5, అక్టోబర్ 2020, సోమవారం

*సప్త మహర్షులు - సప్త ఋషి మండలము*


🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైత చైతన్య జాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*సప్త ఋషులు అనబడేవారు ఒక గణం. ఆ గణంలో ఏడుగురు ఋషులుంటారు. ప్రతి మన్వంతరంలో ఒక గణం ఉంటుంది. మహాప్రళయానికి ముందయితే 14 మన్వంతరాలుంటాయి కనుక 98 మండి సప్తర్షులు ఉంటారు! బ్రహ్మ మానస పుత్రులయిన ఇప్పటి వైవస్వత మన్వంతరంలోని సప్తర్షులు వరుసగా - మరీచి, అంగీరస, అత్రి, పులస్త్య, వశిష్ట, పులహ, క్రతువులు.*



*మనది కర్మభూమి అయిన ఋషిభూమి. ఈ జగత్తును పాలించేది రాజులయిన, వారిని తమ సలహాలతో, శిక్షణలతో ముందుకు నడిపించేది వారివారి గురువులయిన ఋషులే! అంతేకాదు, మానవాలికికూడా ఋజువర్తన, సత్ప్రవర్తనలకు మార్గం నిర్దేశించిందికూడా మహనీయులయిన ప్రాచీన ఋషులే. అందుకే మానవజాతి వీరికేంతో ఋణపడి ఉంది. మనుష్య జన్మనేట్టిన ప్రతి ఒక్కరూ పితృ ఋణం, మాతృ ఋణం, గురు ఋణం (ఋషిఋణం), దైవ ఋణాలను తప్పక తీర్చుకోవాలని మన శాస్త్రాలు నొక్కి వక్కాణిస్తున్నాయి.*



*సప్తఋషిగణంలోని ఏడుగురు మహర్షులు వరుసగా కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్టుడు, జమదగ్ని - ఇది మరొక క్రమం. తమ అమోఘ తపఃశక్తితో, నియమ నిష్ఠలతో మానవజాతికి సన్మార్గాన్ని నిర్దేశించి, వినువీధిలో "సమ్ప్తఋషి మండలం" గా వేలుగుసోబగులు గుప్పిస్తున్న ఈ మహనీయ, ఋషిపుంగవుల గురించి కొంతయిన తెలుసుకోవడం మన కనీస కర్తవ్యం.*



*1. కశ్యపుడు:-- సూర్యుని మానస పుత్రుడైన మరీచి తనయుడు. దక్షుని కుమార్తెలయిన అదితి, దితి మొదలయిన పన్నెండు మందిని పెళ్లాడి, సృష్టిని వృద్ధి చేసిన ఇతనికి దేవదానవులు, నరులు, మృగాలు, పశు, పక్షి, వృక్షాదులను కూడా ఇతని సంతతిగానే పేర్కొంటారు. విష్ణువు వామనవతారంలో ఇతనికి పుత్రుడుగా జన్మించాడు. అలాగే, రామకృష్ణావతారాల్లో కూడా కశ్యపుడే దశరథుడుగా, వసుదేవుడుగా జన్మించాడని మన పురాణోక్తి! ధర్మ ప్రబోధం గావించే "కశ్యపధర్మసూత్రాలు", క్షమాగుణాన్ని చాటిచెప్పే "కశ్యపగీత"ను రచించిందీ ఇతనే.*



*2. అత్రి:-- బ్రహ్మ మానస పుత్రుడు, మహాసాధ్వి అయిన అనసూయ భర్త, మరియు ఘోర తపస్సుతో త్రిమూర్తుల అంశలో చంద్ర, దత్తాత్రేయ, దుర్వాసులను కుమారులుగా పొందాడు. దేవదానవ యుద్ధంలో, చంద్రుడు రాహువుచేత కబళించబదాగా, సూర్యుడు పాలిపోవడంతో జగత్తంతా అంధకారమయిన తరుణంలో, అత్రి, సూర్యునికి ధైర్యానిస్తూ, చంద్రుడి, సూర్యుడి శరీరాలు., నక్షత్రాలు గావించి, ప్రకాశాన్ని తిరిగి రప్పించాడు. రామాయణ కాలంలో, తన ఆశ్రమానికి వచ్చిన సీతారామలక్ష్మణులకు ఆతిథ్యమిచ్చి, అతని ధర్మ పత్ని అయిన అనసూయ సీతమ్మకు నూతన వస్తాభరణాలను ఇచ్చి, పతివ్రతాధర్మ సూక్ష్మాలను ఎరుక పరిచింది. అత్రి మహాముని, "అత్రి సంహిత", "అత్రిస్మృతి", అనే రచనలు చేసాడు. అత్రిస్మృతి కాలక్రమంలో "అత్రేయధర్మ శాస్త్రం"గా జగద్విఖ్యాతి నొందింది.*



*3. భరద్వాజుడు:-- దేవగురువైన బృహస్పతి కుమారుడు. అతన్ని మరుత్తులు పెంచి, భరతునికి అప్పగించారు. భరతునిచే స్వీకరించబడిన వాడు కనుక "భరద్వాజుడు"గా పిలువబడ్డాడు. గంగానదీ తీరంలో ఆశ్రమవాసియైన ఈయన, సీతారామలక్ష్మణులకు అరణ్యవాస సమయంలో ఆతిథ్యమిచ్చాడు. అదే విధంగా, రాముణ్ణి వెదుకుతూ వచ్చిన భరతునికీ, అతని పరిజనులకూ గొప్పగా విందు నొసగి, రాముడు చనిన దిక్కును తెలిపాడు. రావణ వధానంతరం తిరుగు ప్రయాణంలో కూడా వారికి ఆతిథ్య మిచ్చాడు. ఈయన వ్రాసిన 'భారద్వాజస్మృతి' అనే శాస్త్రం - వసిష్ఠాది మహర్షుల కోరిక మేరకు - ఏయే కర్మలను, ఎప్పుడెలా ఆచరించాలో వివరిస్తుంది.*



*4. విశ్వామిత్రుడు:-- తండ్రి గాధి అనంతరం రాజయి, వేటకు వెళ్ళినప్పుడు, విశిష్ఠాశ్రమానికి వేలడం, అక్కడ ఉన్న కామధేనువును కోరటం, వశిష్ఠుడు నిరాకరించడం, కదనానికి దిగి భంగపడడం జరిగిన తరువాత, వశిష్ఠుని అమోఘమైన తపఃశక్తిని చూచి, రాజ్యాన్ని త్యజించి, ఘోర తపస్సు చేసి, మహేంద్రుడు పంపిన మేనక యౌవన-సౌందర్యానికి దాసోహమని, శకుంతల జన్మకు కారణమయ్యి, తప్పు తెలుసుకొని, తిరిగి ఘోర తపస్సు గావించి, తీవ్ర క్షామాన్ని అనుభవించి, పడరాని పట్లు పడి, బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి చేసి, సత్యవ్రతుడనే రాజును బొందితో స్వర్గానికి పంపబోయి, సాధ్యం కాక, త్రిశంకు స్వర్గాన్నే స్రుష్టించి, వసిష్ఠునిచేత 'బ్రహ్మర్షి' అని పిలిపించుకునేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి, వెతలు అనుభవించి, కోపాన్ని జయించి, చివరకు ఆయనచే 'బ్రహ్మర్షి' అని అనిపించుకొని తృప్తి చెందాడు. విశ్వామిత్రుడే రామలక్ష్మణులకు ఎన్నో శాస్త్రాలు, మంత్ర విద్యలు ఉపదేశించి, ఎందరో దుష్ట రాక్షసులను సంహారం చేహించాడు. అలాగే మిథిలకు వాళ్ళను తోడ్కొని పోయి సీతారామ కళ్యాణానికి హేతువయ్యాడు. సంధ్యావందన గాయత్రీ మంత్రాన్ని ప్రపంచానికి బహూకరించిన ఇతడు 'విశ్వామిత్ర స్మృతి' అనే గ్రంథాన్ని రచించాడు.*



*5. గౌతముడు:-- ప్రచేతసుని మానస పుత్రుడు. 'తను చల్లే విత్తనాలు వెంటనే మొలచి పంట పండా'లని ప్రార్థిస్తూ, బ్రహ్మను స్మరిస్తూ, గొప్ప తపస్సు చేసాడు. వర్షాభావంతో, క్షామం ఏర్పడినప్పుడు, ప్రజలకు తను స్వయంగా వంది, అన్నదానం చేసి, రక్షించాడు. అసూయాపరులైన కొందరునులు, గౌతముని సంపదను చూసి, ఒక గోవును అతని పొలంలోకి పంపగా, పైరు మేస్తున్న గోవున అదిలించటానికి ఒక దర్భను మంత్రించి వదలగా, గోవు మరణిస్తుంది. మునులు అతనమీద గోహత్య పాతక దోషం వెయ్యగా, గౌతముడు పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి, మెప్పించి, అయన జటాజూటంలో ఉన్న గంగను ఆవుప ప్రోక్షించగా, అది బ్రతకటమే కాకుండా, నీటిబిందువులు పడినచోట ఒక నది పుట్టగా, దానికి "గౌతమీ' అని, గోవును బ్రతికించింది కావున 'గోదావరి' అని పేర్లు వచ్చాయి. గౌతముడు, ధర్మ సూత్రాలు, న్యాయ శాస్త్రం, 'గౌతమ సంహిత' అనే జ్యోతిష శాస్త్ర గ్రంథాన్ని రచించాడు.*



*6. వసిష్ఠుడు:-- పరమ పతివ్రతా శిరోమణి అయిన అరుంధతి భర్త. సూర్యవంశ క్షత్రియులకు గురువై, శ్రీరామలక్ష్మణ భరతశత్రుఘ్నులకు జాతవివాహాది శుభ కర్మలను జరిపించాడు. అశ్రమాని వచ్చిన విశ్వామిత్రునికి అన్నం పెట్టిన పాపానికి, కామధేనువును అపహరించబోగా గుణపాఠం నేర్పాడు. అకారణాలవల్ల అనేక కష్టాలను, కాల పరీక్షలను, ఓర్పుతో, ధైర్యంతో, ఎదుర్కొని, చివరికి ధర్మం, శాంతం, సత్యగుణాలే విజయానికి సోపానాలని జగత్తుకు చాటి చెప్పిన జితేంద్రియుడు, సత్యస్వరూపుడు, ధర్మమూర్తి. హరిశ్చంద్రుని కీర్తి చిరస్థాయిగా నిల్పినవాడు. శ్రీరాముణ్ణి ధర్మపథంలో నడిపినవాడు ఇతడే. ఇతడు ప్రపంచలహిరి, వసిష్ఠధనుర్వేద సంహిత, వసిష్ఠ స్మృతి అనే గ్రంథాలను వ్రాసాడు.*



*7. జమదగ్ని:-- సత్యవతీఋచీకుల పుత్రుడు. రేణుకాదేవిని పెళ్ళాడాడు. గొప్ప తపశ్శాలి అయినా, రేణుక మనస్సులో జరిగిని తడబాటును ఒకరోజు గ్రహించగానే, ఆగ్రహంతో ఆమెను వధించమని పుత్రులను అజ్ఞాపించాడు. అయిదుగురు పుత్రులలో చివరివాడైన పరసురాముడు పరశువుతో తల్లిని వధించి, తిరిగి తండ్రి ఇచ్చిన వర ప్రభావంతో ఆమెను బ్రతికిస్తాడు. అధికార మదంతో, దురహంకారి అయిన రాజు కార్తవీర్యార్జునుడు తన తండ్రిని మరియు సోదరులను చంపినందుకు అతణ్ణి హతమార్చి, ఆ రక్తంతో తర్పణంతో జమదగ్ని పునర్జీవితుడౌతాడు..జమదగ్ని తన అమోఘ తపఃశక్తితో సప్తఋషి మండలంలో స్థానం పదిలపరచుకున్నాడు.*



*ఈ సప్త మహా ఋషుల ప్రస్తావన రామాయణంలో కూడా చూదవచ్చు. ముఖ్యంగా రత్నాకరుడు వాల్మీకిగా మారటానికి కారణభూతులవుతారు. అతనికి ప్రాయశ్చిత్త మార్గాన్ని చూపించి తరింపచేసి, రామనామ జపాన్ని బోధించి, వాల్మీకిగా మారుస్తారు. దివ్య తేజస్సుతో, కొన్నేళ్ళ తపస్సు తరువాత, క్రమ్ముకున్న వాల్మీకం నుండి బయటకు దివ్య తేజస్సుతో, ఋషిగా మారి వచ్చిన వాల్మీకిని సప్త మహర్షులు మనస్ఫూర్తిగా ఆశీర్వదించి పవిత్రమైన, ఆదికావ్యమైన రామాయణ రచనకు అతన్ని నియోగిస్తారు.*



*ఈ సప్త ఋషులు, మన పురాణగాథల్లో, మన దివ్య సంస్కృతికి గుర్తులుగా నింగిలో నక్షత్ర రూపులై శాశ్వత మహోన్నతులుగా ప్రఖ్యాతి గడించి, నిలిచిపోయారు.*


🕉🌞🌏🌙🌟🚩

కామెంట్‌లు లేవు: