15, అక్టోబర్ 2020, గురువారం

వాత్సల్య గోదావరి*

 *వాత్సల్య గోదావరి*


 రచన: శ్రీమతి మణి వడ్లమాని


ఆషాడం చివరన,తొలకరి జల్లులు,కుంభవృష్టిగా మారి ఆకాశం చిల్లుపడ్డట్టుగా కుండపోతగా వర్షం కురుస్తోంది.


వీధి వసారాలో సుబ్బుశాస్త్రిభోరున పడుతున్న వానను చూస్తూ,మనసులోబావురుమనుకుంటూ పీట మీద కూర్చొని శివ పంచాక్షరీ జపం చేస్తున్నాడు.పెదాలుమాత్రమేజపిస్తున్నాయి.చూపు మాత్రంవీధివైపు ఉంది. పంచాంగం ముందు పెట్టు కొని ఆరోజు తిది,వార,నక్షత్రాలు తో సహా సిద్ధంగాఉన్నాడు.అలాగే ఎవరన్నా వచ్చిపిలుస్తారేమోఅనివడికిన జంద్యాలు కూడా పక్కనేపెట్టుకున్నాడు


‘శాస్త్రి గారు’ అనే పిలుపు కోసం చెవులు రిక్కించి ఉంచాడు.


అబ్బే ఏది ఎవరూ రాందే?


నిరాశగా మళ్ళి పంచాక్షరీ జపం చేస్తున్నాడు. మనసులో మటుకు వరద గోదావరిలా ఎన్నో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి


ఈవర్షం కనక లేకపోతెరోజూ ఈ పాటికల్లాగోదారొడ్డున ఉన్న కోటిలింగాల రేవుదగ్గర ఉండేవాడు. ఉదయాన్నే వెళ్లి గోదావరి లో ఓ నాలుగు మునకలు వేసి సంధ్యావందనం అక్కడే కానిచ్చి, ఈశ్వరుడి దర్శనం చేసుకొని, ఆ పావంచాల అంచున కూర్చొని ఎక్కడెక్కడి నుంచోపరమపావని అయిన ఈ గోదావరి లో స్నానం చెయ్యడానికి వచ్చిన వాళ్ళ చేత సంకల్పం చెప్పించివాళ్ళు ఇచ్చిన తృణమో పణమో తీసుకొని ఆరోజు కి సరిపడ సంబారాలు కొనుక్కొని ఇంటికి వెళ్ళే వాడు.ఇది రోజూ అతని దినచర్య. భార్య వర్ధనమ్మ ఎంతో ఒబ్బిడిగా సంసారం లాక్కొని వస్తోంది , లేదు,సరిపోదు అనకుండా తెచ్చిన వాటితోనే రుచికరమైన వంట చేసి భర్తకు పెట్టేది.


అందుకే ఎప్పుడు సుబ్బుశాస్త్రి అనేవాడు “వర్ధనం,నీ చేతి లో ఏదో మంత్రదండం ఉంది సుమా!” అని. ఆ తృప్తి తోనే ఆవిడకి కడుపు నిండి పోయేది.


కాని నాలుగు రోజులనుంచి కురుస్తున్న ఈ కుంభవృష్టి వల్ల యాత్రికులు ఎవరూ రావటం లేదు. ఇంచుమించుగా భార్యభర్తలిద్దరూ అర్ధాకలితోనే కాలం వెళ్ళదీస్తున్నారు


 పోనీ,ఎవరైనా,ఆభ్దికాలకి భోక్తలుగా పిలుస్తున్నారా? అంటే అది లేదు. అయినా ఇళ్ళలో చేస్తేనే కదా పిలిచేది అది కాస్తా మఠం లోనే కానిచ్చేస్తుంటే, ఇహ చేసేదేముంది? అనుకుంటూ ‘ఆ గోదావరి తల్లినే నమ్ముకున్నాను. పుణ్యనదిలో స్నానాల కోసం ఎవరైనా రాకపోతారా? సంకల్పం చెప్పక పోతానా? నాలుగు రూపాయలు తెచ్చుకురానా?” అని ఆశగా చూస్తున్నాడు.


అందరిలా తను పెద్దగా పండితుడు కాదు,పూజలు ,పెళ్ళిళ్ళు చేయడానికి.ఏదో బతుకు తెరువు కోసం, ఆభ్దికాలకి,భోక్తలుగా వెళ్ళడం, లేదా ఎవరైనా గ్రహ పూజలు చేస్తే ఆ దోష నివారణార్ధం దానం అందుకోవడం, అలా వాటితో వచ్చిన సొమ్ము తోనే బ్రతుకును వెళ్లదీసుకువస్తున్నాను.పిత్రార్జితం గ ఉన్న ఈ పెంకుటిల్లే.కాస్త నీడ నిస్తోంది.అది కాస్తశిధిలావస్థలోఉంది.ఉన్న ఈ ఆధారం కూడా పోతె,ఇక నా దారి నువ్వేతల్లీ, అనిగోదావరి వైపు దిగులుగాచూస్తున్నాడు.


నాలుగు రోజులనుంచి కడుపునిండా తిండి సరిగాలేదు,నిన్న రాత్రి తిన్న ఉప్పుడుపిండి ఏ మూలకు సరిపోతోంది. నీరసంగా ఉంది. పాపం నేనే ఇలా ఉంటెవర్ధనం ఎలా తట్టుకుంటుందిఅనుకుంటూ పెరటివైపుకి చూసాడు. అక్కడ వసారాలో కూర్చొని వత్తులు చేసుకుంటూ ,గీతగోవిందం పాడుకుంటోంది.


జలజలా కురుస్తున్న వానని చూస్తూ “ఓ ఆకాశగంగాఎంతో ఉత్సాహంగా పైనుంచి కిందకి దూకుతున్నావు,ఆ గోదారేమోఅంతకంటే ఆవేశంతో నిన్నురమ్మనమని పిలుస్తోంది. మీ ఆట బాగానే ఉంది. అర్భకుడిని తల్లీ మీ ఇద్దరిమధ్యలో నన్ను బలి చెయ్యకండి.కాస్త ఈదీనుడిని కరుణించి శాంతించండి” అని మనసులోనే వేడుకుంటున్నాడు.


భర్త ఆశగా చూసే చూపుని తప్పించుకుంటూ పెరటి వసారాలో వత్తులు చేస్తున్నవర్ధనమ్మ ఆవేదనగా తలపోస్తోంది. ఏదైనా వండి పెడదామన్నా, ఇంట్లో బొత్తిగా సరకులు లేవు.ఉన్న రవ్వతో నిన్న రాత్రి కాసింత ఉప్పుడుపిండి చేసేసింది.ఈ పూట ఏదైనా దొరికేతే పర్వాలేదు. లేకపోతె ఇహ ఈ పూట పస్తే. అని ఏదోలెక్కలు వేసుకుంటూ అప్పుడే గంట పదకొండు దాటి ఉండచ్చు ఆనుకుంది.


ఇంతలో ముందు వసారాలో ఏదో అలికిడి వినిపించింది. గభాల్న లేచి చెంగు దులుపుకుంటూ వెళ్ళింది. ఆ వానలో కళ్ళకి ఏమి కనబడటం లేదు. ఎవరా అనిఆరాగా తొంగి తొంగి చూసింది. “సుబ్బుశాస్త్రి గారి ఇల్లు ఇదేనా? అంటూ ఒక వ్యక్తి అడుగుతూ లోపలకి వచ్చారు. “అవునండి,” అని సమాధానం ఇచ్చే లోపల ఒకఆడావిడా మరో మగమనిషి కూడా లోపలికి వచ్చారు.


ఈ హడావుడి అంతా విన్న సుబ్బుశాస్త్రి కూడా లేచి నిలబడ్డాడు. వాళ్ళు తెచ్చిన గొడుగులనువసారా మెట్ల మీద పెట్టారు. వాటి లోంచి చుక్కా చుక్కా నీరుమెట్ల మీద నుంచి కిందకిజారుతున్నాయి.వచ్చిన వాళ్ళ చేతులలోఏవో సంచులు కూడా ఉన్నాయి.


వాళ్ళలో ముందు గా మాట్లాడిన అతను. “వీళ్ళు మా అక్క,బావగారు. కెనడాలో ఉంటారు. ఇవాళ మా బావగారి తండ్రి తిధి , గోదావరి ఒడ్డున పెట్టుకుందామని వచ్చారు, మీ గురించి అవధాని గారు చెప్పారు కాని ఈ వానవల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేక స్వయం పాకం ఇచ్చేద్దాము అనుకుంటున్నాము” అని అన్నాడు.


దానికి సుబ్బుశాస్త్రి“ అబ్బే, నాకు ఏమిఫర్వాలేదు. మీ బావగారుఈ వానలో గోదారి ఒడ్డున కూర్చొని చెయ్యగలరా?” అని సందేహం వెలిబుచ్చాడు.


“ఫర్వాలేదండి,వస్తాము… నేను కూర్చొని చేస్తాను” అని అతని బావగారు అన్నాడు. తెచ్చిన సంబారాలు అన్నీ సుబ్బుశాస్త్రి చేతికిచ్చారు.అవి అందుకొని “ఓ పని చేద్దాము.మా ఆవిడ ఇంత పెసరపప్పు,పరమాన్నము చేసి పెడుతుంది.మీ తండ్రి గారి ప్రసాదం తిన్న తృప్తి కూడా ఉంటుంది. అది కూడా మీకు అభ్యంతరం లేకపోతేనే సుమా” అని అన్నాడు.


“అయ్యో ఎంత మాట! అంతకంటే మహద్భాగ్యం ఇంకేముంటుంది” అంటూ ఎంతగానో సంతోష పడ్డారు. నలుగురూ గొడుగులుతీసుకొని రేవు దగ్గరకి వెళ్లారు.


వాళ్ళు వచ్చే లోపల వర్ధనమ్మ చక చకా,రెండు కూరలు, పప్పు, పరమాన్నంతో భోజనం వండిపెట్టి ఉంచింది. సరిగ్గా అపరాహ్న వేళకి వాళ్ళు కూడా కార్యక్రమం ముగించుకొని వచ్చారు.పెరట్లో ఉన్న అరటి ఆకులు కోసి విస్తళ్ళు వేసి భోజనాలు వడ్డించింది.


భోజన కార్య క్రమం అయ్యాక “ అయ్యా! రండి,తమకి తాంబూలం ఇస్తాను” అని అన్నారు కెనడా నుంచి వచ్చిన శ్రీపతి శర్మగారు.


సుబ్బుశాస్త్రిని, వర్ధనమ్మని ఇద్దరినీ పక్కపక్కనే నిలుచోమని వాళ్ళ తల్లితండ్రుల జ్ఞాపకార్థం గా ఇద్దరికీ చీరా,పంచెల చాపు తో పాటుగా భారీగా తాంబూలం కూడా ముట్ట చెప్పారు ఆ దంపతులు.


ఈ కార్య క్రమం అంతా అయ్యేసరికి మధ్యాహ్నం రెండు గంటలయింది.ఆ బావమరది వెళుతూ “తొందరలోనేపుష్కరాలు కూడా వస్తున్నాయి కదా శాస్త్రి గారు. అప్పుడు మళ్ళి వస్తాము. అన్నీ మీరే చెయ్యాలి” అని అన్నాడు.


“అయ్యో తప్పకుండా చేస్తాను బాబు” అంటూ ఎంతో నమ్రతగా చెప్పాడు.

www.bestsocialteacher.com 

అప్పుడు శ్రీపతిశర్మగారు,బావమరది తో అంటున్నారు’ చూడు భాస్కర్, ఇంత పరమ పవిత్రమైన కార్యం చేసే వీళ్ళ జీవితాలు చూస్తే నాకు చాల భాదగా ఉంది. అయ్యో, ఏమిటిది? శనిదానాలు పట్టే బ్రాహ్మలు, కర్మలు జరిపించే వాళ్ళు శుభకార్యాలు చెయ్యకూడదుట కదా, పైగా అందరిలో చులకనగా కూడా చూస్తారట. ఇందాక శాస్త్రి గారు అంటుంటే విన్నాను. ఆర్ధికంగా కూడా వీళ్ళు చాలా బలహీనులు.


 చాలీ చాలని, బతుకులు, ఎలాగడుస్తుంది,మరి వీళ్ళని ఆదుకునేది ఎవరు?అందరికి లక్ష్మీదేవి ప్రసన్నం కావాలని ఆశీర్వదించే వీళ్ళింట మాత్రం ఎప్పుడూ దరిద్రదేవత తాండవం చేస్తోంది. మనం ఏదైనా చెయ్యలేమా? వాళ్ళకి కనీసం కడుపునిండా భోజనం చేసే అవకాశం కూడా కల్పించాలేమా? అనిపించింది.అప్పుడే నాకు ఈ ఆలోచనకలిగింది.సుబ్బుశాస్త్రి గారి లాంటి వాళ్ళకి మనము సాయం చేయాలి.దానికి ఒక చక్కటిప్రణాళిక వేసుకొని ఒక ట్రస్ట్గా ఏర్పడదాం .వీళ్ళల్లా ఆర్ధికంగా వెనకబడిన వాళ్ళకి మనం చేయగలిగినంత సాయం చేద్దాము. దానికి నీసహయం కావాలి,నువ్వే కాదు సాయం చెయ్యాలన్న సంకల్పం,ఉద్దేశ్యం ఉన్న,ఎవరైనా సరే.వాళ్ళందరనీమన ప్రాజెక్ట్ ద్వారా కూడగట్టుకొని,ఈమంచిపనిని ఆరంభిద్దాము” అనిఆవేశంగా అన్నారు. ఆయన సుబ్బు శాస్త్రిని చూసి బాగా కదిలిపోయారు అనుకున్నాడు భాస్కర్.


దానికి శ్రీపతిగారి భార్య,విజయ “అవును తప్పకుండా చేద్దాము నేను నా స్నేహితులకి చెబుతాను. ఒకమూడు నెలల లోఅన్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి వీళ్ళకి సాయం అందేలా చూద్దాము”అనిఆవిడ కూడా భర్త నిసమర్థించారు.


“మనదేశం, సంస్కృతీ,నదులు,వేదాలు అంటూ గొప్పగా చెప్పుకోవడమే కాదు,వాటిని రక్షించి ముందు తరాలకి ఇవ్వడం కూడా మనబాధ్యత.”


“తప్పకుండా బావగారు, ఈ పవిత్ర గోదావరి తీరాన ఇలాంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి.అందరికీ మనం సాయం చేయలేకపోయినా, కొందరికైనా చేద్దాము.ఒక ముందడగువేసాము. ఆ అడుగేమనలని ఆపకుండా సాగిపోయేలా చేస్తుంది.నేను సైతం ఈ పవిత్రమైన కార్యం లోభాగం పంచుకుంటాను”.అని భాస్కర్ కూడాశ్రీపతి,విజయలతో ఏకీభవిస్తూ అన్నాడు.


ఇవేమీ తెలియని శాస్త్రి, వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ “చూసావా వర్ధనం ఈ వేళ ఆదేవుడు పంపినట్లు గా వాళ్ళు ఇంత కుంభవృష్టి లోరావడం తండ్రికి ఆబ్దికంపెట్టి తర్పణాలు వదిలివెళ్ళడం మాములువిషయం కాదు. అంతా మనం నమ్ముకున్న ఆ తల్లి గోదావరి వల్లే.అందులోను ఎక్కడో కెనడా నుంచి వచ్చారుట.ఈ అఖండ గోదావరి దర్శనం కోసం,నిజంగా ఆ తల్లి నీడలో ఉండటం నిజంగా మనం చేసుకున్న పుణ్యమే. ” అని తాంబూలం లో ఉన్న నోట్లను లెక్కపెట్టుకొని నిర్ఘాంత పోయాడు. అక్షరాలా పదివేల రూపాయలు.ఉన్నాయి. “వర్ధనం ఏమిటో నాకు నమ్మబుద్ధి కావటం లేదు, నువ్వుఓ సారి లెక్కపెట్టి చూడు…” అన్నాడు ఖంగారుపడుతూ. ఆవిడ కూడా మళ్ళీ మళ్ళీ లెక్కపెట్టింది.“అవును,అచ్చంగా పదివేల రూపాయలే, యెంత దొడ్డ మనసు వాళ్లది” అని సంతోషంగాఅంటూ వాళ్ళు పెట్టిన చీర చూసుకుంటోంది


“అవును ఈ వేళ నిజంగా చాల సుదినం.నా వొంట్లో శక్తుడిగిపోయినా పర్వాలేదు తండ్రీ, కొంత కాలం దాన్ని మటుకు పునిస్త్రీ గానే ఉంచమనికోరుతున్నాను ఎందుకు అనుకుంటున్నావేమో, అదిఅలా ఐదో తనంతో ఉంటె అందరూ దాన్నిముత్తైదువ గ ఆదరిస్తారు. అప్పుడు దానితిండికి బట్టకి కొదవ లేకుండా ఉంటుంది అని”. సుబ్బుశాస్త్రి మనసులో అనుకున్నాడు.


ఉరకలేస్తూ ఉప్పొంగు తున్న గోదావరిని చూస్తూ “తల్లీ,ఏదోచాపల్యంతో నేనన్న మాటలు పట్టించుకోకుండా, కన్నతల్లిలా వాత్సల్యం చూపించి నన్ను కరుణించావు.” అంటూ భక్తిగా నమస్కరించాడు, సుబ్బుశాస్త్రి.


గోదావరి నిండుగా నవ్వి,నేనున్నానని ప్రేమగా నిమిరినట్లు అనిపించింది సుబ్బుశాస్త్రి కి.


*సేకరణ: కెయస్వీ కృష్ణారెడ్డి, 9492146689*

*ప్రధానోపాధ్యాయులు, జిల్లా పరిషత్ ఉన్నత* *పాఠశాల గంటి, కొత్తపేట *మండలం తూర్పుగోదావరి.*

www.bestsocialteacher.com 

********

_*Don't edit this story. Don't remove the writer's n collector's details. It is the only respect we can pay to them. If you wish Forward to all.*_

🙏💐🙏💐🙏💐🙏

కామెంట్‌లు లేవు: