17, అక్టోబర్ 2020, శనివారం

నవదుర్గా స్తోత్రము"

 *ఓం శ్రీమాత్రే నమః!*

*"నవదుర్గా స్తోత్రము"*

*ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ*|

*తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్*||

*పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ*|

*సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్*||

*నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః* |

*ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా*||

*1. శైలపుత్రి*

*వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృత శేఖరాం*

*వృషారూఢం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్*

"వృషభాన్ని అధిరోహించి, కిరీటంలో చంద్రవంకను ధరించి, యశశ్శు కలిగి, భక్తుల మనః వాంఛలను తీర్చే మాతా శైలపుత్రీ దుర్గా దేవికి వందనం/నమస్కారం అర్పిస్తున్నాను.

శైలపుత్రి దుర్గా అమ్మవారి నవదుర్గల అవతారాల్లో మొదటి అవతారం. నవరాత్రుల మొదటి రోజు అయిన ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. శైలం అంటే కొండ. పర్వతమైన హిమవంతునికి జన్మించిన అమ్మవారు కాబట్టీ ఈమెకు శైలపుత్రి అని పేరు వచ్చింది. సతీ, భవానీ, పార్వతి, హేమవతి అనే పేర్లు కూడా ఉన్నాయి ఈ అమ్మవారికి. శివుని భార్య, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుల తల్లి అయిన పార్వతీ దేవియే శైలపుత్రి. ఈ అమ్మవారి తలపై చంద్రవంక ఉంటుంది. కుడిచేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ఉన్న ఈ అమ్మవారి వాహనం వృషభం. మహిషాసురుని సంహరించేందుకు యుద్ధంలో మొదటిరోజు పరాశక్తి ఇలా పార్వతీదేవిగా వచ్చింది. కాబట్టే నవరాత్రుల మొదటిరోజు శైలపుత్రీ దుర్గాదేవిని ఆరాధిస్తారు.

నవదుర్గల్లో మొదటి అవతారమైన శైలపుత్రీ దుర్గా పర్వతరాజు హిమవంతుని కుమార్తె. తపస్సు ఆచరించిన ఆమె శివుణ్ణి భర్తగా పొందింది.

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తులను కలిగినది ఈ శైలపుత్రీ దుర్గా దేవి. పూర్వపు జన్మలో ఈమె దక్ష ప్రజాపతి కుమార్తె సతిదేవి. తండ్రికి  ఇష్టం  లేకపోయినా నిత్య  శివకుటుంబిణి అయిన అమ్మవారు శివుణ్ణి  వివాహం చేసుకుంటుంది. ఆ కోపం మనసులో ఉన్న దక్షుడు పెద్ద  యజ్ఞం తలపెట్టి, శివుణ్ణి, సతీదేవిని ఆహ్వానించడు. పుట్టింటిపై  ప్రేమతో పిలవకపోయినా అక్కడికి వెళ్ళిన సతీదేవిని అవమానిస్తాడు దక్షుడు. నిరీశ్వర యజ్ఞం ఎప్పటికైన నాశనమవ్వక తప్పదనే హెచ్చరికను లోకానికిస్తూ, అవమానభారంతో కాలిగోటితో అగ్నిని సృజించి, అందులో దూకి తనువు చాలిస్తుంది సతీదేవి. తనను దాక్షాయణి పేరుతో కీర్తించవద్దని, అలా పిలిచినపుడు వెంటనే దక్షయజ్ఞ వినాశిని అని పిలవాలని శాసించి అంతర్ధానమవుతుంది. ఆ తరువాత తిరిగి శివుడిని వివాహం చేసుకునేందుకు, మేనకా, హిమవంతులకిచ్చిన మాట ప్రకారం వారికి కుమార్తెగా పార్వతిగా జన్మించింది అమ్మవారు.

శివమహాపురాణం, దేవి భాగవతం వంటి ఇతరన పురాణాల్లోనూ సతీ, పార్వతీ దేవిల కథలు మనం చూడవచ్చు.

రుతుచక్రానికి అధిష్టాన దేవత శైలపుత్రీదేవి. నందిపై కూర్చుని ములాధారా చక్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది ఈ అమ్మవారు. లౌకికంగా తండ్రి(హిమవంతుడు) నుంచి భర్త(శివుడు)ను వెతుక్కుంటూ ప్రయాణించింది శైలపుత్రిదేవి. మూలాధార చక్రాన్ని జాగృతం చేస్తుంది ఈ అమ్మవారి ఉపాసన. అందుకే నవరాత్రి పూజలు చేసేవారు, యోగులు ఈ అమ్మవారిని ఉపాసించి మూలాధార చక్రంపై దృష్టి కేంద్రీకరించి, ధ్యానిస్తారు. ఇలా మూలాధార చక్రాన్ని ధ్యానం చేయడం ఆధ్యాత్మిక మార్గంలో తొలి మెట్టుగా చెప్తుంటారు. ఇదే యోగసాధనకు ప్రధమమైనది. శైలపుత్రిదేవి మూలాధారా శక్తికి అధిష్టాన దేవత. ఎన్ని జన్మలకైన శివకుటుంబిణి కాబట్టీ తన భర్త అయిన శివుణ్ణి వెతికి, ధ్యానించి, సొంతం చేసుకున్న ఈ అమ్మవారిని ఉపాసించడం ద్వారా  తనలో ఉన్న దైవాన్ని దర్శించవచ్చు అని చెప్తుంటారు.

యోగ పరంగా నవరాత్రులలోని మొదటి రాత్రి చాలా పవిత్రమైనది, కీలకమైనది. ఈ రాత్రి శైలపుత్రి దుర్గా దేవిని ధ్యానిస్తే ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవిని చేరుకునేందుకు సులభంగా ఉంటంది అని అంటారు. ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి రోజున ఈ అమ్మవారిని ధ్యానించడం ద్వారా మనం చేసే ఉపాసన సిద్ధిస్తుంది అని నమ్ముతారు.

యోగ మార్గంలో ఉన్నవారు ఇంకా ఇంకా ఉన్నత ఆధ్యాత్మికానుభూతుల్ని అందుకోవాలని కోరుకుంటారు. అలాంటప్పుడు మూలాధారా చక్రానికి అధిష్టాన దేవతైన శైలపుత్రి దేవిని ఉపాసిస్తే స్వస్వరూప జ్ఞానం పొంది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాలకు చేరవచ్చు. మొదటి దినమున యోగులు ఉపాసన ద్వారా తమ మనస్సులను మూలాధార చక్రము నందు స్థిర పరచు కొనెదరు. దీని తోడనే వారి యోగ సాధనాలు ఆరంభమగును. శైలపుత్రి దుర్గా దేవి అచ్చంగా పార్వతీదేవి. శివమహాపురాణం ప్రకారం ఈ భూమి అంతా శైలపుత్రి దేవిలో నిబిడీకృతమై ఉంది. ఈ సృష్టిలోని ప్రకృతి అంతా ఆమె శరీరంలోనే ఉంది.

శైలపుత్రీదేవిది పృధ్వీ తత్త్వం, సందర్భశుద్ధి అయిన గుణం, గ్రాహణ, భేద శక్తులతో ప్రకాశిస్తుంది.

శైలపుత్రీ దేవి మంత్రం, *ల,మ*. నాలుక, పెదాలపై  దృష్టి ఉంచి ఈ రెండు  పదాలను పలుకుతారు.

💐💐🙏🙏 *శ్రీమాత్రేనమః*🙏🙏💐

కామెంట్‌లు లేవు: