17, అక్టోబర్ 2020, శనివారం

 

         పురుషోత్తమప్రాప్తియోగము


       


-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,


శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.




అవతారిక - భూమియందు ప్రవేశించి సస్యాదుల నభివృద్ధిపఱచునది తానే యని భగవానుడు పలుకుచున్నారు -




గామావిశ్య చ భూతాని ధారయామ్యహ మోజసా | 


పుష్ణామి చౌషధీస్సర్వాః


సోమో భూత్వా రసాత్మకః || 




తాత్పర్యము:- మఱియు నేను భూమిని ప్రవేశించి శక్తిచేత సమస్త ప్రాణికోట్లను ధరించుచున్నాను (నిలుపుచున్నాను). రసస్వరూపుడగు చంద్రుడనై సస్యము లన్నింటిని పోషించుచున్నాను. 




వ్యాఖ్య:- 'ధారయామి ఓజసా’ - అని చెప్పుటవలన జగత్తునందలి సమస్త పదార్థములకును, ప్రాణికోట్లకును శక్తిని, సామర్థ్యమును, బలమును ఒసంగునది ఆ పరాత్పరుడే యని తెలియుచున్నది. పైవాక్యమువలన శ్రీకృష్ణమూర్తి వసుదేవునకు జన్మించిన ఒకానొక చిన్నఉపాధి మాత్రమే కాదనియు, విశ్వవ్యాపి, జగద్భర్తకూడ యనియు స్పష్టమగుచున్నది. మఱియు సస్యములను అభివృద్ధిపఱచునది తానేయని చెప్పుటచే జీవులు భుజించు ఆహారము సాక్షాత్ పరమాత్మవలననే సంభవించుచున్నదని తెలియుచున్నది. కావున, ఆహారమును భుజించునపుడు ఈ అన్నమెవరివలన మనకు వచ్చినది? అని ఆలోచించి అన్నస్రష్ట, అన్నదాత యగు ఆ సర్వేశ్వరునకు సర్వులును కృతజ్ఞత చూపవలసియున్నారు. మనుజుడు తాను ఆహారమును భుజించుటకుముందు అద్దానిని ఆ దేవదేవునకు సమర్పించి తదుపరి దైవభావనతో దానిని భుజించవలెను. సస్యములను భగవానుడు పోషించనిచో జనులకు అన్నము దొఱకదు; సూర్యచంద్రాగ్నులకు ప్రకాశమివ్వనిచో లోకము అంధకారావృతమై యుండును. కాబట్టి ఎన్నియో అనుకూలములుచేసి ప్రాణులను భరించుచున్న ఆ జగద్ధాత్రికి మనుజులు సదా కృతజ్ఞులై వర్తించవలెను. సర్వకాలములందును. వారిని స్మరించుచు, కీర్తించుచు నుండవలెను.




ప్రశ్న:- భగవాను డే యేప్రకారములుగ ప్రజలకు మేలొనర్చుచున్నారు?


ఉత్తరము:- (1) భూమియందు ప్రవేశించి బలముచే సమస్తప్రాణులను భరించుచున్నారు. (2) చంద్రుడయి సస్యములన్నిటిని పోషించుచున్నారు.


ప్రశ్న2:- కావున జీవు లేమి చేయవలెను?


ఉత్తరము: - అతనికి కృతజ్ఞులై వర్తించుచు, సంకీర్తన, జప, పూజాదులచే నిరంతర మాతనిని స్మరించుచుండవలెను.

కామెంట్‌లు లేవు: