12, అక్టోబర్ 2020, సోమవారం

సౌందర్య లహరి**

 **దశిక రాము**


**సౌందర్య లహరి**


**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి భాష్యం**


తొమ్మిది, పది శ్లోకాల భాష్యం - మొదటి భాగం


*అంబికను కుండలినీ యోగంతోనూ, మంత్రయోగంతోనూ ఆరాధించడాన్నీ, అటువంటి ఆరాధన వలన కలిగే ఫలితాలన్నీ తరువాతి శ్లోకములు వివరిస్తున్నాయి.*


మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం

స్థితం స్వాధిష్ఠానే హృది మరుతమాకాశముపరి .

మనోऽపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం

సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే .. (9)


(అమ్మా! నీవు సుషుమ్నా మార్గములో మూలాధార చక్రమునందు భూతతత్త్వమును, మణిపూరక మందు జలతత్త్వమును, అనాహత మందు వాయుతత్త్వమును, విశుద్ద చక్రమందు ఆకాశతత్త్వమును, ఆజ్ఞా చక్రమునందు మనోతత్త్వమును చేధించుకొని సహస్రార చక్రమందు నీ భర్తతో ఏకాంతముగా విహరిస్తున్నావు)


సుధాధారాసారై శ్చరణయుగలాంతర్విగలితైః

ప్రపంచం సించంతీ పునరపి రసామ్నాయమహసః .

అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్టవలయం

స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుణ్డే కుహరిణి. (10)


(తల్లీ! నీపాదద్వయము నుండి జాలువారిన అమృతధారలచే లోకమును తడుపుదువు. అమృత రూపమగు చంద్రుని వలన నీ స్వస్థానము చేరుటకు పాము వలె నన్ను నీ నిజరూపమును పొంది సూక్ష్మరంధ్రము గల సుషుమ్నా ద్వారమున వున్న మూలాధారమందు సర్వదా నిద్రించెదవు.)


మానవుని దేహంలో పద్మములని పిలవబడే చక్రములు ఆరింటిని గురించి కుండలినీ యోగము చెబుతుంది. అంబిక మొదట అయిదు చక్రాలలో పృథివ్యాపస్తేజో వాయురాకాశాదులు గాను, ఆరవచక్రములో మనస్సుగానూ వసించుతోందని ఆచార్యులవారు వివరిస్తారు. ఈ పద్మాలను కలుపుతూ వాటి నడుమ సుషుమ్నా నాడి ఉంటుంది. ఆ నాడి చివర వెయ్యి రేకులున్న పద్మంగా ప్రకాశించే సహస్రార చక్రమున్నది. ఆ పద్మంలోనే అంబిక తన పతి అయిన సదాశివునితో ఐక్యమవుతుంది. ఎప్పుడైతే జీవాత్మ కుండలినీ శక్తి ద్వారా సహస్రార పద్మమునకు తీసుకొని రాబడుతుందో, అప్పుడు అంబిక అద్వైతానందాన్ని ప్రసాదిస్తుంది. స్థూల ప్రపంచ నిర్మాణమే సూక్ష్మ ప్రపంచంలో కూడా కాన వస్తుంది. అంబిక తనను ప్రపంచంగా విస్తరించుకొనినపుడు మహాభూతములుగా, మహత్తు అని పిలవబడే లోకాలను శాసించే మహామనస్సుగా ఎలా వెలుగొందుతుందో, సాధకుడు ఆయా కుండలినీ చక్రాదులతో దర్శించవచ్చు. ఆయా అనుభూతులను పొందవచ్చు. ఆ మహామనస్సు సహస్రార పద్మములో పరబ్రహ్మయైన పరమశివునితో ఐక్యం చెందినపుడు అద్వైతానుభూతీ పొందగలుగుతాడు.


అటువంటి అద్వైత రసానుభూతి అమృత రసానుభూతి అవడం తరువాతి శ్లోకంలో చెప్పబడింది. పొందబడే అద్వైత రసము, పొందే జీవుడు, అనుగ్రహించే అంబిక – ఈ మూడింటి మధ్య భేదం లేదు. ఏదో మాటవరసకు దీనిని రసానుభవం అంటారు. కానీ నిజానికి ఈ స్థితి మాటలకందనిది. అనుభూతికి ముందు, తరువాత పొందేది, పొందబడేది, పొందించేది అన్న త్రిపుట ఉంటుంది. అనుభూతి కాలంలో నష్టమైపోతుంది. 


నేను చెప్పిన పద్మములు చెరువులలో పెరిగే పద్మముల వంటివి కాదు. చెరువులోని ఆ పద్మములు సూర్యరశ్మికి వికసిస్తాయి. చంద్రకాంతికి ముకుళించుకొని పోతాయి. నిప్పు సెగకు వాడిపోతాయి. నే చెప్పిన కుండలినీ పద్మములు అగ్నికాండము, సూర్యకాండము, చంద్రకాండము ఈ మూడిటికీ వికసిస్తాయి. తుదకు శిరస్సున పూర్ణచంద్రుడు సహస్రార పద్మాన్ని వికసింప చేస్తాడు. ఆ చంద్రకాంతితో అమృతం ప్రవహిస్తుంది.


అది అంబికానుగ్రహమును స్రవించిన రసం శిరస్సుపై నాడులను తడిపివేస్తుంది. నిజానికి అమృతం స్రవించినది పూర్ణచంద్రుని నుండి కాదు. జాగ్రత్తగా చూసామా ఆ పూర్ణచంద్రునిపై అమ్మ పాదాలు మన గురుపాదాలుగా దర్శనమిస్తాయి. ఆ పాదముల నుండే అమృతం ప్రవహించేది. జీవాత్మ ఆ అమృతాన్ని ఆస్వాదిస్తోంది. అంబిక చేత ప్రసాదించబడిన ఆ అమృతాన్ని ఆస్వాదించే జీవాత్మకు అద్వైత జ్ఞానముంటుంది. అటువటి స్థితి ఒక కుండలినీ యోగం ద్వారానే సిద్ధిస్తుందా ? నేను మరొక్కసారి చెప్పదలిచాను. *మీరెంచుకొన్న ఏ మార్గంలోనైనా నమ్మకంతో త్రికరణసుద్ధిగా సాధన చేయండి, మీకు తెలియకుండానే ఈ యోగఫలం మీకు సిద్ధిస్తుంది.*


(సశేషం)


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam


🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: