19, అక్టోబర్ 2020, సోమవారం

కమేరుడి

 *కమేరుడి హెచ్చరిక -- చందమామ కథలు*


*సింహపురి గ్రామంలో వుండే శేషావతారానికి ముగ్గురు కొడుకులు, నలుగురు కూతుళ్ళు. అందరికీ పెళ్ళిళ్ళయి, ఆ ఊళ్ళోనే వుంటున్నారు. శేషావతారానికి తన బొమ్మగీయించుకోవాలని మహామనసు. ఆ ఊళ్ళో చిత్రకారులు లేరు. అందుకని, తనకెంతో ఇష్టుడైన మనవడు శంకరాన్ని చిత్రకళ అభ్యసించమని చిన్నప్పట్నించీ పోరుతున్నాడాయన.*


*ఏకళకైనా అభిరుచివుండాలనీ, తనకు బొమ్మలు గీయడమంటే చిరాకనీ వాడు చిన్నప్పుడే చెప్పేవాడు. ఇప్పుడు శంకరానికి పద్ధెనిమిదేళ్ళు నిండాయి కానీ, వాడికి చిత్రకళంటే ఇంకా ఆసక్తి పుట్టలేదు. ఈలోగా తాతయ్యకు జబ్బు చేస్తే కలవర పడిపోయాడు. జబ్బు నుంచి కోలుకున్నాక శేషావతారం, మనవడితో, ‘‘నేనిక ఎంతో కాలం బ్రతకను.*


*బహుశా పోయేలోగా, నా బొమ్మ చూసుకునే అదృష్టంనాకున్నట్లు లేదు," అని ఎంతగానో బాధ పడ్డాడు. శంకరం ఆయన్ను ఓదార్చుతూ, ‘‘నీకోసం నేను పట్నం వెళతాను. ఎలాగైనా అక్కడ మంచి చిత్రకారుణ్ణి వెదికి తీసుకువస్తాను," అన్నాడు. శేషావరాతం ఎంతో సంబర పడిపోయాడు. ఆయన మనవడితో, ‘‘నీ ఆలోచన బాగుంది కానీ, వింటే అంతా నవ్వుతారు.*


*ఈ వయసులో ముసలాడికిదేమి సరదా అని ఎగతాళి చేస్తారు. మన కుటుంబం అంతా కలిసి ముప్ఫై మందికి పైగానే వుంటాము. నేనుండగానే మన కుటుంబంలో అందరూ కలిసున్న బొమ్మ గీయించాలని చెప్పు. అందులో ఎలాగూ నా బొమ్మ వుంటుంది," అన్నాడు. శంకరం పట్నం వెళ్ళాడు. వాడు తమ కుటుంబం బొమ్మకు వంద వరహాలదాకా ఇద్దామనుకున్నాడు. అయితే, ఒకే బొమ్మలో ముప్పై మందికి పైగా మనుషుల్ని అన్ని ముఖాలూ విడివిడిగా గుర్తు పట్టేలా చిత్రీకరించాలంటే, పది వేల వరహాలు కావాలన్నరు చిత్రకారులు.*


*ఇది విని శంకరం నిరుత్సాహ పడిపోయాడు. తాతయ్య తనను చిత్రకారుడుకమ్మని ఎందుకు కోరేవాడో అప్పటికి అర్థమైంది వాడికి. ఆయన కోర్కె తీర్చడానికి తమ ఆర్థిక స్తోమతు చాలదని గ్రహించి, సింహపురికి తిరుగు ప్రయాణమైన శంకరాన్ని కమేరుడనే వాడు కలుసుకున్నాడు. కమేరుడి వద్ద ఒక యంత్రమున్నది.*


*ఆ యంత్రంలో ధవళ వస్త్రాన్నుంచి మంత్రోచ్ఛారణ చేసి ఏదృశ్యాన్ని చూస్తే, అది ఆ వస్ర్తం మీద బొమ్మగా పడుతుంది. ఆ బొమ్మ చిత్రకారులు గీసిన బొమ్మకంటే స్పష్టంగానూ, సహజంగానూ వుంటుంది. ‘‘నాకు నీకోరిక గురించి తెలిసింది. నీ కుటుంబం బొమ్మను చేయడానికి, నా యంత్రం ఉపెూగిద్దాం. అందుకు ప్రతిఫలంగా నువ్వు నాకు యాభైవరహాలిస్తే చాలు," అన్నాడు కమేరుడు, శంకరంతో.*


*శంకరం సంతోషించాడు కానీ, ‘‘అసలు నీకిలాంటి యంత్రమెలా వచ్చింది?" అంటూ వాడు కమేరుణ్ణి ప్రశ్నించాడు. కమేరుడు తడుముకోకుండా, ‘‘నా మేనమామకు మంత్ర తంత్రాలు తెలుసు. ఏడాది క్రితం ఈ యంత్రాన్ని నాకోసం తయారు చేసి ఇచ్చాడు. మా బంధువులందర్నీ ఓ చోట చేర్చి బొమ్మ చేసాను, చూడు!" అంటూ తన అంగీలోంచి చిన్న వస్ర్తం బయటకు తీశాడు.*


*దానిమీద చాలామంది మనుషులున్న బొమ్మ ఒకటి వుంది. అందులో ఒక్కడు మాత్రమే చూడగానే నవ్వు పుట్టించేలా అదోలావున్నాడు. ‘‘ఈయనెవరు? ఇంత వికారంగా వున్నాడు?" అన్నాడు శంకరం కుతూహలంగా. కమేరుడు నవ్వుతూ, ‘‘ఈయన పేరు సురూపి. కానీ నాయంత్రం చేసిన బొమ్మలో ఒక్కరైనా ఇలా వికారంగా కనపడక తప్పదు," అన్నాడు.*


*శంకరం ఒక క్షణం ఆగి, ‘‘నా తాతయ్యకు మా కుటుంబం బొమ్మ గీయించాలని వుంది. ఆయన కోరిక తీర్చడానికి నేను ఏ త్యాగానికైనా సిద్ధంగావున్నాను. అయితే నా బొమ్మకాక, మా తాతయ్య బొమ్మే పాడైపోతుందేమో అని సంకోచంగావుంది," అన్నాడు.*


*‘‘ముందుగా నువ్వొప్పుకుంటే, నీ బొమ్మ మాత్రమే పాడవుతుంది," అన్నాడు కమేరుడు. ఇద్దరూ సింహపురి చేరుకున్నాక, శంకరం తన వారందరికీ కమేరుడి యంత్రమహిమ గురించి చెప్పాడు. యంత్రంతో బొమ్మ చేయించుకోవాలని, శేషావతారం కుటుంబ సభ్యులందరూ, ఆయన పెద్ద కొడుకు తోటలో చేరారు.*


*అందరూ మంచి మంచి దుస్తులు ధరించారు. ఆడవాళ్ళయితే అందమైన దుస్తులతో పాటు నాణ్యమైన రకరకాల నగలు కూడా ధరించారు. చివరకు కమేరుడు తన యంత్రాన్ని తీసుకుని వారి ముందు నిలబడి, యంత్రంలో ఒక ధవళ వస్ర్తాన్ని పెట్టాడు. కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు చదివాడు.*


*తర్వాత కళ్ళు తెరిచి యంత్రంలోంచి వస్ర్తాన్ని బయటకు తీసి, శంకరానికి ఇచ్చాడు. శంకరం వెంటనే అందులో తన బొమ్మ చూసుకుని ఖిన్నుడై పోయాడు. కోపంలో వున్నవాడు చూసినా ఫక్కున నవ్వేలా వింతగావున్నదతడి బొమ్మ. ఈలోగా మిగతావాళ్ళు కుటుంబం బొమ్మ ఎలావుందో చూడాలని ఎగబడ్డారు.*


*దాన్ని వాళ్ళకిచ్చి కాస్త దూరంగా వెళ్ళి నిలబడ్డాడు శంకరం. కమేరుడు, శంకరం భుజం తట్టి, ‘‘నీ తాతయ్య బొమ్మ చూడాలని మహామనసు పడ్డావు. ఆయన బొమ్మ బాగా వచ్చిందా?" అని అడిగాడు. ‘‘నేనాయన బొమ్మ చూడలేదు. నా బొమ్మ పాడైందని, నా మనసు పాడైంది. ఇక అందరూ నన్ను ఎగతాళి చేస్తారు!" అన్నాడు శంకరం.*


*దానికి కమేరుడు పెద్దగా నవ్వి, ‘‘ నీ తాతయ్యబొమ్మ కోసం పెద్ద త్యాగం చేసిన నువ్వే, ఆయన బొమ్మ చూడకుండా, నీ బొమ్మ చూసుకుని ఊరుకున్నావు. అటు చూడు!" అన్నాడు. శంకరం తన కుటుంబ సభ్యుల కేసి చూశాడు. వాళ్ళు ఎవరి బొమ్మను వాళ్ళు చూసుకుని మురిసిపోతున్నారు. వాళ్ళల్లో ఏ ఒక్కరూ రెండోవాళ్ళ బొమ్మకేసి చూడడం లేదు.*


*‘‘చూశావా, వాళ్ళు పక్కవాళ్ళ బొమ్మకేసి అసలు చూడడం లేదు. అందరూ అంతే. మానవ మనస్తత్వం అలాంటిది. కాబట్టి వాళ్ళు పాడైన నీ బొమ్మను చూసి పరిహసిస్తారన్న విచారం నీకు అనవసరం," అన్నాడు కమేరుడు. ఆ మాటతో శంకరం దిగులంతా మాయమయింది. వాడు అనుకున్నదానికంటే కమేరుడికి మరోయాభై వరహాలు అదనంగా ఇచ్చి పంపేశాడు.*

కామెంట్‌లు లేవు: