1, సెప్టెంబర్ 2020, మంగళవారం

బ్రాహ్మణత్వము

బ్రాహ్మణత్వము గురించి భీష్ముణ్ణి...ధర్మరాజు ఇలా అడిగాడు...!💐శ్రీ💐

పితామహా ! బ్రాహ్మణులు కాక ఇతరులు తాము చేసే గుణకర్మల వలన బ్రాహ్మణత్వము పొందవచ్చునా ! అని తన సందేహం వెలిబుచ్చాడు.

భీష్ముడు ధర్మనందనా ! బ్రాహ్మణత్వము పొందడం చాలా దుర్లభం.ఎన్నోజన్మలు ఎత్తిన తరువాత కాని బ్రాహ్మణజన్మ లభించదు.

ఈ విషయము గురించి నీకు ఒక ఇతిహాసము చెప్తాను విను. పూర్వము మతంగుడు అనే విప్రకుమారుడు ఉండే వాడు. అతడు తండ్రి ఆదేశానుసారము ఒక యజ్ఞానికి వెడుతున్నాడు.

దారిలో అతడు ఒక గాడిదపిల్లను కర్రతో గట్టిగా కొట్టాడు. ఆ గాడిద పిల్ల ఏడుస్తూ తనతల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పింది. ఆ గాడిద తన కూతురుతో అమ్మా ! ఇతడు చంఢాలుడు, క్రూరుడు అందుకే నిన్ను అలా కొట్టాడు అని చెప్పింది.

గాడిద మాటలను అర్ధము చేసుకున్న విప్రకుమారుడు ఆ గాడిద ఊరికే అలా అన లేదు. గాడిద మాటలలో ఏదో అంతరార్ధము ఉంది. లేకుంటే అలా ఎందుకు అంటుంది? అనుకున్నాడు. విప్రకుమారుడు ఆ గాడిద వద్దకు వెళ్ళి తన జన్మరహస్యము చెప్పమని అడిగాడు.

గాడిద విప్రకుమారా ! నీ తల్లి కామంతో ఒక క్షురకుని వలన నిన్ను కన్నది. కనుక నీవు బ్రాహ్మణుడివి కాదు అని చెప్పింది. ఆపై అతడికి యజ్ఞముకు వెళ్ళడానికి మనస్కరించక ఇంటికి తిరిగి వెళ్ళి తండ్రితో తండ్రీ ! నేను బ్రాహ్మణ స్త్రీకి క్షురకుడికి పుట్టాను కనుక నేను బ్రాహ్మణుడను కాను.

ఆ గార్ధభము ఏదో శాపవశాన ఇలా జన్మ ఎత్తి ఉంటుంది. లేకున్న ఈ నా జన్మరహస్యము ఎలా తెలుస్తుంది?. తండ్రీ ! నేను తపస్సు చేసి బ్రాహ్మణత్వము సంపాదిస్తాను అని చెప్పి మతంగుడు తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళాడు.

మతంగుడు కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఇంద్రుడిని ప్రసన్నము చేసుకున్నాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై కుమారా ! నీవు తపస్సు ఎందుకు చేస్తున్నావు ? నీ కోరిక ఏమిటి అని అడిగాడు. మతంగుడు దేవా ! నాకు బ్రాహ్మణత్వము ప్రసాదించండి అని అడిగాడు.

ఇంద్రుడు కుమారా ! బ్రాహ్మణత్వము మహత్తరమైనది. ఇతరులకు అది లభ్యము కాదు కనుక మరేదైనా వరము కోరుకో అని అన్నాడు. మతంగుడు అయ్యా ! నా కోరిక తీర్చడం మీకు కుదరదు కనుక మీరు వెళ్ళండి. నా తపస్సు కొనసాగిస్తాను అన్నాడు.

ఇంద్రుడు వెళ్ళగానే మతంగుడు తన తపస్సు కొనసాగించి ఒంటి కాలి మీద మరొక నూరేళ్ళు తపస్సు చేసి ఇంద్రుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు.

ఇంద్రుడు కుమారా ! నీ పట్టు విడువక ఉన్నావు! శూద్రుడు ఇలాంటి తపస్సు చేస్తే చస్తాడు జాగ్రత్త అని బెదిరించి అసలు బ్రాహ్మణత్వము ఎలా సిద్ధిస్తుందో నీకు తెలుసా !

ఇంతకంటేపది రెట్లు తపస్సు చేస్తే కాని ఒక చంఢాలుడు శూద్రుడు కాలేడు.
దాని కంటే నూరు రెట్లు తపస్సు చేస్తే కాని శూద్రుడు వైశ్యుడు కాలేడు.
దాని కంటే వేయిరెట్లు తపస్సు చేసిన కాని వైశ్యుడు క్షత్రియుడు కాలేడు.
దాని కంటే పది వేల రెట్లు తపస్సు చేసిన కాని క్షత్రియుడు దుర్మార్గుడైన బ్రాహ్మణుడు కాలేడు.
దానికంటే లక్షరెట్లు తపస్సు చేస్తే కాని దుర్మార్గుడైన బ్రాహ్మణుడు ఇంద్రియములను, మనస్సును జయించి, సత్యము అహింసలను పాటించి, మాత్సర్యము విడిచి పెట్టి సద్బ్రాహ్మణుడు కాలేడు.

అటువంటి సద్బ్రాహ్మణత్వము ఒక వంద సంవత్సరాల తపస్సుకు వస్తుందా ! చెప్పు అన్నాడు. ఒక వేళ బ్రాహ్మణ జన్మ పొందినా దానిని నిలబెట్టుకొనుట కష్టము.

 ఒక్కొక్క జీవుడు అనేక జన్మల తర్వాత కాని బ్రాహ్మణజన్మ ఎత్తలేడు. అలా ఎత్తినా అతడు దానిని నిలబెట్టుకోలేడు. ధనవాంఛ, కామవాంఛ, విషయాసక్తితో సదాచారములను వదిలి దుర్మార్గుడు ఔతాడు.

తిరిగి బ్రాహ్మణజన్మ రావడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది. అటువంటి బ్రాహ్మణజన్మ కొరకు నీవు తాపత్రయపడి నీ వినాశనము ఎందుకు కొని తెచ్చుకుంటావు. నీ కిష్టమైన మరొక వరము కోరుకో ఇస్తాను తపస్సు చాలించు అన్నాడు.

మారుమాటాడని మాతంగుడి మొండి తనము చూసి విసుగు చెంది ఇంద్రుడు వెళ్ళి పోయాడు. మాతంగుడు తిరిగి తన తపస్సు కొనసాగించాడు. కాలి బొటనవేలి మీద నిలబడి శరీరం అస్థిపంజరము అయ్యేవరకు తపస్సు చేసాడు.

అతడి శరీరము శిధిలమై పడిపోతుండగా ఇంద్రుడు పట్టుకున్నాడు. ఏమిటి నాయనా ఇది? పెద్ద పులిలా నిన్ను మింగగలిగిన బ్రాహ్మణత్వము నీకెందుకు? చక్కగా వేరు వరములు అడిగి సుఖపడు అన్నాడు.

మాతంగుడు అంగీకరించగానే ఇంద్రుడు నీవు చంఢదేవుడు అనే పేరుతో అందమైన స్త్రీల. పూజలందుకుని వారి వలన నీ కోరికలు ఈడేర్చుకుంటావు అని వరాలు ప్రసాదించాడు.
కానీ బ్రాహ్మణ జన్మను ప్రసాదించలేదు.
(భారతంలోని అనుశాసనిక పర్వంలోని కథ).

అటువంటి ఉత్కృష్టమైన, పరమ పవిత్రమైన బ్రాహ్మణ జన్మను కాపాడుకోవలసిన అవసరం మన బ్రాహ్మణులదే.
జై బ్రాహ్మణ్...జై జై బ్రాహ్మణ్..స్వస్తి..!!

లోకా సమస్తా సుఖినో భవంతు..!!💐
                         💐శ్రీ మాత్రే నమః💐

కామెంట్‌లు లేవు: