17, అక్టోబర్ 2020, శనివారం

మనశ్శాంతి

 *మనశ్శాంతి*


మామిడి తోపులో స్వామీజీ ప్రవచనాలు చెబుతున్నాడని తెలిసి సాంబయ్య వెళ్ళాడు. "మనిషి ఆశకు అంతంలేదు . ఎంత సంపాదించినా ఇంకా ఇంకా కావాలని,మనశ్శాంతి ని పోగొట్టుకుంటున్నాడు.అవసరమైన వరకు సంపాదించి ఉన్నదానితో తృప్తి పడితే మనశ్శాంతి వుంటుంది" అన్నాడు.

ఆమాటలను ఆచరణలో పెట్టాడు సాంబయ్య.

ప్రక్కింటి కల్లయ్యకు బోలెడన్ని కష్టాలున్నాయి. ఇంతకాలం మనమే కాదు సాంబయ్య కూడా కష్టాలలోనే వున్నాడని సంబరంతో వుండేవాడు.


ఇప్పుడు ఆయన ప్రశాంతత చూచి కడుపు మండిపోతుంది. ఎలాగైనా మనదారిలోకి తెచ్చుకోవాలని,ఒకరోజు వచ్చి"సాంబయ్యా! నువు ఎంత పిచ్చివాడవయ్యా! నీ ఆస్తెంత నీ ఆదాయ మెంత?ఇంతవరకు చాలని గిరిగీసుకుని కూర్చున్నావే కోట్లున్నవారుకూడా పుట్టెడు జబ్బులున్నా బిస్కెట్లు తిని రేయీపగలూ పనిచేస్తున్నారే వారు అమాయకులనుకున్నావా? సరైన జబ్బువస్తే నీ ఆస్తి ఒకముక్కులోకి చాలుతుందా? కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే అనేపాట మరిచావా? నీ ఇష్టమబ్బా చెప్పాను"

అని వెళ్ళి పోయాడు.


ఆయనచెప్పింది కూడా నిజమనిపించింది.మళ్ళీ మాయలో పడ్డాడు. రేయింబవళ్ళు కష్టం చేసి అనారోగ్యం పాలైనాడు సాంబయ్య.

కళ్ళు చల్లబడ్డాయి కల్లయ్యకు.


మళ్ళీ స్వామీజీ చెంతకు వెళ్ళి జరిగింది చెప్పాడు.

స్వామి ముసిముసిగా నవ్వుతూ"నువు సుఖంగా వుంటే ఇరుగు పొరుగువారు అంత సులభంగా ఒప్పుకుంటారనుకుంటున్నావా? నిన్ను చెడగొట్టే ప్రయత్నాలు అనేకం చేస్తారు. నిజంగా అంతజబ్బే వస్తే ఎంత డబ్బైనా బ్రతికించ గలదా?

 ఇప్పుడు పోయేవారంతా డబ్బులేకనా? చెప్పుడు మాటలు విని అమృత తుల్యమైన మనశ్శాంతి ని పోగొట్టుకో వద్దు"అన్నాడు.

సాంబయ్యకు జ్ఞానోదయం అయింది.

మంచి పనికి ఒకరి సలహా అవసరం లేదని పాత పద్దతులనే అవలంబించసాగాడు.


కల్లయ్యకు కడుపు మండిపోతున్నది. ఈ దపా మరో రాయి వేద్దామని పొడిదగ్గులు దగ్గుతూ పొద్దుగూకా వచ్చాడు. బైట చెప్పు చీపుర కట్ట వుంది. అరే!ఎన్నడూ లేనిది ఈరోజు ఎందుకున్నాయి ఏదో ప్రమాద ఘంటికలు మ్రోగుతున్నాయని తలచి మెల్లిగా పిల్లిలా ఇల్లు చేరుకున్నాడు కల్లయ్య.

✍🏻జంజం కోదండ రామయ్య

*తెలుగు వెలుగు సమూహంలో చేరాలనుకుంటే క్రింద నంబర్ కు నన్ను చేర్చమని సందేశాన్ని పంపండి మీకు లింక్ పంపడం జరుగుతుంది. 9985831828*

కామెంట్‌లు లేవు: