19, అక్టోబర్ 2020, సోమవారం

పన్నెండు జ్యోతిర్లింగాల దర్శన ఫలాలు🌼🌿*

 *🌼🌿 ఈ పన్నెండు జ్యోతిర్లింగాల దర్శన ఫలాలు🌼🌿*


ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను చూసినా, తాకినా, పూజించినా తలచినా మానవులు ఇహపర సుఖాలను పొందుతారు.


1 . సౌరాష్ట్ర దేశంలో చంద్రనిర్మితమైన, అయన పేరు తోనే అలరారుతున్నకుండంలో స్నానంచేసి, అక్కడ సోమనాథ జ్యోతిర్లింగాన్ని భక్తిశ్రద్ధలతో ఆరాధించిన వాళ్ళు కుష్ఠాపస్మారక్షయాది రోగవిముక్తులై ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతోజీవిస్తారు.

2 . ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలంలో మల్లిఖార్జుననామంతో వెలసిన శివుడి జ్యోతిర్లింగారాధన వలన సర్వవిధ దరిద్రాలు సమసిపోయి, సద్యశ్శుభాలేర్పడి, అనంతరం మోక్ష పదం కలుగుతుంది.

3 . ఉజ్జయిని ‘మహాకాల’ నామకమైన జ్యోతిర్లింగార్చనవలన భయ రాహిత్యం, విద్యాపాటవం, భోగభాగ్యాలూ సమకూరి అన్నింటా విజయం.

4 . అమరేశ్వర, పరమేశ్వర, ఓంకారేశ్వారాది సార్థకనామధేయలాతో ఓంకారేశ్వారంలో వెలసిన శివుడి జ్యోతిర్లింగాన్ని పూజించడం వలన ఇహపరాలు రెండింటా కృతార్థత లభిస్తుంది.

5 శ్రీహరియొక్క రెండు అంశలైన నరనారాయణుల ప్రార్థనతో ఆవిర్భవించిన జ్యోతిర్లింగం హిమవత్పర్వతం మీద వుండి. కేదారేశ్వరుడిగా పేరు వహించిన ఇక్కడి లింగారాధన సర్వాభిష్టాలనూ నెరవేరుస్తుంది. ఇక్కడి రేతః కుండంలోని నీళ్ళతో మూడుసార్లు ఆచమించడమే ముక్తికి చేరువ మార్గమని ముని వాక్యం.

6 . ఢాకిని అనే ప్రదేశంలో ఉన్న జ్యోతిర్లిగం పేరు భీమశంకరలింగం. ప్రాణావసానుడై ఉన్న భక్తుడి రక్షణార్థమై వెలసిన ఈ లింగారాధన వలన అన్ని విధాల భయాలూ అంతరించి, శత్రుజయం కలుగుతుంది. అకాలమృత్యువులు తప్పిపోతాయి.

7 . సర్వప్రపంచం చేతా సేవించబడుతూన్న విశ్వేశ్వరలింగం కాశీలో ఉంది. ఈ పుణ్యక్షేత్ర దర్శన 

మాత్రం చేతేనే సమస్తమైన కర్మబంధాల నుంచీ విముక్తులౌతారు. ఇక్కడ కొన్నాళ్ళు నివసించినా, లేదా కాలవశాన ఇక్కడనే దేహం చాలించినవాళ్ళు మోక్షాన్నే పొందుతారు.

8 . మహారాష్ట్ర నాసిక్ లో ఉన్న జ్యోతిర్లింగం పేరు త్రయంబకేశ్వర లింగం. దీని ఆరాధన వలన అన్ని కోరికలూ తీరుతాయి. అపవాదులు నశిస్తాయి.

9 . చితాభూమిలో ఉన్న జ్యోతిర్లింగం వైద్యనాథుడు. ఈ లింగారాధన వలన భుక్తి ముక్తులే కాకుండా అనేక విధాలైన వ్యాధులు హరించబడతాయని ప్రతీతి.

10 . నాగేశ్వర జ్యోతిర్లింగం. ఈ లింగ దర్శనార్చనాడుల వలన సమస్తమైన భవభయాలే కాకుండా, మహాపాతక ఉపపాతాకాలు కూడా నశించిపోతాయి.

11 . శ్రీరాముని కోరికమేరకు రామేశ్వరంలో జ్యోతిర్లింగంగా వెలిసిన శివుడు, రామేశ్వరుడనే పేరుతోనూనే రాజిల్లుతున్నాడు. కాశీలోని గంగా జలాన్ని తెచ్చి, ఇక్కడి లింగానికి అభిషేకం 

చేసిన వాళ్ళు జీవన్ముక్తులవుతారని ప్రఖ్యాతి.

12 ‘ఘృష్ణేశ్వరుడు’. శివాలయమనే కొలనులో భక్తరక్షణార్థమై ప్రభవించిన ఈ స్వయంభూలింగం భక్తుల ఇహపర భోగాలను అందజేస్తుంది.

కామెంట్‌లు లేవు: