే పతంజలి మహర్షి ,క్రియా యోగాన్ని రెండు సార్లు పేర్కొంటూ,ఇలా చెబుతాడు–శరీర వ్యాయామం,మనోనిగ్రహం,ఓంకారం మీద ధ్యానం కలిస్తే క్రియాయోగం అవుతుంది. రెండవ సారి పతంజలి ఇలా చెబుతాడు–శ్వాస,నిశ్వాసాల గతిని విచ్ఛేదించటం ద్వారా జరిగే ప్రాణాయామం వల్ల ముక్తిని సాధించవచ్చు.




“క్రియాయోగం, మానవ పరిణామాన్ని త్వరితం చెయ్యటానికి ఉపకరించే సాధనం” అని అన్నారు శ్రీ యుక్తేస్వర్ గిరిగారు.తన శరీరం మీదా,మనస్సు మీదా తానే ఆధిపత్యం వహించిన వాడై,క్రియాయోగి చివరకు,”చివరి శత్రువు” అయిన మృత్యువును జయిస్తాడు.




క్రియా యోగంలోని మొదటి దీక్షలో ముఖ్యమైన అంశాలు. తాలవ్యక్రియ,ఖేచరీముద్ర, చక్రజపం, క్రియాకుండలినీ ప్రాణాయామం, నాభిక్రియ మరియు శంముఖీ ముద్ర. వీనికి సోహం జపం మరియు అజ్ఞాచక్రధారణ అనేవి సహాయ కారులు. మహాముద్ర మరియు శాంభవీముద్ర అనేవి ముఖ్యమైన అంగములు.       




 ఈ క్రియలను చక్కగా అభ్యాసం చేయడం వల్ల మనిషి ముఖంలో తేజస్సు పెరుగుతుంది. కళ్ళలో కాంతి కలుగుతుంది. స్వభావంలో నిర్మలత్వం కలుగుతుంది. సాధనా క్రమంలో ఓంకార నాదం వినవచ్చు. అయిదు అంచులు గల నక్షత్రాన్ని దాని మధ్యలో తెల్లని చుక్కను భ్రూమద్యంలో చూడవచ్చు. 




ఆ చుక్క ద్వారా ఆవలికి ప్రయాణిస్తే అతీత లోకాల లోనికి ప్రయాణం చెయ్యవచ్చు. మహనీయుల దర్శనాలు, పూర్వ జన్మజ్ఞానం, దూరశ్రవణం, దూరదర్శనం వంటి సిద్ధులు దారిలో వాటంతట అవే కలుగుతాయి.ఈ క్రియాయోగాన్ని శ్రద్ధగా ఆచరించిన కొందరు తమ రక్తపు గ్రూపు కూడా మార్చుకున్నారట.(అంటే,B+ వారు, B- కు మార్చుకున్నారు).ఈ క్రియా యోగాన్ని విశేషంగా ప్రచారం చేసిన శ్రీ పరమహంస యోగానంద ,మరణించే చివరి నిముషంలో కూడా చిరునవ్వుతోనే మరణించాడు.ఓ మనిషి మరణించబోయే ముందు నవ్వుతాడా? నవ్వితే అతని ఆఖరి చిరునవ్వు ఎలా ఉంటుంది? మార్చి 7, 1952న లాస్ ఏంజిల్స్‌లో పరమహంస యోగానంద మరణించే ముందర ఆనాటి భారత రాయబారి హెచ్.ఇ.వినయ్ ఆర్ సేన్ గౌరవార్థం జరిగిన విందుకి 59 ఏళ్ల యోగానంద హాజరయ్యారు. తన ప్రసంగాన్ని ముగించి కుర్చీలో కూర్చున్న కొద్దిసేపటికి ఆయన ఆ కుర్చీలోనే మహాసమాధి పొందారు. ఎలాంటి ఇబ్బందీ లేకుండా సునాయాసంగా చిటికెలో దేహత్యాగం చేసిన ఆయన్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు.     




  అంతేకాదు. ఆయన మరణించిన తర్వాత 20 రోజుల పాటు యోగానంద దేహాన్ని ఫారెస్ట్ లాన్ మెమోరియల్ పార్కులో ఉంచితే అది వాసన రాలేదు. కుళ్లలేదు. మరణించిన వారి శరీరాల్లో కలిగే ఎలాంటి మార్పులు కలగలేదని, బాడీ టిష్యూలు ఎండిపోలేదని, చర్మంలో కూడా ఎలాంటి మార్పు లేదని నాటి లాస్ ఏంజిల్స్ మార్చురీ డెరైక్టర్ హేరీ.టి.రోవె గ్రహించి, మార్చి 27న ఆ సంగతిని లోకానికి తెలియజేశారు. మరణించడానికి మునుపు ఆయన ఎంత తాజాగా ఉన్నారో మరణించిన ఇరవయ్యవ రోజు కూడా అంతే తాజాగా ఉన్నారని రికార్డ్ చేశారు.




పరమహంస యోగానంద గారు,పాశ్చాత్య ప్రపంచంలో దీర్ఘ కాలం(౩౦ ఏళ్ళకు పైగా)నివసించిన భారతీయ మహా గురువులలో ప్రప్రధములు.వీరు వ్రాసిన’ఒక యోగి ఆత్మకథ’పదునెనిమిది భాషల్లోకి అనువదించబడినది.




వీరిని గురించి,’నడిచే దైవం’అయిన శ్రీ కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారు ఇలా అన్నారు”నేను పరమహంస యోగానంద గారిని 1935 లో కలకత్తాలో కలుసుకున్నాను.అప్పటినుండి అమెరికాలో వారు నిర్వహిస్తున్న కార్యకలాపాల గురించి తెలుసుకుంటూనే ఉన్నాను.ఈ లోకంలో యోగానంద గారి ఉనికి ,చిమ్మ చీకట్లలో ఉజ్వలంగా వెలిగే జ్యోతి లాంటిది.అలాంటి మహాత్ములు భూమి మీద చాలా అరుదుగా అవతరిస్తారు;మనుషులకు అవసరం నిజంగా ఉన్నప్పుడు.”




ఈ బంధాలన్ని తెంచుకొని సర్వసంగ పరిత్యాగం చేసి సన్యాసినైన నాకు,”ఈశ్వరా! ఈ సన్యాసికి పెద్ద సంసార మిచ్చావు కదయ్యా!”ఈ వాక్యమే ‘ఒకయోగి ఆత్మకథ ‘లోని చివరి వాక్యం.            




యోగం అనేది మన శరీరం ద్వారానే,మన సాధన వల్లనే మోక్ష స్థితికి చేర్చే అత్యుత్తమ సాధనం.ఈయోగసాధనలో ,సాధకుడు అంతర్ముఖుడై, తన శరీరంలోనే దివ్యశక్తిని సందర్శించి,దేహాన్ని,’తనను’ చైతన్యము చేసుకొనగలడు.




సర్వే జనా సుఖినోభవంతు🙏

కామెంట్‌లు లేవు: