19, అక్టోబర్ 2020, సోమవారం

సాలగ్రామములు

 సాలగ్రామములు 

ఓం నమో నారాయణాయ నమః


సాలగ్రామము విష్ణుప్రతీకమైన ఒక శిలా విశేషము. సర్వకాల సర్వ్యావస్థలయందు విష్ణువు సాక్షాతూ సాన్నిధ్యం కలిగి ఉండేది సాలగ్రామంలో మాత్రమే. అందుచేతే గృహదేవతార్చనలలోగానీ, దేవాలయాలలోగానీ సాలగ్రామము (మూర్తి) లేకుండా పూజలు కొనసాగవు. 

ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు తమతమ దేవతార్చనలలో సాలగ్రామములను పూజకు ఉపయోగిస్తారు.


భారతదేశంలో సాలగ్రామ పూజ బహు పురాతనమైనది. క్రీస్తు కంటే ప్రాచీనుడైన అపస్తంబుడు సాలగ్రామ పూజను పేర్కొన్నాడు.


త్రిమతాచార్యులు తమతమ భాష్యాలలో సాలగ్రామాలు విష్ణురూపాలని వివరించారు.


దేవాలయాలలో పంచాయతన మూర్తులకు 

శిలా ప్రతిమలు ఉంటే గృహస్థులకు మణి, స్వర్ణ నిర్మితమైన మూర్తులు, సాలగ్రామములు ఉంటాయి. 


సాధారణంగా ప్రతిమలకు నిత్య పూజా సమయంలో ఆవాహనాది షోడశోపచారాలు చేయాలి. 

సాలగ్రామాలలో దేవత నిత్యం సన్నిహితమై ఉండడం వల్ల వాటికి పూజా సమయంలో అవాహనాది ఉపచారాలు అవసరం లేదు.


హిందువులందరికీ తులసి, శంఖం, సాలగ్రామం పూజనీయమైనవి. 

తులసి హిందువుల ఇహపర సాధనానికి భూలోకంలో అవతరించిన వనదేవత. 

ఈ తులసి అపూర్వమైన మూలిక కూడా. 

శంఖం అత్యంత పవిత్రమైనది. 

శంఖారావం వ్యాపించినంత దూరం సూక్ష్మక్రిములు నశిస్తాయి అంటారు. 

నీరు శంఖంలో పూరిస్తే తీర్థం అవుతుంది. 


వట్టివేళ్ళు, ఏలకులు, లవంగాలు, పచ్చ కర్పూరం మొదలైన సుగంధ ద్రవ్యాలు చేర్చిన నీటిని 

శంఖంలో పోసుకుంటూ..

సాలగ్రామాలకు పురుషుసూక్తం పఠిస్తూ..

అభిషేకం చేసిన తీర్థం సర్వశక్తివంతం. 


ఇటువంటి తీర్ధాన్ని భక్తితో సేవిస్తే ప్రాయశ్చిత్తం, పాపక్షయం కలుగుతుంది. 

తీర్ధాన్ని మూడుసార్లు తీసుకుంటారు. 

మొదటిది కాయసిద్ధి కొరకు, 

రెండవది ధర్మసాధనకు,

మూడవది మోక్షం పొందడానికి. 


అసలీ తీర్ధం వల్ల అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయం కలుగుతాయి.


సాలగ్రామాలు ఉన్న ఇల్లు గొప్ప పుణ్యక్షేత్రంతో సమానం. సాలగ్రామ దర్శనం వల్ల, స్పర్శవల్ల, అర్చనవల్ల అంతులేని పుణ్యం లభిస్తుంది. 

సాలగ్రామాలు శిలాజాలు. 

శాస్త్రజ్ఞులు ఈ శిలలను ఒక విధమైన ప్రాణి నిర్మిస్తుందని అంటారు. 


ఆలి అనే ఒక విధమైన మత్స్యం శీతాకాలంలో 

తన శరీరం నుంచి వెలువడే ఒక విధమైన రసాయనిక పదార్ధంతో శిలామయమైన కవచాన్ని నిర్మించుకుని దానిలో నివశిస్తుందని అది మరణించినప్పుడు లేక 

వదిలి వెళ్ళినప్పుడు అవి సాలగ్రామాలుగా మనకు లభిస్తాయని అంటారు. 


సాలగ్రామాల మీద వివిధ దేవతా చిహ్నాలు ఉంటాయి. ముఖ్యంగా చక్రం, పద్మం ప్రధాన చిహ్నాలు. 

విష్ణు భక్తులైన మాధ్వులకు, వైష్ణవులకు ఇవి పూజకు ఎంతో విలువైనవి. 

వైష్ణవ పురాణాలు, ఇతర వైష్ణవ గ్రంధాలు వీటిని గురించి సవిస్తరంగా వివరిస్తాయి.


నేపాల్ దేశంలో ఖట్మండుకు సుమారు 197 మైళ్ళు దూరంలో ముక్తినాధ్, గండకీ నదీ తీరంపై ఉన్న మహాక్షేత్రంలో ఇవి లభిస్తాయి. 

ఇవి సాధారణంగా స్థలజాలు, జలజాలు అని రెండు రకాలు. 

గండకీ నదీ తీరాన్ని ఆనుకుని ఉన్న సాలగ్రామ గిరిపైన స్థలజాలు, 

గండకీ నదీ గర్భంలో జలజాలు లభిస్తాయి. 


సాలగ్రామాలలో బంగారం ఉంటుంది. 

అందుకే వాటిని హిరణ్యగర్భ అని కూడా అంటారు. సాలగ్రామాలు అమోనైట్ శిలామాలు. 

ఇండియాలో ఈ సాలగ్రామాలు సముద్రంలో నివసించే టెథైస్ అనే ప్రాణి వల్ల ఏర్పడతాయి. 

ఇటువంటి శిలాజాలు అనేక రకాలు ఉన్నాయి. 


250 మిలియన్ సంవత్సరాలలో ఇండియా ఉత్తర దిక్కుగా 9,000 కి.మీ. జరిగిపోయింది. 

హిమాలయాలు ఏర్పడ్డాయి. 

వీటి నుండి అనేక నదులు ప్రవహించాయి. 

ఇండో మైదానంలోకి ప్రవహించిన అటువంటి నదులలో ఒకటి గండకి. 


సాలగ్రామములు మన శాస్త్రం అనుసరించి కొన్ని సౌమ్యమైనవి. 

కొన్ని ఉగ్రమైనవి. 

శాస్త్ర సమ్మతంగా..

చక్రశుద్ధి, 

వక్త్రశుద్ధి, 

శిలాఉద్ధి, 

వర్ణశుద్ధి గల వాటినే పూజించాలి. 


రకరకాల రంగులు గలిగిన కారునలుపు, భగ్నమైన, మొక్కవోయిన సాలగ్రామాలను పూజించకూడదు. నారసింహ..

పాతాళ నారసింహ, 

గండభేరుండ, 

మహాజ్వాల మొదలైనవాటిని సన్యాసులు, బ్రహ్మచారులు పూజించాలి. 


విష్ణు, 

సీతారామ, 

గోపాల వంటి శాంతమూర్తులనే గృహస్థులు పూజించుకోవాలంటారు. 

పరిమాణాన్నిబట్టి కూడా పూజార్హతను నిర్ణయించుకుంటారు.. 

సాధారణంగా ఇవి ప్రతి గృహంలోనూ వంశపారంపర్యంగా సంక్రమిస్తుంటాయి. 


సాలగ్రామ శిలామహత్మ్యం గురించి వేరే చెప్పనక్కరలేదు. తిరుపతిలో శ్రీ వేంకటేశ్వరునికీ, 

మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారికీ 

అంతటి మహిమ ఉండడానికి కారణం అక్కడ ఉండే సాలగ్రామాలు అంటారు. 

సాలగ్రామాన్ని పూజిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో 

దాని దానం వలన కూడా అంతటి ఫలం లభిస్తుంది.


సాలగ్రామ శిలయందు, చరాచరాత్మకమగు మూడు లోకాలు అణిగి ఉన్నాయి. 

ఆ కారణంగా సాలగ్రామాన్ని భక్తిశ్రద్ధలతో, 

పరిపూర్ణ విశ్వాసంతో, శాస్త్ర ప్రకారం అభిషేకిస్తే, 

కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యఫలానికి సమానమవుతుంది. 


మరియు కోటి గోవులను దానం చేసినంత ఫలితాన్ని పొందుతారు. 

సాలగ్రామ పూజచే, శివకేశవులని పూజించిన ఫలితం కలుగుతుందిట.

సాలగ్రామం వున్న ప్రదేశాలలో స్నానం చేసినా, 

దానం చేసినా, 

కాశీ క్షేత్రంలో పవిత్ర గంగానదీ స్నానంకంటే, 

ఆ పుణ్యక్షేత్రంలో చేసిన దానం కంటే, 

నూరు రెట్లు అధిక ఫలము కలుగుతుంది. 


సాలగ్రామమును అభిషేకించిన పుణ్య బలాలను ప్రోక్షించుకొనినచో, 

సర్వపాపాలను నశింపజేస్తుంది. 

సర్వరోగాలు తొలగిపోతాయి. 

సకల సంపదలు కలుగుతాయి, 

సర్వశుభాలను కలిగించి, 

మోక్ష సామ్రాజ్యమును సిద్ధింపజేస్తుంది. 


సాలగ్రామమును అభిషేకించిన జలాలను 

ప్రోక్షించుకొనిన యెడల, 

పవిత్ర గంగానదీ స్నానమాచరించిన యెడల 

సర్వ తీర్థాలలో స్నానమాచరించిన పుణ్యఫలం కలిగి, సర్వదేవతలను ఆరాధించిన ఫలితం కలుగుతుంది.


ఒక్కసారి భక్తిశ్రద్ధలతో సాలగ్రామాన్ని శాస్త్ర ప్రకారం పూజించి, అభిషేకించితే కోటి లింగాలను దర్శించి, పూజించి, అభిషేకించిన ఫలితం కలుగుతుంది. 

సాల గ్రామ తీర్థం సేవించినచో, 

వెయ్యిసార్లు పంచామృతమును సేవించిన ఫలితముకంటే, 

ప్రాయశ్చిత్తముల యందు ఆచరించు దానాలు ఫలితం కంటే అధిక ఫలితం ఉంటుంది. 


కనీసం, సాలగ్రామాన్ని అర్చించుటకు మంత్రాదులు తెలియకున్నప్పటికీ, శక్తిననుసరించి 

పూర్తి భక్తివిశ్వాసాలతో పూజిస్తే, 

కొన్ని ఫలితాలైనా కలుగుతాయి. 

సాలగ్రామ శిల యందు ఉంచిన అన్ని పదార్థములు పవిత్రములవుతాయి. 

సాలగ్రామమును ముందుంచుకుని పితృదేవతలకు తర్పణాలను ఇచ్చన ఎడల, 

ఆ పితృదేవతలు స్వర్గంలో శాశ్వత సుఖాలను పొందు తారు. 


అన్ని విధాలైన పుణ్యాలకు పరిమితులున్నాయి గాని, 

ఈ సాలగ్రామశిల పూజచే కలుగు పుణ్యానికి 

పరిమితులు లేవు. 

అతల, వితల, రసాతల, పాతాళాది పధ్నాలుగు లోకాలలో ఈ సాలగ్రామ శిలకు సరిపడునట్టి వేరొక శిల లేదన్నదే శాస్తవ్రచనం.


కార్తీక మాసంలో సాలగ్రామ శిలపై ‘స్వస్తిక’ మండలమును రచించినచో అనంతమైన పుణ్యఫలము కలుగుతుంది. సంవత్సరకాలం గృహంలో ‘నిత్యాగ్ని హోమం’ చేసిన ఫలితానికి సమానమైన ఫలితాన్ని పొందుతారు. 


సాలగ్రామంపై శుద్ధమైన మట్టితో గాని, 

రంగులతో గాని, 

ఏ కొద్దిపాటి కేశవనామాలను వ్రాసినా, 

కోటి కల్పాల వరకూ స్వర్గంలో నివసించే భాగ్యం 

కలుగుతుందిట. 

పూజాపీఠంలో సాలగ్రామమును ఉంచితే, 

సమస్తమైన పూజలు సక్రమంగా సాగి 

పరిపూర్ణ ఫలితాలను పొందుతారు. 

సాలగ్రామాలు ఎంత చిన్నవిగా ఉంటే అంత మంచిది. 


సాలగ్రామాలు పగిలినప్పటికీ, 

పెచ్చు పూడినప్పటికీ కూడా పూజార్హత కలిగి ఉంటాయి. కొన్ని సాలగ్రామాలు ఇంట్లో పెట్టుకుని పూజించుటకు అర్హత కలిగి ఉండవు. 

విపరీత పరిణామాలు కలుగుతాయి, 

కాబట్టి ఇంట్లో పెట్టుకుని పూజించాలనుకుంటే, సాలగ్రామములను గురించి క్షుణ్ణంగా తెలిసిన 

పండితుల అమూల్యమైన అభిప్రాయాలను తెలుసుకుని ఆచరించటం శ్రేయస్కరం.


సాలగ్రామంపై గల చక్రాలను బట్టి వాటికి 

వివిధము లైన పేర్లు ఉన్నాయి.

1 చక్రం ఉంటే - సుదర్శనం అని,

2 చక్రములు ఉంటే - లక్ష్మీనారాయణ అని,

3 చక్రములు ఉంటే - అచ్యుతుడు అని,

4 చక్రములు ఉంటే - జనార్ధనడు అని,

5 చక్రములు ఉంటే - వాసుదేవుడు అని,

6 చక్రములు ఉంటే - ప్రద్యుమ్నుడు అని,

7 చక్రములు ఉంటే - సంకర్షణుడు అని,

8 చక్రములు ఉంటే - పురుషోత్తముడు అని,

9 చక్రములు ఉంటే - నవ వ్యూహము అని,

10 చక్రములు ఉంటే - దశావతారము అని,

11 చక్రములు ఉంటే - అనిరుద్ధుడు అని,

12 చక్రములు ఉంటే - ద్వాదశాత్ముడు అని,

12 చక్కముల కన్నా ఎకువ ఉంటే ‘అనంతమూర్తి’ అని అంటారు. 


సాలగ్రామాలు తెల్లనివైతే సర్వపాపాలను హరిస్తాయి. 


పసుపుపచ్చనివి అయితే సంతానభాగ్యాన్ని కలిగిస్తాయి. 


నీలవర్ణంగలవి అయితే సర్వసంపదలను ఇస్తాయి. 


ఎరుపురంగు గలవి అయితే రోగాలను కలిగిస్తాయి, 


వక్రముగా వున్న సాలగ్రామాలు దారిద్య్రాన్ని కలిగిస్తాయి.


నలుపు రంగు కలిగి, దానికి గల చక్రం మధ్య భాగంలో కొద్దిగా ఉబ్బినట్లుగా వుండి, 

రేఖపొడవుగా ఉంటే, దానిని ‘ఆదినారాయణ సాలగ్రామం’ అని అంటారు.


తెలుపురంగు కలిగి రంధ్రంవైపున రెండు చక్రాలు 

ఒక దానితో ఒకటి కలిసిపోయినట్లు ఉంటే, 

దానిని ‘వాసు దేవ సాలగ్రామం’ అని అంటారు. 

ఇది సర్వ శ్రేష్టమైనది. 

ఇది ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది.


పసుపు పచ్చ రంగు కలిగి గుండ్రంగా వుండి, 

రంధ్రం వైపున మూడు రేఖలు ఉండి, ‘

పద్మ చిహ్నం’ పైముఖం గా ఉంటే దానిని 

‘అనిరుద్ధ సాలగ్రామము’ అని అంటారు. 

ఇది చాలా మంచిది. 


కపిలవర్ణం కలిగి, చక్రం పెద్దదిగా ఉంటే, 

దానిని ‘నరసింహ సాలగ్రామం’ అని అంటారు. 

దీనిని బ్రహ్మచర్య దీక్షతోనే పూజించాలి. 


బంగారు వర్ణంతో పొడవుగా వుండి మూడు బిందువులతో వున్నదానిని ‘మత్య్సమూర్తి సాలగ్రామం’ అని అంటారు. ఇది భక్తిని పెంచి ముక్తిని కలిగిస్తుంది. 

సంపదలను ఇస్తుంది. 


నలుపు రంగుతో, మెరుస్తూ వుండి 

ఎడమవైపున గద, చక్రాలు, కుడి వైపున రేఖ వున్నదానిని ‘సుదర్శనమూర్తి సాలగ్రామం’ అని అంటారు. 

శత్రుబాధలు నుండి రక్షిస్తుంది. 


వివిధ వర్ణములతో వుండి, అనేక చక్రాలు, 

అనేక రేఖలు వున్నదానిని ‘అనంతమూర్తి సాలగ్రామము’ అని అంటారు.

ఈ సాలగ్రామం సకలాభీష్టాలను తీర్చుతుంది. 


3 ముఖాలు, 6 చక్రాలు కలిగి నేరేడు పండు ఆకారంలో ఉన్న దానిని ‘షట్చక్రసీతారామ సాలగ్రామం’ అని అంటారు. 

ఇలాంటి సాలగ్రామం దొరకటం దుర్లభం. 

ఈ సాలగ్రామాన్ని పూజించనవారికి అష్టైశ్వర్యములు కలుగుతాయి. 


ఇంకా కొన్ని అపురూపమైన సాలగ్రామాలు కూడా ఉన్నాయి. 

ఇంట్లో పూజించు సాలగ్రామానికి నిత్యనైవేద్యం తప్పనిసరిగా పెట్టాలి. 

కుటుంబ సభ్యులు మినహా అన్యులు సాలగ్రామాన్ని దర్శించరాదు.

సర్వపాపపరిహారమైనది, 

సర్వవిధాలైన కష్టాల నుండి రక్షించేది, 

సర్వ పుణ్యణఫలాలను ఇచ్చేది, 

సర్వదేవతా పూజాఫలితాలను ఇచ్చేది, సర్వశ్రేయస్కరమైనది, 

సర్వో త్కృష్టమైనది, 


సర్వాంతర్యామి యొక్క ప్రతీక అయిన ‘సాలగ్రామాన్ని’ పూజించుకునే భాగ్యం ఈ కలియుగం లో మానవులమైన మనకు కలగటం, 

నిజంగా అపూర్వ మైన అదృష్టం. 

అటువంటి అవకాశాన్ని వినియోగించుకుని, 

జీవితాన్ని ధన్యం ఒనర్చుకుని, 

శాశ్వతానందాన్ని పొంది ముక్తిని పొందటం భక్తిపరుడైన మానవునికి ముఖ్యకర్తవ్యం అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 

అవకాశం దొరికితే, ఆ పుణ్యఫలాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నించాలి.


సాలగ్రామాలను ఆవుపాలతో గాని, 

పంచామృముతోగాని శుద్ధి చేయాలి. 

‘రుద్రాక్షధారణ’ నియమాలనే, 

సాలగ్రామ పూజలోనూ పాటించాలి. 


ప్రత్యేక సమయాలలో, 

సంక్రమణకాలాలలో, 

గ్రహణ సమయాలలో 

ఆయా సాలగ్రామాలననుసరించి 

ఆయా దైవజపాలను 1008 సార్లు చేసినా, చేయించుకున్నా, 

ఆ సాలగ్రామము యొక్క శక్తి ద్విగుణీకృతమవుతుంది.


సాలగ్రామశిలను షోడశోపచార పూజావిధానం ద్వారా అర్చించిన భక్తులకు యావత్‌ కల్పాంతముల వరకు 

వైకుంఠంలో నివసించే భాగ్యం కలుగుతుంది. 


కనీసం సాలగ్రామంకు భక్తిశ్రద్ధలతో నమస్కరించి, యథావిధిని పూజిస్తే, 

మరుజన్మ లేకుండా ముక్తి పొందుతారని ప్రతీతి. సాలగ్రామమును స్మరించినా, 

దర్శించినా, 

నమస్కరించినా, 

సర్వపాపాలు పరిహరింపబడతాయి.


(సేకరణ)

కామెంట్‌లు లేవు: