12, అక్టోబర్ 2020, సోమవారం

ధార్మికగీత - 47*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                             *ధార్మికగీత - 47*

                              *****

      *శ్లో:- న చోర హార్యం, న చ రాజ హార్యం ౹*

             *న భ్రాతృ భాజ్యం, న చ భార కారీ ౹*

             *వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం ౹*

             *విద్యా ధనం సర్వ ధన ప్రధానం ౹౹*

                                     *****

*భా:- విద్య అందరికి ఆభరణము. విద్య కురూపుని కూడ సురూపునిగా చేయగల సమర్ధత కలది. జీవితాంతం మనకు చెక్కు చెదరని ధనం విద్యా ధనం ఒక్కటే. అట్టి విద్యాధనం దొంగలు దోచుకొనేది కాదు. ప్రభుత్వం పన్ను రూపేణ కట్టించుకొనేది కాదు. స్థిరచరా స్తుల వలె అన్నదమ్ములచే పంచుకొనబడేది కాదు. సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసే టప్పుడు లగేజీ వలె బరువుగా తోచేది కాదు. ఖర్చు చేసే కొద్దీ అంతకు అంతగా పెరిగే అమూల్య ధనం విద్యా ధనం. ఎంతమందికి పంచితే, అంతగా వృద్ది అవుతుంది. పరిణితి చెందుతుంది. " విద్యా సర్వస్య భూషణం" అని నానుడి. మిగతా ధనంలా పంచినా, యే మాత్రం తరిగేది కాదు. పిల్లలకు మనం ఆస్తి పాస్తులను కాదు ఇవ్వవలసింది. విలువలు గల చదువు . అదే వారికి సదా నిధి. సన్నిధి. పెన్నిధి. ఈ విద్య అనే మూలధనంతో మిగిలిన సకల ధనాలను కృషి, పట్టుదల, తెలివి తేటలతో సమకూర్చుకో వచ్చును.అందుకే విద్యా ధనం సర్వధన ప్రధానముగా, త్రికాల పూజ్యమై రాణిస్తోంది."విద్వాన్ సర్వత్ర పూజ్యతే" ; "విద్యకు సాటి ధనంబు లేదిలన్" అని నాటికి, నేటికి నిరూపింప బడుచున్నదని సారాంశము.*

                                  *****

                   *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: